వివాదాల నేపథ్యంలో.. విజయ్‌ సంచలన నిర్ణయం | Tamil Nadu CM Vijay Removes Vigilance Chief Amid Appointment Row | Sakshi
Sakshi News home page

వివాదాల నేపథ్యంలో.. విజయ్‌ సంచలన నిర్ణయం

Jul 14 2026 7:09 AM | Updated on Jul 14 2026 7:13 AM

Tamil Nadu CM Vijay Removes Vigilance Chief Amid Appointment Row

చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్‌ విజయ్‌ కీలక పరిపాలనా నిర్ణయం తీసుకున్నారు. సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి ఏ. అరుణ్‌ను రాష్ట్ర విజిలెన్స్‌ అండ్‌ యాంటీ కరప్షన్‌ డైరెక్టరేట్‌ డైరెక్టర్‌ పదవి నుంచి తప్పించారు. నియామకం జరిగిన రెండు నెలలు కూడా పూర్తికాకముందే ఈ నిర్ణయం తీసుకోవడం రాష్ట్ర రాజకీయ, అధికార వర్గాల్లో చర్చనీయాంశమైంది.

అరుణ్‌ను ఈ ఏడాది మే నెలలో విజయ్‌ ప్రభుత్వం విజిలెన్స్‌ చీఫ్‌గా నియమించింది. అయితే అప్పటి నుంచే ఆయన నియామకం వివాదాస్పదమైంది. అసెంబ్లీ ఎన్నికల ప్రచార సమయంలో తమిళగ వెట్రి కళగం (టీవీకే) ఆయనను "డీఎంకే అనుకూల అధికారి" అంటూ విమర్శించింది. ఆ సమయంలో ఆయన గ్రేటర్‌ చెన్నై పోలీస్‌ కమిషనర్‌గా పనిచేస్తున్నారు.

అసెంబ్లీ ఎన్నికల సమయంలో వివిధ రాజకీయ పార్టీల ఫిర్యాదుల నేపథ్యంలో ఎన్నికల సంఘం ఆయనను తప్పనిసరి నిరీక్షణ (Compulsory Wait)లో ఉంచిన విషయం కూడా అప్పట్లో చర్చనీయాంశమైంది. ఇక ఆయన విజిలెన్స్‌ చీఫ్‌గా నియామకంపై మద్రాస్‌ హైకోర్టు కూడా తీవ్ర వ్యాఖ్యలు చేసింది. 

అవినీతి నిరోధక సంస్థకు నాయకత్వం వహించే అధికారి నిష్కళంకమైన ప్రతిష్ఠ కలిగి ఉండాలని, "సీజర్‌ భార్యపై ఎలాంటి అనుమానం ఉండకూడదన్నట్లే, విజిలెన్స్‌ డైరెక్టర్‌పై కూడా ఎలాంటి అనుమానాలకు తావుండకూడదు" అని కోర్టు వ్యాఖ్యానించింది. (వివరణ: ప్రాచీన రోమ్ పాలకుడు జూలియస్ సీజర్ తన భార్యపై ఎలాంటి ఆధారాలు లేకపోయినా అనుమానాలు రావడంతో విడాకులు ఇచ్చి, "నా భార్యపై అనుమానం కూడా ఉండకూడదు" అన్నాడు. అప్పటి నుంచే "Caesar's wife must be above suspicion" అనే సామెత ప్రాచుర్యంలోకి వచ్చింది. మద్రాస్‌ హైకోర్టు ఈ సామెతనే ప్రస్తావించింది)..

ఏ. అరుణ్‌ తమిళనాడు కేడర్‌కు చెందిన సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి. అదనపు డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీస్‌ (ADGP) హోదాలో ఉన్న ఆయన గతంలో చెన్నై నగర పోలీస్‌ కమిషనర్‌గా పనిచేశారు. పోలీస్‌ శాఖలో కీలక బాధ్యతలు నిర్వహించిన ఆయనను డీవీఏసీ వంటి అత్యంత కీలకమైన అవినీతి నిరోధక విభాగానికి అధిపతిగా నియమించడం అప్పట్లోనే చర్చకు దారితీసింది. ఇలాంటి సంస్థకు నాయకత్వం వహించే అధికారి ఎంపికలో పారదర్శకత, నిష్పాక్షికత అత్యంత కీలకమని న్యాయస్థానం అభిప్రాయపడింది.

.. ఈ నేపథ్యంలో నియామకంపై వచ్చిన విమర్శలు, న్యాయస్థాన పరిశీలన మధ్య కేవలం రెండు నెలల్లోనే అరుణ్‌ను ఆ పదవి నుంచి తప్పిస్తూ విజయ్‌ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తమిళనాడులో ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది.

ఏడీజీపీ హోదాలో ఉన్న అరుణ్‌ను చెన్నైలోని తమిళనాడు పోలీస్‌ అకాడమీ డైరెక్టర్‌గా బదిలీ చేశారు. ఆయన స్థానంలో ప్రస్తుతం డీవీఏసీ(DVAC) లో ప్రత్యేక దర్యాప్తు విభాగం ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌గా పనిచేస్తున్న సీ. మహేశ్వరి ఐపీఎస్‌కు విజిలెన్స్‌ డైరెక్టర్‌ బాధ్యతలను అదనంగా అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement