ఎన్సీపీ(అజిత్ పవార్) శాసనసభాపక్ష నేతగా ఎన్నిక
రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా
సునేత్రకు ఎక్సైజ్, క్రీడలు, మైనార్టీ అభివృద్ధి శాఖలు కేటాయింపు
ముంబై/బారామతి: మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా సునేత్ర పవార్(62) శనివారం ప్రమాణ స్వీకారం చేశారు. రాజధాని ముంబైలోని రాజ్భవన్లో నిరాడంబరంగా జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ ఆచార్య దేవవ్రత్ ఆమెతో ప్రమాణం చేయించారు. మహారాష్ట్ర తొలి మహిళా ఉప ముఖ్యమంత్రిగా సునేత్ర పవార్ రికార్డుకెక్కారు. అంతకుముందు రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా సమర్పించారు.
ఉదయం నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ(అజిత్ పవార్) శాసనసభాపక్షం సమావేశమైంది. సునేత్ర పవార్ను తమ నేతగా ఎన్నుకుంది. పార్టీ అధినేత, ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి అజిత్ పవార్ జనవరి 28న విమాన ప్రమాదంలో మరణించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన భార్య సునేత్రను నూతన ఉప ముఖ్యమంత్రిగా నియమించాలని పార్టీ నాయకత్వం నిర్ణయించింది.
సునేత్ర ప్రమాణ స్వీకారానికి రాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, మరో ఉప ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే, ఎన్సీపీ నేతలు ప్రఫుల్ పటేల్, సునీల్ తత్కారే, ఛగన్ భుజబల్ తదితరులు హాజరయ్యారు. సునేత్ర చిన్నకుమారుడు జయ్ పవార్, ఆయన భార్య కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా కార్యకర్తలు, అభిమానులు ‘అజిత్ దాదా అమర్ రహే’అంటూ నినాదాలు చేశారు.
సునేత్ర పవార్ ఆరు నెలల్లోగా ఎమ్మెల్యేగా ఎన్నిక కావాల్సి ఉంది. తన భర్త మరణంతో ఖాళీ అయిన బారామతి అసెంబ్లీ స్థానం నుంచి ఉప ఎన్నికలో ఆమె పోటీ చేయబోతున్నట్లు సమాచారం. మరోవైపు సునేత్ర పవార్కు ఎక్సైజ్, క్రీడలు, మైనార్టీల అభివృద్ధి శాఖలను కేటాయించారు. ఆమె భర్త నిర్వర్తించిన ఆర్థిక, ప్రణాళిక శాఖలను ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తనవద్దే అట్టిపెట్టుకున్నారు.
ప్రమాణ స్వీకారం అనంతరం సునేత్ర ‘ఎక్స్’లో పోస్టుచేశారు. తన భర్త ఆశయాలను ముందుకు తీసుకెళ్తానని చెప్పారు. ఆయన అడుగు జాడల్లో నడుస్తూ అంకితభావంతో విధులు నిర్వర్తిస్తానని, రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు. ఛత్రపతి శివాజీ, సాహూ, ఫూలే, అంబేడ్కర్ వంటి మహనీయుల ఆదర్శాలే తనకు స్ఫూర్తి అని ఉద్ఘాటించారు.
ప్రధాని మోదీ అభినందనలు
మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన సునేత్ర పవార్కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలియజేశారు. రాష్ట్ర ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం ఆమె నిరంతరం కృషి చేస్తారన్న విశ్వాసం ఉందని పేర్కొన్నారు. ఈ మేరకు శనివారం ఎక్స్లో పోస్టుచేశారు. దివంగత నేత అజిత్ పవార్ ఆశయాలను సునేత్ర నెరవేర్చాలని ఆకాంక్షించారు.
ఆ సంగతి నాకు తెలియదు: శరద్ పవార్
సునేత్ర పవార్ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయబోతున్న సంగతి తనకు ముందుగా తెలియదని ఎన్సీపీ(శరద్ పవార్) అధ్యక్షుడు శరద్ పవార్ అన్నారు. ప్రసార మాధ్యమాల ద్వారానే తనకు తెలిసిందని పేర్కొన్నారు. ప్రమాణ స్వీకారం గురించి ఎవరూ తనతో చర్చించలేదని చెప్పారు. ఎన్సీపీ(అజిత్ పవార్)లో అంతర్గతంగా చర్చించుకొని నిర్ణయం తీసుకొని ఉంటారని అభిప్రాయపడ్డారు.
ఆయన శనివారం బారామతిలో మీడియాతో మాట్లాడారు. రెండు ఎన్సీపీలు విలీనం కావాలని అజిత్ పవార్ కోరుకున్నట్లు తెలిపారు. విలీనం గురించి ఫిబ్రవరి 12న ప్రకటించాలని అజిత్ పవార్ నిర్ణయించినట్లు వెల్లడించారు. రెండు పార్టీలు కలిసిపోవాలని ఆయన బలంగా కోరుకున్నారని స్పష్టంచేశారు. అది సాధ్యమవుతుందని తాను భావిస్తున్నట్లు శరద్ పవార్ వ్యాఖ్యానించారు.


