ఉదయం 10 గంటలకు విష్వక్సేన ఆరాధనతో శ్రీకారం చుట్టనున్న అర్చకులు
యాదగిరిగుట్ట: గొప్ప ఆధ్యాత్మిక క్షేత్రంగా విరాజిల్లుతున్న యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలకు ప్రధానాలయం సర్వం సిద్ధమైంది. బుధవారం నుంచి ఈనెల 28వ తేదీ వరకు 11 రోజులపాటు ఉత్సవాల నిర్వహణకు ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. బ్రహ్మోత్సవాలకు ఇప్పటికే రూ.2 కోట్ల బడ్జెట్ను కేటాయించారు.
ఇప్పటికే ఆలయాన్ని విద్యుద్దీపాలు, పూలు, మామిడి, అరటి తోరణాలతో అలంకరించారు. ఇక శ్రీస్వామి వారి బ్రహోత్సవాల నేపథ్యంలో ఈనెల 18 నుంచి 28 వరకు నిత్యకల్యాణం, సుదర్శన నారసింహ హోమం, బ్రహ్మోత్సవం లాంటి ఆర్జిత సేవలను అధికారులు రద్దు చేశారు.
11 రోజుల షెడ్యూల్ ఇలా..
» 18న ఉదయం 10 గంటలకు విష్వక్సేన ఆరాధన, స్వస్తివాచనం, రక్షాబంధనం, సాయంత్రం మృత్సంగ్రహణం, అంకురారోపణం.
» 19న ఉదయం 8 గంటలకు అగ్నిప్రతిష్ట, 11 గంటలకు ధ్వజారోహణం, సాయంత్రం 6.30 గంటలకు భేరీపూజ, దేవతాహ్వానం, హవనం.
» 20న ఉదయం అలంకార, వాహన సేవలకు శ్రీకారం చుడతారు.ఉదయం 9 గంటలకు మత్సా్యవతార అలంకార సేవ, వేదపారాయణం. రాత్రి 7 గంటలకు శేషవాహన సేవ.
» 21న ఉదయం 9 గంటలకు వటపత్రశాయి అలంకార సేవ, రాత్రి 7 గంటలకు హంస వాహన సేవ.
» 22న ఉదయం 9గంటలకు శ్రీకృష్ణాలంకార (మురళీ కృష్ణుడి) సేవ, రాత్రి 7 గంటలకు పొన్న వాహన సేవ.
» 23న ఉదయం 9 గంటలకు గోవర్ధనగిరిధారి అలంకార సేవ, రాత్రి 7 గంటలకు సింహ వాహన సేవ.
» 24న ఉదయం 9 గంటలకు జగన్మోహిని అలంకార సేవ, రాత్రి 8 గంటలకు అశ్వవాహనసేవ, అనంతరం 8.45 గంటలకు శ్రీస్వామి వారి ఎదుర్కోలు ఉత్సవం.
» 25న ఉదయం 9 గంటలకు శ్రీరామ అలంకారము (హనుమంత వాహనం) సేవ, రాత్రి 9 గంటల నుంచి గజవాహన సేవ, రాత్రి 9.30 గంటలకు శ్రీస్వామి అమ్మవార్ల తిరుకల్యాణోత్సవం.
» 26న ఉదయం 9 గంటలకు శ్రీ మహావిష్ణు అలంకార గరుడ వాహన సేవ, రాత్రి 7.30 గంటల నుంచి దివ్య విమాన రథోత్సవం.
» 27న ఉదయం 9.30 గంటలకు మహా పూర్ణాహుతి, విష్ణు పుష్కరిణిలో చక్రతీర్థం, సాయంత్రం 7 గంటలకు శ్రీపుష్పయాగం, ద్వాదశి ఆరాధన, దేవతోద్వాసన, దోపు ఉత్సవం.
» 28వ తేదీన ఉదయం 10 గంటలకు శ్రీస్వామి వారికి అష్టోత్తర శతఘటాభిషేకం, రాత్రి 9 గంటలకు శ్రీస్వామి వారి శృంగార డోలోత్సవం, ఉత్సవాలు సమాప్తి.


