అసామాన్యులు
ఎనభై తొమ్మిది సంవత్సరాల వయసులో ఎలా ఉంటారు? విశ్రాంతికే అధిక ప్రాధాన్యత ఇస్తారు. దాదాపుగా ఇంటికే పరిమితం అవుతారు. ఎనభై తొమ్మిది సంవత్సరాల కమలాబెన్ మెహతా బామ్మ మాత్రం అలా కాదు. ఇప్పటికీ కష్టపడుతూనే ఉంది. ముంబైలోని రద్దీగా ఉండే స్థానిక రైళ్లలో చేతితో తయారుచేసిన పూసల బ్రేస్లెట్లను అమ్ముతుంటుంది.
‘ఈ వయసులో ఈ కష్టం ఏమిటి బామ్మ!’ అని ఎవరైనా అడిగితే... ఆమె సమాధానం చెప్పకుండానే గలగలా నవ్వుతుంది. ఆ నవ్వులోనే ఎన్నో జవాబులు వెదుక్కోవచ్చు.
‘కష్టానికి వయసుతో పని ఏమిటి!’; ‘ ఎంత కష్టపడితే అంత చురుగ్గా ఉంటాను!’... ఇలాంటి జవాబులు ఎన్ని అయినా ఉండవచ్చు. తాజా విషయానికి వస్తే... ఇన్స్టాగ్రామ్ యూజర్ తుషిత్ షా, కమలా బెన్ను పలకరించింది.
‘ముంబైలోని లోకల్ రైలులో బ్రేస్లెట్లు అమ్ముతున్న ఎనభై తొమ్మిదేళ్ల బామ్మను కలిశాను’ అంటూ ఆమె గురించి పోస్ట్ పెట్టింది. ‘ఎందుకు ఇలా?’ అని అడిగితే... ‘నా కుటుంబ సభ్యులు నన్ను వారితో పాటు ఇంట్లో ఉండడానికి అనుమతించారు. వారికి భారంగా ఉండడం ఇష్టం లేదు. అందుకే నా వంతుగా ఎంతో కొంత ఖర్చులకు ఇవ్వడానికి ఇవి అమ్ముతున్నాను’ అని చెప్పింది.


