breaking news
Sunetra pawar
-
ఒక్కరోజే 75 ఫైల్స్ క్లియర్.. అజిత్ మృతి రోజున ఏం జరిగింది?
ముంబై: మహారాష్ట్రలో కొత్త వివాదం తెరపైకి వచ్చింది. డిప్యూటీ సీఎం అజిత్ పవార్ మృతి చెందిన రోజున మహారాష్ట్ర మైనారిటీ శాఖ మైనారిటీ పాఠశాలలకు సంబంధించిన 75 ఫైళ్లను క్లియర్ చేయడం పలు అనుమానాలకు తావిస్తోంది. అయితే, మైనార్టీ శాఖ అజిత్ పవార్ వద్దే ఉండటం గమనార్హం. దీంతో, ఈ వ్యవహారంలో మహారాష్ట్రలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఒకేరోజు ఇలా ఫైల్స్ క్లియర్ చేయడంపై అటు ప్రతిపక్ష నేతలు ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు.కాగా, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ జనవరి 28న విమాన ప్రమాదంలో మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే, అదే రోజున మహారాష్ట్ర మైనారిటీ శాఖలో మైనారిటీ పాఠశాలలకు సంబంధించిన 75 ఫైళ్లను క్లియర్ అయ్యాయి. ఈ ఫైళ్లలో మైనారిటీ విద్యా సంస్థలకు గుర్తింపు, ఆమోదాలకు సంబంధించిన ప్రతిపాదనలు ఉన్నాయని తెలుస్తోంది. అయితే, అజిత్ పవార్ వద్దే మైనార్టీ శాఖ ఉంది. ఆయన చార్జ్ తీసుకున్న తర్వాత దాదాపు రెండేళ్ల కాలంలో మైనార్టీ శాఖకు సంబంధించిన కొన్ని నిర్ణయాలను ఆయన పక్కన పెట్టినట్టు సమాచారం. ముఖ్యంగా మైనార్టీ విద్యా సంస్థలకు సంబంధించి సర్టిఫికెట్లు ఇవ్వలేదనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో, తాజాగా ఈ పరిణామం రాజకీయంగా, పరిపాలనా వర్గాల్లో తీవ్ర ప్రశ్నలను లేవనెత్తింది. ఒకే రోజులో ఇంత పెద్ద సంఖ్యలో ఫైళ్లను అకస్మాత్తుగా క్లియర్ చేయడంలో అవకతవకలు జరిగాయని ప్రతిపక్ష పార్టీలు ఆరోపించాయి.రాష్ట్ర పరిపాలన అజిత్ పవార్ చుట్టూ ఉన్న బ్రేకింగ్ న్యూస్తో బిజీగా ఉన్న రోజున తక్కువ వ్యవధిలో 75 ఫైళ్లను ఎలా ప్రాసెస్ చేసి సంతకం చేశారని ప్రతిపక్ష నాయకులు ప్రశ్నించారు. మరోవైపు.. ఈ సమస్య పరిపాలనా చర్యకు కూడా దారితీసింది. ఈ వివాదం కొనసాగుతున్న సమయంలోనే మహారాష్ట్ర మైనారిటీ శాఖ డిప్యూటీ సెక్రటరీ మిలింద్ షెనాయ్ను బదిలీ చేశారు. దీంతో, ఈ వ్యవహారంపై మరిన్ని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.కాగా, ఒక ప్రముఖ రాజకీయ ఘటన(అజిత్ పవార్ మృతి) చర్చగా ఉన్న రోజున ఇంత పెద్ద పరిపాలనా కార్యక్రమం జరగడం సహజంగానే సందేహాన్ని రేకెత్తిస్తుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అయితే, తుది నిర్ణయాలు ప్రభుత్వ విచారణ ఫలితంపై ఆధారపడి ఉంటాయని చెబుతున్నారు. ఈ విషయం ఇప్పుడు మహారాష్ట్రలో రాజకీయ చర్చనీయాంశంగా మారింది. అయితే, ఈ విషయంపై ప్రభుత్వం విచారణ ప్రారంభించిందని, తదుపరి చర్యలు కూడా జరుగుతున్నాయని అధికార వర్గాలు తెలిపాయి. ఇక, ప్రస్తుతం మైనార్టీ శాఖ ఆయన భార్య సునేత్రా పవార్ వద్ద ఉంది. ఆమె ఈ అనుమానాస్పద సర్టిఫికెట్లపై విచారణ ఆదేశించారు.ఇదిలా ఉండగా.. అజిత్ పవార్ ప్రయాణిస్తున్న విమానం బారామతిలో కూలిపోవడంతో ప్రాణాలు విడిచారు.. అయితే, ఈ ప్రమాదంపై ఆది నుంచి ఎన్నో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.. ఆ ప్రాణాంతక ప్రమాదానికి కారణం ఏమిటనే ప్రశ్నలు తలెత్తాయి. ఈ ఘటనపై స్పందించిన మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి సునేత్రా పవార్ మరియు నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సిపి) రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ సునీల్ తత్కరే.. అజిత్ పవార్ మరణంపై సీబీఐ దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. ఈ ఘటన వెనుక ఉన్న నిజాన్ని వెలికి తీయాల్సిన అవసరాన్ని ఇద్దరూ ప్రత్యేకంగా పేర్కొన్నారు. -
అజిత్ పవార్ సతీమణి తొలిప్రసంగం.. ఏమన్నారంటే
ముంబై: మహారాష్ట్ర రాజకీయాలలో ఇటీవల పెను విషాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దురదృష్టవశాత్తు విమాన ప్రమాదంలో మరణించారు. ఆయన స్థానంలో ఆమె సతీమణి సునేత్రా పవార్ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం ఆమె తొలిప్రసంగం చేశారు.పదవీ బాధ్యతలు స్వీకరించిన అనంతరం సునేత్రా పవార్ మాట్లాడుతూ" దాదా అకాల మరణం నాకు వ్యక్తిగతంగా దుఃఖాన్ని కలిగించడమే కాకుండా మహారాష్ట్ర మెుత్తాన్ని శోకసంద్రంలో ముంచింది. ఆయన నాకిచ్చిన కర్తవ్యనిష్ఠ, పోరాటంలో బలం, ప్రజల పట్ల నిజాయితీగల నిబద్ధతే నాకు నిజమైన పునాదులు" అని ఆమె అన్నారు. తన దుఃఖాన్ని దిగమింగుతూ రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో పయనింపజేయడమే తన లక్షంగా మార్చుకుంటానని ప్రతిజ్ఞ చేశారు.రైతులు, మహిళలు, యువత, కార్మికుల కోసం దాదా ఎంతో సేవ చేశారని తాను కూడా ఆ పరంపరను కొనసాగిస్తానని ఆమె తెలిపింది. ఇంతటి కష్ట సమయంలో మహారాష్ట్ర ప్రజలు ఇచ్చిన మద్దతు తన అసలైన బలం అని తెలిపింద ఛత్రపతి శివాజీ మహారాజ్, సాహూ మహారాజ్, మహాత్మా పూలే, అంబేద్కర్ భావజాలాల పట్ల విధేయతతో ఉంటానని సనేత్ర పవార్ తెలిపింది.అయితే ఇటీవల బారమతికి ఎన్నికల ప్రచారానికి వెళుతుండగా అజిత్ పవార్ పయణిస్తున్న విమానం కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో అజిత్ పవార్తో పాటు అందులో పయణిస్తున్న వారందరూ మృతిచెందారు. -
మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగాసునేత్ర ప్రమాణం
ముంబై/బారామతి: మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా సునేత్ర పవార్(62) శనివారం ప్రమాణ స్వీకారం చేశారు. రాజధాని ముంబైలోని రాజ్భవన్లో నిరాడంబరంగా జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ ఆచార్య దేవవ్రత్ ఆమెతో ప్రమాణం చేయించారు. మహారాష్ట్ర తొలి మహిళా ఉప ముఖ్యమంత్రిగా సునేత్ర పవార్ రికార్డుకెక్కారు. అంతకుముందు రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా సమర్పించారు. ఉదయం నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ(అజిత్ పవార్) శాసనసభాపక్షం సమావేశమైంది. సునేత్ర పవార్ను తమ నేతగా ఎన్నుకుంది. పార్టీ అధినేత, ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి అజిత్ పవార్ జనవరి 28న విమాన ప్రమాదంలో మరణించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన భార్య సునేత్రను నూతన ఉప ముఖ్యమంత్రిగా నియమించాలని పార్టీ నాయకత్వం నిర్ణయించింది. సునేత్ర ప్రమాణ స్వీకారానికి రాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, మరో ఉప ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే, ఎన్సీపీ నేతలు ప్రఫుల్ పటేల్, సునీల్ తత్కారే, ఛగన్ భుజబల్ తదితరులు హాజరయ్యారు. సునేత్ర చిన్నకుమారుడు జయ్ పవార్, ఆయన భార్య కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా కార్యకర్తలు, అభిమానులు ‘అజిత్ దాదా అమర్ రహే’అంటూ నినాదాలు చేశారు. సునేత్ర పవార్ ఆరు నెలల్లోగా ఎమ్మెల్యేగా ఎన్నిక కావాల్సి ఉంది. తన భర్త మరణంతో ఖాళీ అయిన బారామతి అసెంబ్లీ స్థానం నుంచి ఉప ఎన్నికలో ఆమె పోటీ చేయబోతున్నట్లు సమాచారం. మరోవైపు సునేత్ర పవార్కు ఎక్సైజ్, క్రీడలు, మైనార్టీల అభివృద్ధి శాఖలను కేటాయించారు. ఆమె భర్త నిర్వర్తించిన ఆర్థిక, ప్రణాళిక శాఖలను ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తనవద్దే అట్టిపెట్టుకున్నారు. ప్రమాణ స్వీకారం అనంతరం సునేత్ర ‘ఎక్స్’లో పోస్టుచేశారు. తన భర్త ఆశయాలను ముందుకు తీసుకెళ్తానని చెప్పారు. ఆయన అడుగు జాడల్లో నడుస్తూ అంకితభావంతో విధులు నిర్వర్తిస్తానని, రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు. ఛత్రపతి శివాజీ, సాహూ, ఫూలే, అంబేడ్కర్ వంటి మహనీయుల ఆదర్శాలే తనకు స్ఫూర్తి అని ఉద్ఘాటించారు. ప్రధాని మోదీ అభినందనలు మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన సునేత్ర పవార్కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలియజేశారు. రాష్ట్ర ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం ఆమె నిరంతరం కృషి చేస్తారన్న విశ్వాసం ఉందని పేర్కొన్నారు. ఈ మేరకు శనివారం ఎక్స్లో పోస్టుచేశారు. దివంగత నేత అజిత్ పవార్ ఆశయాలను సునేత్ర నెరవేర్చాలని ఆకాంక్షించారు. ఆ సంగతి నాకు తెలియదు: శరద్ పవార్ సునేత్ర పవార్ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయబోతున్న సంగతి తనకు ముందుగా తెలియదని ఎన్సీపీ(శరద్ పవార్) అధ్యక్షుడు శరద్ పవార్ అన్నారు. ప్రసార మాధ్యమాల ద్వారానే తనకు తెలిసిందని పేర్కొన్నారు. ప్రమాణ స్వీకారం గురించి ఎవరూ తనతో చర్చించలేదని చెప్పారు. ఎన్సీపీ(అజిత్ పవార్)లో అంతర్గతంగా చర్చించుకొని నిర్ణయం తీసుకొని ఉంటారని అభిప్రాయపడ్డారు. ఆయన శనివారం బారామతిలో మీడియాతో మాట్లాడారు. రెండు ఎన్సీపీలు విలీనం కావాలని అజిత్ పవార్ కోరుకున్నట్లు తెలిపారు. విలీనం గురించి ఫిబ్రవరి 12న ప్రకటించాలని అజిత్ పవార్ నిర్ణయించినట్లు వెల్లడించారు. రెండు పార్టీలు కలిసిపోవాలని ఆయన బలంగా కోరుకున్నారని స్పష్టంచేశారు. అది సాధ్యమవుతుందని తాను భావిస్తున్నట్లు శరద్ పవార్ వ్యాఖ్యానించారు. -
మరాఠా గడ్డపై ‘సునేత్ర’ చరిత్ర.. వీళ్ల గురించి తెలుసా?
మహారాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. అజిత్ పవార్ సతీమణి సునేత్రా పవార్ మహారాష్ట్ర తొలి మహిళా ఉపముఖ్యమంత్రి కానున్నారు. ఆమె శనివారం పదవీ స్వీకార ప్రమాణం చేసే అవకాశం ఉందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. కాగా, ఇప్పటి వరకు మన దేశంలో ఐదుగురు మహిళలు.. ఉప ముఖ్యమంత్రి బాధ్యతల్లో కొనసాగుతున్నారు. వారిలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యలక్ష్మి.. కాంగ్రెస్ ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా పనిచేశారు.కమలమ్మ.. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 1952లో కమలమ్మ తాత్కాలికంగా డిప్యూటీ సీఎంగా పనిచేశారు. దీంతో, ఆమె దేశ చరిత్రలోనే మొదటి ఉప ముఖ్యమంత్రిగా చర్రితలో నిలిచిపోయారు.పాముల పుష్ఫ శ్రీవాణి.. ఏపీలో వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో పుష్ప శ్రీవాణి డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వహించారు. వైఎస్ జగన్ ప్రభుత్వంలో దాదాపు మూడేళ్ల పాటు డిప్యూటీ సీఎం హోదాలో కొనసాగారు.తారాసింగ్.. పంజాబ్కు చెందిన తారా సింగ్ 1960లో తాత్కాలికంగా ఉప ముఖ్యమంత్రి బాధ్యతలు నిర్వర్తించారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఆమె విధుల్లో కొనసాగారు.రాజేంద్ర కౌర్ భట్టాల్.. పంజాబ్కు చెందిన రాజేంద్ర కౌర్ భట్టాల్ 1996లో ఉప ముఖ్యమంత్రిగా విధుల్లో కొనసాగారు. ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ ప్రభుత్వంలో దాదాపు మూడేళ్లకు పైగా ఆమె డిప్యూటీ సీఎంగా ఉన్నారు.నిత్యానందా దేవి.. బీహార్కు చెందిన నిత్యానందా దేవి 1990ల్లో తాత్కాలికంగా డిప్యూటీ సీఎంగా ఉన్నారు. ఆర్జేడీ ప్రభుత్వ హయాంలో ఆమె విధులు నిర్వహించారు.జమునా దేవి.. మధ్యప్రదేశ్కు చెందిన జమునా దేవి 1998లో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో డిప్యూటీ సీఎంగా ఐదేళ్ల పాటు కొనసాగారు. దిగ్విజయ్ సింగ్ ప్రభుత్వం ఐదేళ్ల పీరియడ్ మొత్తం ఆమె ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు. దీంతో, ఎక్కువ కాలం డీప్యూటీ సీఎంగా ఉన్న మహిళగా ఆమె రికార్డుల్లోకి ఎక్కారు.కమలా బెనీవల్.. రాజస్థాన్కు చెందిన కమలా బెనీవల్ కాంగ్రెస్ ప్రభుత్వంలోనే డిప్యూటీ సీఎంగా కొనసాగారు. 2003లో అశోక్ గెహ్లాట్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆమె ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు.దియా కుమారి.. రాజస్థాన్కు చెందిన దియా కుమారి బీజేపీ ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా దాదాపు రెండేళ్ల పాటు ఉన్నారు. ప్రస్తుత భజన్ లాల్ శర్మ ప్రభుత్వంలో 2023 నుంచి బాధ్యతల్లో కొనసాగుతున్నారు.పార్వతీ పరిడా.. ఒడిశాకు చెందిన పార్వతి ప్రస్తుత సీఎం మోహన్ చరణ్ మాంఝీ ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా కొనసాగుతున్నారు. 2024 జూన్ నుంచి బాధ్యతల్లో ఉన్నారు.అయితే, దేశంలో ముఖ్యమంత్రి స్థానాల్లో మహిళలు ఎక్కువ కాలం సేవలు చేసినప్పటికీ.. ఉప ముఖ్యమంత్రలుగా మాత్రం చాలా తక్కువ మంది, తక్కువ కాలం మాత్రమే విధుల్లో ఉన్నారు. పంజాబ్, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, బీహార్ రాష్ట్రాల్లో మాత్రమే మహిళలు ఈ పదవిని చేపట్టారు. ప్రస్తుతం (2026 జనవరి నాటికి) రెండు రాష్ట్రాల్లో (రాజస్థాన్, ఒడిశా) మాత్రమే మహిళలు డిప్యూటీ ముఖ్యమంత్రి హోదాలో కొనసాగుతున్నారు. భవిష్యత్తులో మహిళల రాజకీయ ప్రాధాన్యం పెరుగుతున్నందున మరిన్ని రాష్ట్రాల్లో మహిళలు డిప్యూటీ సీఎంలుగా ఉండే అవకాశం ఉంది. -
ఆ విషయం సునేత్ర కూడా చెప్పలేదు: శరద్ పవార్
ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ కీలక వ్యాఖ్యలు చేశారు. డిప్యూటీ సీఎంగా ఎన్సీపీ(అజిత్ పవార్ వర్గం) నేత, దివంగత అజిత్ పవార్ సతీమణి సునేత్ర ప్రమాణం చేయబోతున్న విషయంపై ఎలాంటి సమాచారం లేదని అన్నారాయన. ఈ విషయం పేపర్లోనే చూసి తెలుసుకున్నానని.. ఆ కథనాల్లోనూ తనకు స్పష్టత కనిపించలేదని వ్యాఖ్యానించారు. ‘‘ఈ విషయంపై నాకు ఎలాంటి సమాచారం లేదు. పేపర్లో ఓ వార్త చూశా. అందులో ప్రఫుల్ పటేల్, సునీల్ టాటాకరే.. ఇలా ఇతరుల పేర్లే కనిపించాయి. ఆమె డిప్యూటీ సీఎం పగ్గాలు చేపడుతోందనే విషయం నాకు తెలియదు. ఆమె నాతో కూడా ఆ మాట చెప్పలేదు. బీజేపీ కూటమితోనే కొనసాగాలని ఆమె భావిస్తుందని మేం అనుకోలేదు. ఇది ఆశ్చర్యం కలిగించే అంశమే. దీనిపై నేను, మా వర్గం ఎలాంటి చర్చా జరపలేదు. బహుశా ఆమె పార్టీనే ఆ నిర్ణయం తీసుకుని ఉండొచ్చు. ఆమె ఆ నిర్ణయానికి కట్టుబడి ఉండొచ్చు.రెండు వర్గాల విలీనంపై స్పందిస్తూ.. గత నాలుగు నెలలుగా రెండు వర్గాల విలీనంపై చర్చలు నడుస్తున్నాయన్నారు. అజిత్ పవార్, శశికాంత్ షిండే, జయంత్ పాటిల్లు ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరిపారు. జనవరి 17న విలీనంపై చర్చలు జరిగాయి. ఫిబ్రవరి 12న ముహూర్తం పెట్టుకున్నాం. విలీనం సమయంలోనే ఇది ఊహించని పరిణామం అని అజిత్ పవార్ మృతిని ఉద్దేశించి అన్నారు. అయితే.. ఆయన(అజిత్ పవార్) కోరిక నెరవేరాలని తాను ఆకాంక్షిస్తున్నట్లు శరద్ పవార్ వ్యాఖ్యానించారు. 2023 జులైలో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(NCP) వర్గం రెండుగా చీలింది. మొత్తం 54 మంది ఎమ్మెల్యేలలో.. 40 మందితో కలిసి బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి ప్రభుత్వంలో అజిత్ పవార్ చేరారు. ఆ తర్వాత అజిత్ పవార్ వర్గానికే అసలైన ఎన్సీపీ గుర్తింపు దక్కింది. దీంతో శరద్ పవార్ తన వర్గానికి ఎన్సీపీ-శరద్చంద్ర పవార్ కూటమి అని పేరు పెట్టారు. 2024 చివర్లో జరిగిన మహారాష్ట్ర ఎన్నికలో మహాయుతి కూటమి తిరిగి అధికారాన్ని కైవసం చేసుకుంది. పవర్ షేరింగ్లో భాగంగా.. అజిత్ పవార్కు డిప్యూటీ సీఎంతో పాటు కీలక మంత్రిత్వ శాఖలను కేటాయించారు. అయితే.. జనవరి 28వ తేదీన తన నియోజకవర్గం బారామతిలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారానికి వెళ్తూ విమాన ప్రమాదంలో అజిత్ పవార్(66) మరణించారు. దీంతో ఈమధ్యలో జరిగిన ఎన్సీపీ వర్గ విలీన ప్రక్రియకు బ్రేకులు పడ్డాయి. అదే సమయంలో.. ఆయన వర్గం తీసుకునే ఎలాంటి నిర్ణయాన్నైనా తాము గౌరవిస్తామని ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ ప్రకటించారు. ఎన్సీపీ వర్గం ఆమెను శనివారం లెజిస్టేచర్ నేతగా ఎన్నుకునే అవకాశం ఉంది. ఆపై ఇవాళ సాయంత్రం ఆమె మహారాష్ట్ర డిప్యూటీ సీఎంగా ప్రమాణం చేసే చాన్స్ ఉంది. మరోవైపు.. మహారాష్ట్ర రాజకీయాల్లో ఇవాళ ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. గోవింద్బాగ్లో పవార్ కుటుంబ సభ్యులు భేటీ అయ్యారు. ఈ సమావేశానికి శరద్ పవార్ కూతురు సుప్రియా సూలే, అజిత్ పవార్ తనయుడు రోహిత్ పవార్ హాజరయ్యారు. అయితే ఇది కుటుంబ సంబంధిత కార్యక్రమానికి సంబంధించిన సమావేశం అనే ప్రచారం జరుగుతునప్పటికీ.. సునేత్ర ప్రమాణ స్వీకారం వేళే ఈ భేటీ జరగడం రాజకీయ చర్చా అనే అనుమానాలకు తావిస్తోంది. -
మహారాష్ట్ర రాజకీయం.. అజిత్ కుమారుడికి బంపరాఫర్!
