ముహూర్తాల మోత మళ్లీ మొదలు
శుక్ర మౌఢ్యమి ముగింపుతో పెళ్లిసందడి జోరు
ఈనెల 19 నుంచి శుభకార్యాలకు స్వర్ణకాలం
పూల అలంకరణల హవా, ఖర్చులు లక్షల్లోకి
క్యాటరింగ్, ఫొటోగ్రఫీ రంగాలకు బంగారు కాలం
శుభముహూర్తాల రాకతో వ్యాపారాల్లో ఉత్సాహం
విజయనగరం గంటస్తంభం: మాఘమాసం అంటేనే పెళ్లిళ్లు, శుభకార్యాల మాసం అని పెద్దలు చెప్పకొంటారు. కానీ, ఈ ఏడాది శుక్ర మౌఢ్యమి కారణంగా మంచి ముమూర్తాలు దొరకక చాలామంది వేచి చూడాల్సి వచ్చింది. దాదాపు 80 రోజుల విరామం తర్వాత ఈ నెల 17తో శుక్ర మౌఢ్యమి ముగియనుండటంతో వివాహాలు, శుభకార్యాలకు మళ్లీ చైతన్యం వచ్చింది. పండితులు చెబుతున్నట్టుగా ఈనెల మూడో వారం నుంచే శుభముహూర్తాలు కలసి వస్తుండటంతో ఉమ్మడి జిల్లాలో పెళ్లిసందడి ఊపందుకోనుంది.
హడావిడి మొదలు..
గ్రామాలు, పట్టణాల్లోని వధూవరుల ఇళ్లలో ఏర్పాటు హడావిడి మొదలైంది. ఇప్పటికే అనేక కుటుంబాలు మండపాలు, పురోహితులు, అలంకరణల కోసం బుకింగ్స్ పూర్తి చేసుకున్నాయి. ఏడాది పొడవునా ముహూర్తాలు అనుకూలంగా ఉన్నాయనే వార్తతో పెళ్లిళ్ల సంఖ్య వేలల్లోకి చేరనుందని అంచనా.
కల్యాణ మండపాలకు భారీ డిమాండ్..
వివాహాలు, ఇతర శుభకార్యాల సీజన్ మొదలవుతుండటంతో కల్యాణ మండపాలు, హోటళ్లకు మంచి డిమాండ్ కనిపిస్తోంది. విజయనగరం జిల్లాలోని ప్రధాన పట్టణాలతో పాటు మండల కేంద్రాల్లోని మండపాలు వరుసగా బుక్ అవుతున్నాయి. మండపం స్థాయిని బట్టి అద్దెలు రూ.50 వేల నుంచి రూ.5 లక్షల వరకు పలుకుతున్నాయని నిర్వాహకులు చెబుతున్నారు. పెళ్లిళ్ల సీజన్ దృష్ట్యా బాజాభజంత్రీలు, షామియానా వ్యాపారులు, క్యాటరింగ్ సంస్ధలకు కూడా పని పెరిగింది. పెళ్లిళ్లకు వచ్చే బంధువుల కోసం లాడ్జీలు, హోటళ్లు ముందుగానే రిజర్వ్ అవుతున్నాయి.
పూల అలంకరణల హవా...
వివాహాల్లో ప్రధాన ఆకర్షణగా నిలిచే పూల అలంకరణలకు ఈసారి ప్రత్యేక ఆదరణ కనిపిస్తోంది. అలంకరణ రకం, డిజైన్ను బట్టి ఖర్చులు రూ.30 వేల నుంచి రూ.5 లక్షల వరకు ఉంటున్నాయి. తూర్పుగోదావరి జిల్లా కడియంతో పాటు చెన్నై, బెంగళూరు ప్రాంతాల నుంచి తాజా పూల రకాలను తెప్పిస్తున్నారు. ఫొటోగ్రాపర్లు, వీడియోగ్రాఫర్లు, మేకప్ ఆర్టిస్టులకు కూడా బిజీ షెడ్యూల్ మొదలైంది. పురోహితులు సైతం ముందస్తుగానే బుక్ అయిపోతుండటంతో తేదీలకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేసుకోవాలని కుటుంబాలకు సూచిస్తున్నారు.
గ్రామీణ వాతావరణంలో పెళ్లి హడావిడి
గ్రామల్లో అయితే పెళ్లి పనుల సందడి మరో రకంగా కనిపిస్తోంది. ఇళ్ల ముందర పందిళ్లు, ఊరంతా వెలుగులు, బంధువుల రాకపోకలు..మళ్లీ ఆ పాత హుషారు తిరిగి వస్తోందని పెద్దలు అంటున్నారు. వ్యాపార వర్గాలు కూడా ఈ సీజన్పై ఆశలు పెట్టుకున్నాయి. మొత్తం మీద శుభముహూర్తాల రాకతో ఉమ్మడి జిల్లాలో పెళ్లిసందడి పండుగ వాతావరణాన్ని తలపిస్తోంది.

ముహుర్తాల కోసం ఎదురుచూపులు ముగిశాయి
శుక్ర మౌఢ్యమి ఈ నెల 17తో ముగియనుండటంతో శుభకార్యాలకు ఏర్పడిన విరామం తొలగింది. ఈనెల 19 నుంచి మే రెండో వారం వరకు వరుసగా మంచి ముహూర్తాలు ఉన్నాయి. వివాహాలకు ఇది అనుకూల సమయమని సూచించారు.
– జయంతి ప్రవీణ్కుమార్, సిద్ధాంతి, జగ్గాపురం


