పెద్దపల్లి: ‘మా బుజ్జి కదూ.. ఊరుకో తల్లీ.. మా అమ్మకదా’ అని ఏడుస్తున్న ఆ చిన్నారిని లాలింపసాగింది అమ్మమ్మ. ‘పండుగ కదా తల్లీ.. ఈరోజు మన కడుపు నిండుతుంది’ అని ముద్దుల వర్షం కురిపించింది. ఈ దృశ్యం స్థానికుల మదిని కరిగించింది. ఈ పసికూన తన మనుమరాలేనని ‘సాక్షి’కి సంబురంగా తెలిపింది. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని మడ్ల రామలింగేశ్వరాలయంలో శివరాత్రి పర్వదినాన ఆదివారం దర్శనం కోసం భక్తులు పోటెత్తారు.
పండుగపూట తమ కడుపు నిండుతుందని గంపెడాశతో తమపిల్లలను చంకలో వేసుకొని గుడిముందు యాచిస్తూ కనిపించారు కొందరు మహిళలు. అంతలోనే ఒక్కసారిగా గురకపెట్టి ఆగకుండా ఏడుస్తున్న పాపని చూసి తోటి మహిళ తనకిమ్మంటూ ఎత్తుకొని తన లాలింపు మాటల పాటలు, ముద్దులు కురిపిస్తుంటే ఆ పసిపాప తల్లితో పాటు తోటి యాచకులు సైతం మొహంలో నవ్వులు చిందిస్తూ కనిపించారు.



