పరీక్షలు వస్తే... పిల్లలు ఎలా ఉండాలో చెప్పడంతోపాటు తల్లిదండ్రులు ఎలా ఉండాలో కూడా చెప్పాల్సి వస్తోంది. ఇరు పక్షాలు బాగా వత్తిడి ఎదుర్కోక తప్పని సమయం ఇది. చదువు ముఖ్యమే అయినా పిల్లల శక్తి, స్వభావం గమనించుకుని తల్లిదండ్రులు తమను తాము అర్థం చేసుకుని ప్రశాంత వాతావరణం నెలకొల్పాల్సిన సమయం ఇదని అంటున్నారు నిపుణులు.
ఫిబ్రవరి వచ్చిందంటే పరీక్షల కాలం మొదలైనట్లే.
ఏడాది మొత్తం చదివినదంతా ఈ పరీక్షల్లో రాసి, మంచి మార్కులు తెచ్చుకోవాలి. లేకపోతే అమ్మా నాన్న ఏమనుకుంటారోనని పిల్లల టెన్షన్. అదే సమయంలో పిల్లలకు తక్కువ మార్కులు వస్తే ఇరుగూ పొరుగూ వారు ఏమనుకుంటారోనని తల్లిదండ్రులకు టెన్షన్. ఇంత టెన్షన్ అవసరమా? ఎగ్జామ్స్ వస్తే ఇళ్లు ప్రశాంతంగా ఉండటం మంచిదేగాని చీమ చిటుక్కుమంటే వినిపించే నిశ్శబ్దంతో ‘పిల్లాడు చదువుకుంటున్నాడు. అరవకండి’ అనే గుసగుసలతో విడ్డూరంగా ఉండటం సమంజసమా? పరీక్షలు రాయాలి కాబట్టి పిల్లలకు టెన్షన్ ఉంటుంది. తల్లిదండ్రులు కూడా ఒత్తిడితో ఆరోగ్యంపాడుచేసుకోవాల్సిన అవసరం లేదని అంటున్నారు నిపుణులు.
తల్లులూ... జాగ్రత్త
పరీక్షల్లో మార్కులు బాగా రావాలని చాలామంది విద్యార్థులు రాత్రిపూట చదువుకుంటూ ఉంటారు. పిల్లలు వద్దంటున్నా కొందరు పెద్దలు నిద్రమానేసి వారి పక్కనే కూర్చుంటారు. నిద్రపోకుండా టీ, కాఫీ వంటివి అందిస్తుంటారు. కలత నిద్రతోనే పొద్దున్న లేచి మళ్లీ అన్ని పనులు చేస్తుంటారు. ఈ నిద్రలేమి వారిపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోందని నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా రోజంతా ఇంటి పనులు చేసే తల్లులు రాత్రుళ్లు నిద్రపోకపోవడంతో అలసిపోయి అనారోగ్యం బారిన పడుతున్నారని అంటున్నారు. పరీక్షల వేళ పిల్లల ఆరోగ్యం ఎంత ముఖ్యమో తల్లి ఆరోగ్యం కూడా అంతే ముఖ్యం.
తండ్రులూ... శాంతం
పిల్లలకు మంచి మార్కులు రావాలని తల్లిదండ్రులు కోరుకోవడం సహజం. అయితే కొందరు తండ్రులు తమ పిల్లలే ఫస్ట్ రావాలన్న పట్టుదలతో ఉంటారు. పరీక్షల సమయంలో పిల్లలకన్నా వీరే ఎక్కువ టెన్షన్ పడుతుంటారు. చదువుతున్న పిల్లల్ని గదమాయించడం, అన్నీ చదివావా అని మాటిమాటికీ అడగటం, కాసేపు పక్కన వెళ్లినా కసురుకోవడం, వేరేవాళ్లతో కలవనివ్వకుండా చదవమనడం వంటివి చేస్తుంటారు. పిల్లలు పరీక్ష సరిగ్గా రాస్తారా లేదా అన్న భయంతో బీపీ తెచ్చుకోవడం, కళ్లు తిరిగి పడిపోవడం వంటివీ జరుగుతుంటాయి. ఇవన్నీ చిన్నారుల మీద నెగెటివ్ ఎఫెక్ట్ చూపి, వారిని మరింత అభద్రతకు గురిచేస్తాయని నిపుణులు అంటున్నారు. దీనివల్ల అటు తల్లిదండ్రుల శారీరక ఆరోగ్యం దెబ్బతింటే, ఇటు విద్యార్థుల మానసిక ఆరోగ్యానికి ఇబ్బంది కలుగుతుందని అంటున్నారు. కాబట్టి పరీక్షల వేళ శాంతం వహించి చదివించాలి.
చిరాకు తెప్పిస్తే ఎలా?
పరీక్షలు వస్తే తల్లిదండ్రుల రోజువారీ కార్యక్రమాలు మారిపోతుంటాయి. పొద్దున్నే లేచి పిల్లల్ని లేపడం, వారిని చదువుకోమని చెప్పి పనులు చేసుకోవడం, ఎవరినీ ఇంటికి రానివ్వకుండా కట్టుదిట్టం చేయడం వంటివి చేస్తుంటారు. బయటకు వెళ్లాల్సిన పనులను వాయిదా వేసి 24 గంటలూ పిల్లల పక్కనే ఉంటారు. ఇదంతా వారు ప్రేమతో చేసినా పిల్లలపై చూపే అతి నియంత్రణ ఇబ్బందిగా మారుతుందని నిపుణులు అంటున్నారు. ఇలాంటివి చేయడం వల్ల పిల్లలకు తల్లిదండ్రుల మీద భయం, కోపం, చిరాకు పెరుగుతాయని అంటున్నారు.
ఇలా చేస్తే మేలు
పరీక్షల సమయంలో తల్లిదండ్రులు ఎంత ప్రశాంతంగా ఉంటే పిల్లలు అంత బాగా చదువుతారని నిపుణులు అంటున్నారు. ‘చదువు..బాగా చదువు..చదవకపోతే జీవితం వేస్ట్’ లాంటి మాటలు మాట్లాడకూడదంటున్నారు. ఏయే సబ్జెక్టుల్లో వారు ఇబ్బంది పడుతున్నారో కనుక్కొని అందులో వారి సందేహాలు తీర్చాలి. అవసరమైతే యూట్యూబ్ వీడియోలు చూసి తగిన అంశాలు రాసుకొని వారికి వివరించాలి. రోజంతా పుస్తకాలతో కుస్తీ పట్టాలని కోరకుండా కాసేపు పిల్లల్ని బయటకు పంపాలి. కంబై¯Œ ్డ స్టడీ చేయాలని పిల్లలు కోరితే అందుకు సహకరించాలి. రాత్రిపూట భోజనం అయ్యాక ఒక పదిహేను నిమిషాలపాటు వారితో కలిసి వాకింగ్ చేయాలి. ఆ సమయంలో పరీక్షల గురించి వారితో చర్చించాలి. వారిలో ఉన్న భయాలు పోగొట్టాలి. పరీక్ష రాసి వచ్చాక వారిని ప్రశ్నలతో వేధించకుండా ప్రశాంతంగా ఉండేలా చూసుకోవాలి.
ఈ ఆహారం బెటర్
పరీక్షల సమయంలో పిల్లలకు ఇవ్వాల్సిన ఆహారంపై తల్లిదండ్రులకు అనేక సందేహాలు ఉంటాయి. కొందరు ఆహారం విషయంలో కఠినంగా వ్యవహరిస్తే, మరికొందరు అమితంగా తినిపిస్తుంటారు. రెండూ సరికాదని నిపుణులు అంటున్నారు. పరీక్ష సమయంలో కాఫీ, టీ, బ్రెడ్ వంటివి మంచివి కాదని వైద్యులు అంటున్నారు. పోహ, ఉ΄్మా, అవకాడో పనీర్ టోస్ట్, పండ్లు, ఉడకబెట్టిన కూరగాయలు, మొలకెత్తిన గింజలు తినిపించడం మంచిదని అంటున్నారు. టిఫిన్లలో కిచిడీ, ఊతప్పం, ఇడ్లీసాంబార్ వంటివి మేలంటున్నారు. పిల్లలకు ఇష్టం లేకుండా బలవంతంగా ఆహారం పెట్టొద్దని, వారికి ఆకలి వేసినప్పుడు అడిగినంత మాత్రమే పెట్టాలంటున్నారు.


