కోరినంత ఇవ్వలేం..నాణ్యమైంది అస్సల్లేదు | Singareni gives shock to Telangana Genco | Sakshi
Sakshi News home page

కోరినంత ఇవ్వలేం..నాణ్యమైంది అస్సల్లేదు

Feb 18 2026 4:44 AM | Updated on Feb 18 2026 4:44 AM

Singareni gives shock to Telangana Genco

జెన్‌కోకు సింగరేణి షాక్‌ 

ఈ నెల 4నే లేఖ.. ఆలస్యంగా బహిర్గతం 

యాదాద్రి ప్లాంట్‌కు కష్టాలు తప్పవా?

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ జెన్‌కోకు సింగరేణి షాక్‌ ఇచ్చింది. విద్యుత్‌ ఉత్పత్తికి అవసరమైన మేర బొగ్గు సరఫరా చేయలేమంటూ చేతులెత్తేసింది. నాణ్యమైన బొగ్గు అడగొద్దంటూ తేల్చి చెప్పింది. ఈ మేరకు ఈ నెల 4వ తేదీన జెన్‌కో అధికారులకు అధికారికంగా లేఖ రాసినట్టు సమాచారం. సింగరేణి యాజమాన్యం ఇచ్చిన షాక్‌ నుంచి తేరుకోని అధికారులు ఈ విషయాన్ని గోప్యంగా ఉంచగా.. తాజాగా ఈ లేఖ బయటకు పొక్కింది. 

కాగా మంగళవారం అత్యవసరంగా సమావేశమైన బోర్డు డైరెక్టర్లు.. ఊహించని పరిస్థితి నుంచి బయటపడటానికి మార్గాన్వేషణ చేస్తున్నారు. యాదాద్రి థర్మల్‌ యూనిట్లను వాణిజ్య ఉత్పత్తిలోకి తెచ్చిన సమయంలో సింగరేణి వెనక్కు తగ్గడంపై చర్చలు జరిపారు. విదేశీ బొగ్గు తేవడమా? తెస్తే భరించే శక్తి ఉంటుందా? ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుంది? అనే అంశాలను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.  

యాదాద్రికి తిప్పలే..! 
ఈ వేసవిలో తెలంగాణ విద్యుత్‌ డిమాండ్‌ గరిష్ట స్థాయికి చేరే వీలుందని అంచనా వేస్తున్నారు. దీన్ని తట్టుకోవడానికి యాదాద్రి విద్యుత్‌ ఉత్పత్తి కీలకమని భావించారు. అన్ని యూనిట్లలో ఉత్పత్తి భారీగా పెంచాలని నిర్ణయించారు. తెలంగాణలో­ని థర్మల్‌ యూనిట్లకు రోజుకు లక్ష మెట్రిక్‌ టన్ను­ల బొగ్గు అవసరం. ఇందులో 50 శాతం నాణ్యమైన బొగ్గు కావాలి. అంటే కనీసం 5 వేల ఉష్ణశక్తి (జీసీవీ) ఉండేలా చూసుకోవాలి. కొత్తగా నిర్మించి­న యాదాద్రి థర్మల్‌ యూనిట్లకు అత్యధిక ఉష్ణశక్తి (జీసీవీ) బొగ్గు వాడాల్సి ఉంది. 

అయితే ప్రస్తుతం సింగరేణి బొగ్గు 3,500 జీసీవీకి మించి రాదని అధికారులు ఆలస్యంగా తేల్చారు. ఈ బొగ్గును కూడా పూర్తి స్థాయిలో అందించలేమని సింగరేణి అధికారులు వెల్లడించడంతో యాదాద్రి ప్లాంట్‌కు ఈ వేసవిలో కష్టాలు తప్పేట్టు లేదు. నైనీ కోల్‌ బ్లాక్‌ వివాదం అవ్వడం, బొగ్గు ఉత్పత్తి లక్ష్యానికి ఆమడ దూరంలో ఉండటం వల్ల సింగరేణిని ఎంత ఒత్తిడి చేసినా ప్రయోజనం లేకుండా పోతోంద­ని జెన్‌కో అధికారులు చెబుతున్నారు. కాగా, విదేశీ బొగ్గు దిగుమతిపై జెన్‌కో అధికారులు దృష్టి పెడుతున్నారు. 

అయితే ఇది సంస్థపై భారీగా ఆర్థిక భా­రం మోపుతుంది. అంతిమంగా ప్రజలపై విద్యుత్‌ చార్జీల రూపంలో భారం పడే అవకాశం ఉంది. సింగరేణి బొగ్గు మెట్రిక్‌ టన్ను రూ.5 వేల నుంచి 6 వేల వరకూ లభిస్తుంది. అదే ఆస్ట్రేలియా నుంచి దిగుమతి చేసుకునే బొగ్గు మెట్రిక్‌ టన్ను రూ.12 వేల వరకూ ఉంటుంది. అంటే రెట్టింపు ధర పెట్టా­ల్సి ఉంటుంది. ఈ పరిస్థితిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలని జెన్‌కో అధికారులు భావిస్తున్నారు. మరోవైపు నాణ్యమైన బొగ్గు సరఫరా గురించి సింగరేణి యాజమాన్యంతో సంప్రదింపులు జరుపు­తున్నట్లు జెన్‌కో సీఎండీ హరీశ్‌ చెప్పారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement