‘పట్నం’ చైర్మన్‌ ఎన్నికపై హైకోర్టు స్టే | Municipal Chairman and Vice Chairman elections postponed | Sakshi
Sakshi News home page

‘పట్నం’ చైర్మన్‌ ఎన్నికపై హైకోర్టు స్టే

Feb 18 2026 4:40 AM | Updated on Feb 18 2026 4:40 AM

Municipal Chairman and Vice Chairman elections postponed

మున్సిపల్‌ చైర్మన్, వైస్‌ చైర్మన్‌ ఎన్నిక వాయిదా 

తదుపరి ఆదేశాలిచ్చే వరకు నిలిపివేసిన హైకోర్టు 

వార్డు కౌన్సిలర్‌ యాదగిరిని హాజరుపర్చాలని ఆదేశం

సాక్షి, హైదరాబాద్‌: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సి పల్‌ వార్డు కౌన్సిలర్‌ ఆకుల యాదగిరిని బుధవారం తమ ముందు హాజరుపరచాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. యాదగిరి అదృశ్యం కావడంతో ము న్సిపల్‌ చైర్మన్, వైస్‌చైర్మన్‌ ఎన్నిక నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి ఆదేశాలిచ్చే వరకు ఈ ఉత్తర్వులు అమల్లో ఉంటాయని పేర్కొంది. 

అయితే, మధ్యాహ్నం ధర్మాసనం ముందు ప్రభుత్వ న్యాయవాది హాజరై యాదగిరి కనిపించారని, ఎన్నిక నిర్వహణకు అనుమతి ఇవ్వాలని కోరారు. దీనికి ధర్మాసనం అంగీకరించలేదు. యాదగిరిని ఆయన భార్యతోపాటు తమ ముందు హాజరుపరచాలని తేల్చిచెప్పింది. ఈ విషయంపై వివరాలు సమర్పించేందుకు అమికస్‌ క్యూరీగా న్యాయవాది రామకృష్ణారెడ్డిని నియమిస్తూ, విచారణ వాయిదా వేసింది. 

ఇబ్రహీంపట్నం 19వ వార్డు కౌన్సిలర్‌గా ఎన్నికైన తన తండ్రి యాదగిరి కనిపించడం లేదని, పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేదంటూ ఆకుల హరికాంత్‌ హైకోర్టులో బుధవారం లంచ్‌మోషన్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. ఉదయం 11 గంటలకే ఎన్నిక ఉందని చెప్పడంతో వెంటనే జస్టిస్‌ మౌషుమీ భట్టాచార్య, జస్టిస్‌ గాడి ప్రవీణ్‌కుమార్‌ ధర్మాసనం విచారణ చేపట్టింది.  

వాస్తవాలు తెలియాల్సి ఉంది..: పిటిషనర్‌ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ‘ఒక పార్టీకి చెందిన 14 మంది కౌన్సిలర్లను 13న బొంగులూరులోని ఓ ఫంక్షన్‌ హాల్‌కు తరలించారు. అనంతరం అందరినీ బయటకు పంపి యాదగిరిని మాత్రం పంపలేదు. చైర్మన్‌ రేసులో ఉన్న యాదగిరిని బీఆర్‌ఎస్‌ నేత, మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, ఆయన కుమారుడు ప్రశాంత్‌రెడ్డి కిడ్నాప్‌ చేసినట్లు అనుమానం ఉంది. దీనిపై 15న యాదగిరి భార్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయినా ఎలాంటి ఫలితం లేకపోవడంతో హైకోర్టును ఆశ్రయించారు. 

యాదగిరికి ప్రాణహాని ఉంది’అని పేర్కొన్నారు. ప్రభుత్వం తరఫున స్పెషల్‌ జీపీ పొట్టిగారి శ్రీధర్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. ‘పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గడువిస్తే హాజరుపరుస్తారు’అని చెప్పారు. వాదనలను విన్న ధర్మాసనం.. చైర్మన్, వైస్‌చైర్మన్‌ ఎన్నిక నిలిపివేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ విషయాన్ని కలెక్టర్, ఎన్నికల రిటర్నింగ్‌ అధికారిగా ఉన్న ఆర్డీవోలకు వెంటనే తెలియజేయాలని చెబుతూ విచారణ 19కి వాయిదా వేసింది.  

బీఆర్‌ఎస్‌ అభ్యర్థులతో కలిసి హాజరైన యాదగిరి 
ఇబ్రహీంపట్నం: ఇబ్రహీంపట్నం మున్సిపల్‌ చైర్మన్, వైస్‌చైర్మన్‌ ఎన్నికలో మంగళవారం సైతం ఉత్కంఠ కొనసాగింది. స్వతంత్ర అభ్యర్థి ఆకుల యాదగిరిని కి డ్నాప్‌ చేశారన్న నేపథ్యంలో ఎన్నికను మంగళవారానికి వాయిదా వేసిన విషయం తెలిసిందే. ఈ అంశం కోర్టు పరిధిలోకి వెళ్లడంతో, న్యాయస్థానం స్టే విధించిందని చెబుతూ ఎన్నికను వాయిదా వేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.  

నోటీసు ఇవ్వలేదని గొడవ..: జిల్లా ఎన్నికల అబ్జర్వర్‌ మయాంక్‌ మిట్టల్, ఎన్నికల అధికారి, ఆర్డీవో అనంతరెడ్డి ఉదయం 11 గంటలకు కౌన్సిల్‌ సమావేశం ఏర్పాటు చేశారు. బీఆర్‌ఎస్‌ కౌన్సిలర్లతో కలిసి ఆకుల యాదగిరి సమావేశానికి రాగా, ఆ తర్వాత కాంగ్రెస్‌ కౌన్సిలర్లు చేరుకున్నారు. మీటింగ్‌ ప్రారంభమైన అనంతరం కాంగ్రెస్‌ కౌన్సిలర్లు ఎన్నికల అధికారులతో వాగ్వాదానికి దిగడంతో గందరగోళం నెలకొంది. మయాంక్‌ మిట్టల్‌ సమావేశం మధ్యలో నుంచే వెళ్లిపోయారు. 

ఎక్స్‌అఫీషియో ఓటర్, ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డికి ఎన్నికల నోటీసు అందజేయలేదని కాంగ్రెస్‌ కౌన్సిలర్లు గొడవ చేయడంతో పోలీసులు వారిని బయటకు తీసుకొచ్చారు. అనంతరం ఎన్నికల ప్రక్రియను నిర్వహించిన అధికారులు మెజార్టీ సభ్యులు చైర్మన్‌గా బీఆర్‌ఎస్‌కు చెందిన టేకుల సుదర్శన్‌రెడ్డిని బలపర్చినట్లు సంతకాలు చేశారు. అనంతరం ఎన్నికలపై న్యాయస్థానం స్టే ఇచ్చిందని చెబుతూ, ధ్రువీకరణ పత్రం ఇవ్వకుండా ఆపేశారు.  కాగా, కోర్టు ఆదేశాల నేపథ్యంలో యాదగిరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement