ముంబై: మహారాష్ట్ర రాజకీయాల్లో మరో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. బారామతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక నేపథ్యంలో అజిత్ పవార్ భార్య సునేత్ర పవార్కు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. సునేత్ర పవార్ విజ్ఞప్తిని కాంగ్రెస్ హైకమాండ్ తిరస్కరించింది. దీంతో, ఉన ఎన్నికను ఏకగ్రీవం చేయాలనుకున్న ఆమె ప్రయత్నం విఫలమైంది.
కాగా, మహారాష్ట్ర డిప్యూటీ సీఎంగా ఉన్న అజిత్ పవార్ ఇటీవలే విమాన ప్రమాదంలో మరణించిన విషయం తెలిసిందే. ఆయన మరణం కారణంగా బారామతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నికలు నిర్వహించాల్సిన పరిస్థితి వచ్చింది. కాగా, ఈ స్థానం నుంచి అజిత్ పవార్ భార్య సునేత్ర పవార్ పోటీలో నిలబడ్డారు. అనంతరం, బారామతి నుంచి సునేత్ర.. ఏకగ్రీవంగా ఎన్నిక కావాలని ఆకాంక్షించారు. ఇందులో భాగంగా కాంగ్రెస్ పార్టీతో ఆమె చర్చలు జరిపారు. మహారాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ హర్షవర్ధన్ సప్కల్ను కలిశారు. పోటీలో కాంగ్రెస్ అభ్యర్థి లేకుండా ఉండాలనే ప్రయత్నాలు చేశారు. కానీ, కాంగ్రెస్ అభ్యర్థిని పోటీలో దింపాలని నిర్ణయం తీసుకుంది.
ఇక, ఉప ముఖ్యమంత్రిగా ఉన్న సునేత్ర పవార్పై కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్థిని బరిలోకి దింపింది. ఆదివారం సాయంత్రం కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే న్యాయవాది ఆకాష్ విశ్వనాథ్ మోర్ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు. మరోవైపు, ఆమె ఉద్ధవ్ థాక్రేను కూడా సంప్రదించారు. అయితే, ఇప్పటికీ శివసేన యూబీటీ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఆ పార్టీ నేత సంజయ్ రౌత్ అన్నారు. ఆమె బీజేపీతో పొత్తులో ఉన్న విషయాన్ని కూడా పరిగణలోకి తీసుకుంటున్నట్లు చెప్పారు.
ఇదిలా ఉండగా.. నేడు సునేత్ర పవార్ నామినేషన్ దాఖలు చేయబోతున్నారు. బారామతి పవార్ కుటుంబానికి కంచుకోట. అజిత్ పవార్ మరణంతో సునేత్ర పవార్కు సింపతీ వర్క్ అవుట్ అయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో ఉద్ధవ్ వర్గం అభ్యర్థిని పోటీలో నిలుపుతుందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.


