కేక్ కట్ చేస్తున్న కేటీఆర్. చిత్రంలో హరీశ్రావు, తలసాని, శ్రీనివాస్ గౌడ్ తదితరులు
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్
తెలంగాణ జాతి గౌరవాన్ని ప్రశ్నించే వారికి చరిత్రే సమాధానం ఇస్తుంది
కేసీఆర్ ఒక శిఖరం.. తెలంగాణనే కేసీఆర్ ఆనవాలు అన్న మాజీమంత్రి
తెలంగాణ భవన్లో ఘనంగా కేసీఆర్ జన్మదిన వేడుకలు
సాక్షి, హైదరాబాద్: ‘తెలంగాణలో రెండే జాతులు ఉన్నాయి. ఒకటి తెలంగాణ పోరాట యోధుల జాతి, మరొకటి తెలంగాణ ద్రోహుల జాతి. మాది ఫైటర్స్ జాతి, వారిది ద్రోహుల జాతి..’అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు ఘాటుగా వ్యాఖ్యానించారు. తెలంగాణ జాతి గౌరవాన్ని ప్రశ్నించే వారికి చరిత్రే సమాధానం ఇస్తుందని అన్నారు. ‘జాతి అంటే ఏమిటో లాఠీ దెబ్బలు తిన్నవారికి, జైళ్లు చూసినవారికి, ఉద్యమాల్లో రక్తం చిందించిన వారికే తెలుస్తుంది. ఉద్యమాల ఉగ్గుపాలు తాగిన వారికే తెలంగాణ అస్తిత్వం అర్థమవుతుంది..’అని చెప్పారు. మంగళవారం బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కె.చంద్రశేఖర్రావు జన్మదిన వేడుకలు పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్లో భారీ ఎత్తున నిర్వహించారు. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్, సికింద్రాబాద్ పార్లమెంట్ బీఆర్ఎస్ ఇన్చార్జి తలసాని సాయికిరణ్ యాదవ్ ఆధ్వర్యంలో 72 కిలోల భారీ కేక్ను కేటీఆర్ కట్ చేశారు. పార్టీ శ్రేణులను ఉద్దేశించి మాట్లాడారు. ఇటీవల కేసీఆర్పై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చేసిన విమర్శలపై ఆయన పేరెత్తకుండా ఘాటుగా స్పందించారు.
ద్రోహులకు జాతి నిర్వచనం ఎట్లా తెలుస్తది?
‘కొంతమంది ఆనవాళ్లు చెరిపేస్తామని మాట్లాడుతున్నారు. జాతి మీద, జాతి గౌరవం మీద ఎవరు పడితే వాళ్లు మాట్లాడుతున్నారు. కానీ కేసీఆర్ ఒక శిఖరం. తెలంగాణనే కేసీఆర్ ఆనవాలు. ఈ రాష్ట్రమే కేసీఆర్ ఆనవాలు. దాన్ని ఎట్లా చెరిపేస్తావు? తెలంగాణ మట్టితో మమేకమైన వాడికి, ఉద్యమాల ఉగ్గుపాలు తాగిన వాడికి, ఆత్మగౌరవ పోరాటంలో కలిసి నడిచిన వాళ్లకి మాత్రమే జాతి అంటే ఏంటో, జాతి గౌరవం అంటే ఏంటో తెలుస్తుంది. సకల జనులు స్వరాష్ట్ర సమరంలో తెగించి కొట్లాడుతున్నప్పుడు, ప్రాణాలకు తెగించి మన నాయకుడు నిరాహార దీక్ష చేస్తున్నప్పుడు, సమైక్యాంధ్ర వాదుల సంచులు మోసిన సన్నాసులకు జాతి తెలవదు, నీతి తెలవదు. ఆ రోజు తుపాకులు తీసుకుని ఉద్యమకారుల మీద దాడికి వెళ్లిన ద్రోహులకు జాతి నిర్వచనం ఎట్లా తెలుస్తది? రక్తంలో పౌరుషం ఉంటే, డీఎన్ఏలో ఉద్యమం ఉంటే, ఆత్మాభిమానం అనేది ఎక్కడన్నా నీ శరీరంలో ఉంటే నీకు జాతి అంటే ఏందో, జాతి చరిత్ర అంటే ఏందో తెలుస్తది..’అంటూ కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
కేసీఆర్ తెలంగాణ జాతి మొత్తానికి హీరో
‘కేసీఆర్.. ఏ జాతికి నువ్వు జాతి పిత? ఏ జాతి నీది అని మాట్లాడుతున్నాడు? రాజ్యతంత్రం నడిపిన రాణి రుద్రమ్మ జాతి మాది. జల్, జంగల్, జమీన్ అని కొట్లాడిన కొమురం భీమ్, అస్తిత్వం కోసం అమరులైన సమ్మక్క సారలమ్మ, పరాయి పాలనపై పోరాడి తెలంగాణ అస్తిత్వాన్ని నిలిపిన సర్వాయి పాపన్న, దొడ్డి కొమురయ్య, చాకలి ఐలమ్మ, భాగ్యరెడ్డి వర్మ, తుర్రేబాజ్ ఖాన్, కాళోజీ, దాశరథి వంటి మహనీయుల జాతి మాది. 1952లో ‘గైర్ ముల్కీ గో బ్యాక్‘ అని నెత్తుటి త్యాగాలు చేసిన విద్యార్థి అమరవీరుల జాతి మాది. 69లో కర్కశ కాంగ్రెస్కు వ్యతిరేకంగా పోరాటంలో అసువులు బాసిన 369 మంది యువ కిశోరాల జాతి మాది. మలిదశ ఉద్యమంలో ఢిల్లీ మెడలు వంచిన తెలంగాణ జాతి మాది. మేము మీలా ఢిల్లీకి సలాం కొట్టి బతికే సామంతులం కాదు. మాది సామంతుల జాతి కాదు..స్వతంత్రుల జాతి. గిరి గీసి కొట్లాడే తెగువ ఉన్న కేసీఆర్ జాతి మాది. కేసీఆర్ తాను జాతి పితనని ఎన్నడూ చెప్పుకోలేదు. ప్రజలే ఆయన్నలా పిలుచుకున్నారు. నా తండ్రి తెలంగాణకు హీరో, తెలంగాణ జాతి మొత్తానికి హీరో..’అని కేటీఆర్ వ్యాఖ్యానించారు.
మళ్లీ ముఖ్యమంత్రిని చేయడమే బర్త్డే గిఫ్ట్
‘తెలంగాణ కోసం కేసీఆర్ జెండా ఎత్తిన కాలంలో రాష్ట్రంలో తెలుగుదేశం, వందేళ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్, జాతీయ పార్టీ బీజేపీ వంటి మూడు బలమైన రాజకీయ శక్తులు ఉన్నాయి. మీడియా పవర్ లేదు, మనీ పవర్ లేదు, మజిల్ పవర్ లేదు, కుల బలం లేదు. ఉన్నదల్లా తెలంగాణ జాతికి న్యాయం చేయాలనే సంకల్పం మాత్రమే. ఆ సంకల్పమే కేసీఆర్ను మొండి ధైర్యంతో ముందుకు నడిపించింది. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించింది. కేసీఆర్ లాంటి మహా నాయకుడిని మళ్ళీ ముఖ్యమంత్రిని చేయడమే ఆయనకు మనం ఇచ్చే చిరుకానుక..’అని కేటీఆర్ అన్నారు. కేక్ను కట్ చేసి మాజీ మంత్రి హరీశ్రావుకు తినిపించారు. మాజీ మంత్రులు శ్రీనివాస్గౌడ్, లక్ష్మారెడ్డి, దాసోజు శ్రవణ్కుమార్, పాడి కౌశిక్ రెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.


