న్యూఢిల్లీ: తమిళనాడు వ్యాప్తంగా గోవధను సంపూర్ణంగా నిషేధించాలంటూ మద్రాస్ హైకోర్టు జారీ చేసిన ఆదేశాలపై సుప్రీంకోర్టు సోమవారం మధ్యంతర స్టే విధించింది. హైకోర్టు ఇచ్చిన ఈ వివాదాస్పద తీర్పును సవాలు చేస్తూ, తమిళనాడు ప్రభుత్వం దాఖలు చేసిన అప్పీలును జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం విచారించింది.
బక్రీద్ లేదా మరే ఇతర రోజుల్లోనైనా ఆవులు, దూడల వధను పూర్తిగా నిషేధించాలని మే 27న మద్రాస్ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. బహిరంగ ప్రదేశాల్లో గోవధను అరికట్టాలని కోరుతూ హిందూ మక్కల్ కట్చి ప్రధాన కార్యదర్శి కె. సూర్య ప్రశాంత్ దాఖలు చేసిన పిటిషన్ విచారణ సందర్భంగా.. హైకోర్టు ఒక పరిధిని మించి పూర్తి నిషేధాన్ని విధించిందని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో వాదించింది. లైసెన్స్ పొందిన వధశాలల్లో కూడా ఆవుల వధను నిషేధించడం చట్టవిరుద్ధమని ప్రభుత్వం పేర్కొంది.
తమిళనాడు జంతు సంరక్షణ చట్టం 1958, పట్టణ స్థానిక సంస్థల చట్టం 1998, 2023 నిబంధనలు జంతువుల వధను క్రమబద్ధీకరించడానికే ఉద్దేశించినవని, పూర్తిగా నిషేధించడానికి కాదని స్పష్టం చేసింది. ప్రభుత్వ వాదనలను పరిశీలించిన సుప్రీంకోర్టు, హైకోర్టు ఉత్తర్వుల అమలుపై మధ్యంతర స్టే మంజూరు చేసింది.
ఇది కూడా చదవండి: బద్రీనాథ్ విరాళాల చోరీ: సస్పెండైన ఉద్యోగి అరెస్ట్


