ముంబై: మహారాష్ట్ర రాజకీయాల్లో అధికార నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ)లో మరోసారి అంతర్గత విభేదాలు బహిర్గతమయ్యాయి. పార్టీ జాతీయ అధ్యక్షురాలిగా సునేత్రా పవార్ ఎన్నికైన విధానాన్ని సవాల్ చేస్తూ పార్టీ సీనియర్ నాయకుడు సచ్చిదానంద్ సింగ్ న్యాయవాది ద్వారా లీగల్ నోటీసు పంపించారు. అధ్యక్ష ఎన్నిక చెల్లదని, పార్టీ రాజ్యాంగానికి విరుద్ధంగా ఈ ప్రక్రియ నిర్వహించారని ఆరోపిస్తూ, తాజాగా మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ పరిణామం ఎన్సీపీలో నాయకత్వంపై కొత్త రాజకీయ చర్చకు దారితీసింది.
వివాదం ఎలా మొదలైంది?
అజిత్ పవార్ మరణానంతరం పార్టీ నాయకత్వంలో మార్పులు చోటుచేసుకున్నాయి. ఈ క్రమంలో సునేత్రా పవార్ను పార్టీ జాతీయ అధ్యక్షురాలిగా ఎన్నుకున్నారు. అయితే ఈ ఎన్నికల ప్రక్రియలో పార్టీ రాజ్యాంగం ప్రకారం సభ్యులకు నోటీసులు ఇవ్వలేదని, నామినేషన్లకు అవకాశం కల్పించలేదని, ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించలేదని సచ్చిదానంద్ సింగ్ ఆరోపిస్తున్నారు. ఎన్నిక పేరుతో కేవలం ఒక అధికారిక ప్రక్రియ మాత్రమే నిర్వహించారని ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు.
లీగల్ నోటీసులో డిమాండ్లు..
ఆమె ఎన్నికపై సింగ్ పంపిన నోటీసులో పలు కీలక అంశాలు ప్రస్తావించారు. సునేత్రా పవార్ ఎన్నికను రద్దు చేయాలి. పార్టీ రాజ్యాంగం ప్రకారం కొత్త ఎన్నికల షెడ్యూల్ ప్రకటించాలి. పార్టీలో అర్హులైన సభ్యులకు పోటీ చేసే అవకాశం కల్పించాలి. ఎన్నికల ప్రక్రియను స్వతంత్రంగా, పారదర్శకంగా నిర్వహించాలి అని అన్నారు. అయితే, పార్టీ ఈ డిమాండ్లపై స్పందించకపోతే న్యాయస్థానాన్ని ఆశ్రయించే అవకాశముందని కూడా నోటీసులో పేర్కొన్నట్లు సమాచారం.
ప్రఫుల్ పటేల్ వ్యాఖ్యలు
ఈ వివాదం వెలుగులోకి వచ్చిన సమయంలో ఎన్సీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రఫుల్ పటేల్ కూడా పార్టీ ప్రస్తుతం క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటోందని అంగీకరించారు. పార్టీలో పరిస్థితిని చక్కదిద్దేందుకు సరిదిద్దే చర్యలు అవసరమని ఆయన వ్యాఖ్యానించడం గమనార్హం. ఈ వ్యాఖ్యలు పార్టీలో అంతర్గత అసంతృప్తి ఉందనే చర్చకు మరింత బలం చేకూర్చాయి. కాగా, సునేత్రా పవార్ నాయకత్వాన్ని న్యాయపరంగా సవాలు చేయడం వల్ల ఎన్సీపీలో నాయకత్వ స్థిరత్వంపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కోర్టు ఈ పిటిషన్ను స్వీకరిస్తే అధ్యక్ష ఎన్నికల చెల్లుబాటుపై విచారణ జరిగే అవకాశం ఉంది. అదే సమయంలో పార్టీ సంస్థాగత వ్యవహారాలు, భవిష్యత్ రాజకీయ వ్యూహాలపై కూడా దీని ప్రభావం ఉండవచ్చని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.


