లాగవుట్ అవ్వగానే మార్కుల లెక్క
ఈ ఏడాది నుంచే అమలు దరఖాస్తులో తప్పులుంటే పట్టేసే సాఫ్ట్వేర్
మొబైల్ నుంచీ అప్లై చేసే అవకాశం.. పరీక్షకు 11 పట్టణాల ఎంపిక
రేపట్నుంచే ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ
వెల్లడించిన సెట్ కన్వీనర్ ప్రొఫెసర్ కె.విజయకుమార్రెడ్డి
సాక్షి, హైదరాబాద్: సాంకేతికతను జోడించి ఈసారి మరింత మెరుగైన రీతిలో ఎప్సెట్ను నిర్వహిస్తున్నామని సెట్ కనీ్వనర్ ప్రొఫెసర్ కె.విజయకుమార్ రెడ్డి తెలిపారు. కంప్యూటర్ లాగవుట్ అయిన వెంటనే మార్కులు డిస్ప్లే అవుతాయని తెలిపారు.ఈ మార్కుల ఆధారంగా ఎంత ర్యాంకు వస్తుందో సెట్ పూర్తయిన మరుక్షణమే తెలుసుకోవచ్చని చెప్పారు. దీన్ని ఈ ఏడాది నుంచే ప్రవేశ పెడుతున్నట్లు చెప్పారు. మే నెలలో జరిగే ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ ఉమ్మడి ప్రవేశ పరీక్ష (ఏప్సెట్)కు ఈ నెల19వ తేదీ నుంచి ఆన్లైన్ దరఖాస్తులు స్వీకరిస్తారు.
ఈ నేపథ్యంలో జేఎన్టీయూహెచ్లో మంగళవారం ఆయన విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి, కార్యదర్శి శ్రీరాం వెంకటేశ్, మండలి వైస్ ఛైర్మన్లు ప్రొఫెసర్లు ఇటిక్యాల పురుషోత్తం, ఎస్కే మహమ్మూద్, జేఎన్టీయూహెచ్ వీసీ ప్రొఫెసర్ టికేకే రెడ్డి, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ వెంకటేశ్వరరావు, సెట్ ఉప కన్వీనర్ ప్రొఫెసర్ బాలూనాయక్ తదితరులు పాల్గొన్నారు. సెట్కు ఏప్రిల్ 4 వరకూ దరఖాస్తులు స్వీకరిస్తామని, ఇదే నెల 23న హాల్ టిక్కెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చని తెలిపారు. రూ. 10 వేల ఫైన్తో పరీక్ష మొదలయ్యే రెండు రోజుల ముందు (ఏప్రిల్ 2 వరకూ) దరఖాస్తు చేసుకునే అవకాశం కలి్పస్తున్నట్టు చెప్పారు. ఆయన ఇంకా ఏం చెప్పారంటే...
తప్పు చేశారో... ఇట్టే పట్టేస్తుంది!
ఇంటర్ బైపీసీ విద్యార్థులు అగ్రికల్చర్, ఫార్మసీ సెట్కు, ఎంపీసీ విద్యార్థులు ఇంజనీరింగ్ సెట్కు మాత్రమే దరఖాస్తు చేయాలి. కానీ ఆన్లైన్లో ఇందుకు విరుద్ధంగా దరఖాస్తు చేస్తున్నారు. దీనివల్ల ఆఖరి నిమిషంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ ఏడాది నుంచి ఈ సమస్య ఉండదు. ఇంటర్ బోర్డ్తో సమన్వయం చేసుకుని ఇంటర్ హాల్ టిక్కెట్ను ఆన్లైన్ ద్వారా సెట్కు అనుసంధానం చేస్తున్నారు. దీనివల్ల విద్యార్థి తప్పు చేస్తే సాఫ్ట్వేర్ గుర్తిస్తుంది. ఈ విషయాన్ని విద్యార్థికి చెప్పేందుకు హెల్ప్లైన్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. హెల్ప్లైన్ నుంచి వెంటనే విద్యార్థి రిజిస్టర్ మొబైల్కు ఫోన్ వెళ్తుంది. సెట్కు హాజరైన విద్యార్థులు ప్రాథమిక కీ విడుదలవ్వగానే తప్పులుంటే తెలియజేయవచ్చు. అయితే గత ఏడాది మాదిరిగానే ఈసారి ప్రతీ సందేహానికి రూ. 500 చెల్లించాలి.

లేవనెత్తిన తప్పు నిజమని తేలితే సొమ్ము వాపస్ ఇస్తారు. విద్యార్థి తన మొబైల్ నుంచే ఏప్సెట్ దరఖాస్తు చేసుకునే అవకాశం ఈసారి కొత్తగా కలి్పంచారు. ఇందుకు అవసరమైన సాఫ్ట్వేర్ను రూపొందించారు. ఇప్పటి వరకూ విద్యార్థి మీ సేవ కేంద్రం నుంచి దరఖాస్తు చేసేవాళ్ళు. దీనివల్ల కేంద్రం నిర్వాహకుడు దరఖాస్తులు తప్పుగా నింపుతున్నారు. ఇది చివరి నిమిషంలో సమస్యలకు తావిస్తోంది. దీన్ని దృష్టిలో ఉంచుకునే మొబైల్ కంపాటబులిటీ తీసుకొచ్చారు. ఈ సందర్భంగా జేఎన్టీయూహెచ్ వీసీగా బాధ్యతలు చేపట్టి ఏడాది పూర్తయిన సందర్భంగా తన హయాంలో జరిగిన పురోగతిని వీసీ ప్రొఫెసర్ టికెకె రెడ్డి వివరించారు.
ఈ పట్టణాల్లో పరీక్ష
రాష్ట్రవ్యాప్తంగా 16 పట్టణాల్లో ఏప్సెట్ జరుగుతుంది. వీటి పరిధిలో 57 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. హైదరాబాద్ పరిధిలో నాలుగు జోన్లు ఉంటాయి. ఈ జోన్లల్లో 32 పరీక్ష కేంద్రాలు ఉంటాయి. హైదరాబాద్ (4 జోన్లు), నల్గొండ, కోదాడ, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, సత్తుపల్లి, కరీంనగర్, సిద్దిపేట, మహబూబ్నగర్, సంగారెడ్డి, ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్ పట్టణాల్లో పరీక్ష కేంద్రాలుంటాయి. బాలికలకు ఈసారి సమీపంలోనే పరీక్ష కేంద్రం ఉండేలా జాగ్రత్తలు తీసుకోనున్నారు. ఫైన్తో దరఖాస్తు చేసే విద్యార్థులకు హైదరాబాద్లో మాత్రమే పరీక్ష కేంద్రాలు ఉంటాయి.