ముంబై: మహారాష్ట్రలో ఎన్సీపీ నేత అజిత్ పవార్ అకాల మరణం తర్వాత మరాఠా రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. అజిత్ పవార్ సతీమణి సునేత్రా పవార్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించేందుకు అంగీకరించారు. నేడు ఆమె ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మరోవైపు.. అజిత్ కుమారుడు పార్థ్ పవార్కు బంపరాఫర్ వస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.అజిత్ పవార్ మరణం తర్వాత మహారాష్ట్ర రాజకీయాల గురించి రోజుకో విషయం బయటకొస్తుంది. తాజాగా ఆయన పెద్ద కుమారుడు పార్థ్ పవార్ రాజ్యసభలోకి అడుగుపెట్టేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ మేరకు మీడియాలో కథనాలు వస్తున్నాయి. ప్రస్తుతం ఎంపీగా ఉన్న ఆయన తల్లి సునేత్రా పవర్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడుతున్న నేపథ్యంలో ఆమె స్థానంలో రాజ్యసభకు వెళ్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. కాగా, పార్థ్ పవార్.. 2019 లోక్సభ ఎన్నికల్లో మావల్ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగారు. అయితే, ఆ ఎన్నికల్లో ఆయన ఓడిపోయారు.ఇదిలా ఉండగా.. అజిత్ పవార్ ఆకస్మిక మరణంతో ఆయన స్థానాన్ని సతీమణి సునేత్ర పవార్కు అప్పగించాలని కూటమి పెద్దలు నిర్ణయించారు. ఈ మేరకు దేవేంద్ర ఫడ్నవీస్తో పాటు ఇతర కూటమి నేతలు సునేత్ర పవార్తో చర్చలు జరిపారు. ఆ చర్చలు విజయవంతం కావడంతో ఆమె ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టేందుకు సుముఖత వ్యక్తం చేశారు. సునేత్ర పవార్ గతంలో బారామతి లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసినప్పటికీ విజయం సాధించలేకపోయారు. అయినప్పటికీ ఆమెకు స్థానికంగా మంచి పట్టుంది. అజిత్ పవార్ వర్గం ఆమెను ఉప ముఖ్యమంత్రిగా తీసుకురావడం ద్వారా మహిళా నాయకత్వానికి ప్రాధాన్యం ఇవ్వడమే కాకుండా, బారామతి ప్రాంతంలో తమ బలాన్ని మరింతగా పెంచుకోవాలని చూస్తోంది. ఇక, సునేత్రా నిర్ణయంతో అజిత్ పవార్ మరణం తర్వాత ఎన్సీలోని రెండు వర్గాలు ఏకమవుతాయన్న ప్రచారానికి తెర పడినట్లయింది.సునేత్ర రికార్డుమహారాష్ట్ర రాజకీయ చరిత్రలో ఒక మహిళ ఉప ముఖ్యమంత్రి పదవి చేపట్టటడం ఇదే తొలి సారి. 1978వ సంవత్సరంలో రాష్ట్రంలో సంకీర్ణ ప్రభుత్వం ప్రారంభమైనప్పుడు ఈ పదవిని సృష్టించారు. అయితే ఇప్పటి వరకు ఏ మహిళా నాయకురాలు కూడా ఈ హోదాలో పని చేయలేదు. అజిత్ పవార్ మరణం తర్వాత ఆయన స్థానాన్ని భర్తీ చేయాలని ఎన్సీపీ నాయకులు గట్టిగా కోరడంతో సునేత్రా పవార్ ఇందుకు అంగీకరించారు. శనివారం ఉదయం ముంబైలో జరిగే పార్లమెంటరీ బోర్డు సమావేశంలో ఆమెను ఎన్సీపీ శాసనసభాపక్ష నేతగా ఎన్నుకోనున్నారు. అనంతరం సాయంత్రం రాజ్భవన్లో ప్రమాణ స్వీకారోత్సవం జరగనుంది. -
మహా ఉప ముఖ్యమంత్రిగా సునేత్ర పవార్
