ఇండోర్: మధ్యప్రదేశ్లోని ఇండోర్లో పదమూడేళ్ల బాలుడి హత్య కలకలం రేపింది. నిందితుడు ఆ బాలుడిని నైలాన్ తాడుతో ఎనిమిది సార్లు ఉరి బిగించి.. ముఖంపై ఇటుకతో దాడి చేసి కిరాతకంగా చంపేశాడు. అనంతరం మృతదేహాన్ని మంచం బాక్స్లో దాచిపెట్టి.. ఎవరికీ అనుమానం రాకుండా అనారోగ్యంతో ఉన్న తన అమ్మమ్మను అదే మంచంపై పడుకోబెట్టాడు.
పోలీసుల కథనం ప్రకారం.. నిందితుడు బాలుడిపై లైంగిక దాడికి ప్రయత్నించగా, ఆ బాలుడు ప్రతిఘటించి కేకలు వేయడంతో నిందితుడు ఈ దారుణానికి ఒడిగట్టాడు. ఆధారాలు దొరకకుండా.. మృతదేహాన్ని నాలుగో అంతస్తులోని ఫ్లాట్కు తరలించి అక్కడ ఒక మంచం(బెడ్ బాక్స్)లో దాచాడు. ఎనిమిదో తరగతి చదువుతున్న ఆ బాలుడు శుక్రవారం రాత్రి 7:30 గంటల సమయంలో ఇంటి బయట ఆడుకుంటూ కనిపించకుండా పోయాడు. ఎంతకీ తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు గాలించి.. చివరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
బాలుడు అదృశ్యంపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. శనివారం ఉదయం సోదాలు నిర్వహించగా.. సమీపంలోని భవనంపై బాలుడి జాకెట్, రక్తపు మరకలు కనిపించాయి. దీంతో సీసీటీవీ ఫుటేజీలను కూడా పోలీసులు పరిశీలించగా.. బాలుడు ఆ భవనంలోకి వెళ్లడం రికార్డయ్యింది. ఈ కేసులో పోలీసులు ఇద్దరు నిందితులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
అయితే, ఈ కేసులో ప్రధాన నిందితుడు రెహాన్ పోలీసులనే తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నించాడు. గాలింపు సమయంలో నిందితుడు ఏమీ తెలియనట్టు నటిస్తూ.. పోలీసుల వెంటే తిరిగాడు. అయితే, అతని చేతులు, మెడపై ఉన్న గీతలను చూసిన పోలీసులకు అనుమానం వచ్చింది. దీంతో అతడిని పోలీసులు ప్రశ్నించగా.. పని చేసే చోట గాయాలయ్యాలంటూ బుకాయించాడు. పోలీసులు తమదైన శైలిలో విచారించడంతో నిందితుడు గత నాలుగు నెలలుగా పనికి వెళ్లడం లేదని తేలింది. చివరికి రెహాన్ నేరాన్ని ఒప్పుకున్నాడు. బెడ్ బాక్స్లో బామ్మ పడుకున్న మంచం కిందే మృతదేహం ఉందని చెప్పాడు. పోలీసులు ఆ వృద్ధురాలిని పక్కకు జరిపి మంచం తెరవగా, దుప్పటిలో చుట్టిన బాలుడి మృతదేహాం బయటపడింది. నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.