ముంబై: మహారాష్ట్ర నూతన ఉప ముఖ్యమంత్రిగా దివంగత నేత అజిత్ పవార్ భార్య, రాజ్యసభ సభ్యురాలు సునేత్ర పవార్ బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఆమె శనివారమే ప్రమాణ స్వీకారం చేయబోతున్నట్లు ఎన్సీపీ(అజిత్ పవార్) వర్గాలు వెల్లడించాయి. మహారాష్ట్ర తొలి మహిళా ఉప ముఖ్యమంత్రిగా సునేత్ర పవార్ రికార్డు సృష్టించబోతున్నారు. ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ బుధవారం విమాన ప్రమాదంలో మరణించిన సంగతి తెలిసిందే. భర్త స్థానంలో సునేత్ర పవార్ బాధ్యతలు స్వీకరించాలని పార్టీ వర్గాలు కోరడంతో ఆమె అంగీకరించినట్లు సమాచారం. శనివారం ఉదయం ముంబైలో తమ పార్టీ సమావేశం జరుగుతుందని, సునేత్ర పవార్ను శాసనసభాపక్ష నేతగా ఎన్నుకుంటామని ఎన్సీపీ(అజిత్ పవార్) వర్గాలు తెలియజేశాయి. సాయంత్రం డిప్యూటీ సీఎంగా ఆమె ప్రమాణం చేస్తారని పేర్కొన్నాయి. సునేత్ర పవార్కు రాజకీయాలతో అనుబంధం ఉంది. 2024 లోక్సభ ఎన్నికల్లో బారామతి స్థానం నుంచి ఎన్సీపీ(అజిత్ పవార్) అభ్యరి్థగా పోటీ చేశారు. కానీ, ఎన్సీపీ(శరద్ పవార్) అభ్యర్థి సుప్రియా సూలే చేతిలో ఓడిపోయారు. అనంతరం సునేత్ర రాజ్యసభ సభ్యురాలిగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం ఆమె మహారాష్ట్ర అసెంబ్లీలో సభ్యురాలు కాదు. డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపడితే ఆరు నెలల్లోగా ఎమ్మెల్యేగా ఎన్నికల కావాల్సి ఉంది. తన భర్త మరణంతో ఖాళీ అయిన బారామతి నుంచి ఆమె పోటీ చేస్తారని ప్రచారం సాగుతోంది. మరోవైపు ఉభయ ఎన్సీపీలు ఏకం కాబోతున్నాయని, దీనిపై త్వరలో చర్చలు ప్రారంభమవుతాయని చెబుతున్నారు. -
Sunetra Pawar: డిప్యూటీ సీఎంగా సునేత్రా పవార్
ముంబై: మహారాష్ట్ర రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎన్సీపీ నేత అజిత్ పవార్ సతీమణి సునేత్ర పవార్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించేందుకు అంగీకరించారు. రేపు సాయంత్రం ఐదు గంటలకు ఆమె ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఈ మేరకు ప్రభుత్వ యంత్రాంగం ఏర్పాట్లను ముమ్మరం చేసింది.ఎన్సీపీ విభజన తర్వాత అజిత్ పవార్ నేతృత్వంలోని వర్గం బీజేపీతో కలసి మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రిగా, అజిత్ పవార్ ఉప ముఖ్యమంత్రిగా కొనసాగుతూ వచ్చారు. అయితే, ఊహించని విధంగా బుధవారం అజిత్ పవార్ విమాన ప్రమాదంలో మరణించారు. 66 ఏళ్ల అజిత్ పవార్ ప్రయాణిస్తున్న విమానం బారామతిలో ల్యాండ్ కావడానికి ప్రయత్నిస్తుండగా ప్రమాదానికి గురైంది.అజిత్ పవార్ ఆకస్మిక మరణంతో ఆయన స్థానాన్ని సతీమణి సునేత్ర పవార్కు అప్పగించాలని కూటమి పెద్దలు నిర్ణయించారు. ఈ మేరకు దేవేంద్ర ఫడ్నవీస్తో పాటు ఇతర కూటమి నేతలు సునేత్ర పవార్తో చర్చలు జరిపారు. ఆ చర్చలు విజయవంతం కావడంతో ఆమె ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టేందుకు సుముఖత వ్యక్తం చేశారు.సునేత్ర పవార్ గతంలో బారామతి లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసినప్పటికీ విజయం సాధించలేకపోయారు. అయినప్పటికీ ఆమెకు స్థానికంగా మంచి పట్టుంది. అజిత్ పవార్ వర్గం ఆమెను ఉప ముఖ్యమంత్రిగా తీసుకురావడం ద్వారా మహిళా నాయకత్వానికి ప్రాధాన్యం ఇవ్వడమే కాకుండా, బారామతి ప్రాంతంలో తమ బలాన్ని మరింతగా పెంచుకోవాలని చూస్తోంది.ఈ నిర్ణయం వెనుక రాజకీయ సమీకరణలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మహారాష్ట్రలో బీజేపీ, శివసేన (శిండే వర్గం), ఎన్సీపీ (అజిత్ పవార్ వర్గం) కలిసి ప్రభుత్వం నడుపుతున్నాయి. ఈ క్రమంలో సునేత్ర పవార్కు ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వడం ద్వారా అజిత్ పవార్ వర్గానికి మరింత ప్రాధాన్యం లభించనుంది. -
మహారాష్ట్రలో ట్విస్ట్.. బీజేపీకి ఎన్సీపీ కొత్త డిమాండ్
ముంబై: భర్తను కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) చీఫ్, దివంగత అజిత్ పవర్ భార్య సునేత్రకు తక్షణం మహారాష్ట్ర కేబినెట్లో ఉపముఖ్యమంత్రి పదవి కట్టబెట్టాలని ఎన్సీపీ నేతలు డిమాండ్లు చేస్తున్నారు. రాష్ట్రంలో బీజేపీ సారథ్యంలో అధికారంలో ఉన్న మహాయుతి కూటమి పార్టీలతో ఈ మేరకు ఎన్సీపీ ముఖ్యనేతలు సుదీర్ఘ చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. పార్టీ పగ్గాలు సైతం సునేత్రకు అప్పగించాలని ఆ పార్టీ ముఖ్యలు భావిస్తున్నారు. అజిత్ పవార్ మరణంతో ఖాళీ అయిన బారామతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి సునేత్రను పోటీకి నిలబెట్టాలని పార్టీ నేతలు యోచిస్తున్నారు.విలీనంపై మొదలైన గుసగుసలు బాబాయితో విబేధించి ఎన్సీపీని చీల్చి వేరు కుంపటి పెట్టుకున్న అజిత్ పవార్ లేకపోవడంతో ఇకపై పవార్ సారథ్యంలోని పార్టీని శరద్పవార్ నేతృత్వంలోని పాత పార్టీతో విలీనంచేయాలనే డిమాండ్లు ఊపందుకున్నాయి. అజిత్ వర్గం నేతలు ఇందుకు మొగ్గుచూపుతున్నారు. ‘‘ప్రస్తుతం రాజ్యసభ సభ్యురాలిగా ఉన్న సునేత్ర సారథ్యంలోనే ఇకపై పార్టీ ముందుక నడవాలని నేతలంతా భావిస్తున్నారు. ఆమెకు కేబినెట్ మంత్రి పదవి ఇవ్వాలి. వాస్తవానికి శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ(ఎస్పీ)తో మా పార్టీ ఇప్పటికే స్థానిక ఎన్నికల్లో కలిసి పనిచేస్తోంది. ఇకమీదటా శాశ్వతంగా కలిసే ఉంటాయి’’ అని మహారాష్ట్ర ఆహార, ఔషధ నియంత్రణ శాఖ మంత్రి, ఎన్సీపీ సీనియర్ నేత నరహరి జిర్వాల్ అన్నారు.‘‘పవార్ల కుటుంబాలు ఒక్కటవ్వాలి. ఎన్సీపీ(ఎస్పీ), ఎన్సీపీలు కలిసిపోవడమే ఉత్తమం’’అని ఎన్సీపీ సీనియర్ నేతలు నవాబ్ మాలిక్, ప్రమోద్ హిందూరావ్ అభిప్రాయపడ్డారు. అయితే సునేత్రకు పార్టీ పట్టంకట్టే అంశం ఇంత త్వరగా చర్చించాల్సిన అవసరం లేదని ఎన్సీపీ నేత, ఆహార, పౌరసరఫరాల మంత్రి ఛగన్ భుజ్బల్ వ్యాఖ్యానించారు. శరద్ పవార్ సమ్మతితోనే పార్టీల విలీనం సాధ్యమని ఎన్సీపీ(ఎప్పీ) నేత ఏక్నాథ్ ఖడ్సే అన్నారు.


