కరూర్ ఘటనలో ఆయన నిందితుడు కాదు
డీఎంకే పిటిషన్పై సుప్రీం వ్యాఖ్య
న్యూఢిల్లీ: తమిళనాడు సీఎం సి. జోసెఫ్ విజయ్ కరూర్ తొక్కిసలాట కేసులో నిందితుడిగా లేరని, ఆయన పర్యటనను తాము నియంత్రించలేమని సుప్రీంకోర్టు తెలిపింది. సీఎం విజయ్ పర్యటనను ప్రశ్నిస్తూ, అలాగే ఈ వ్యవహారంలో మంత్రులు సాక్షులను ప్రభావితం చేస్తున్నారని ఆరోపిస్తూ డీఎంకే వేసిన పిటిషన్పై మంగళవారం జస్టిస్ కేవీ విశ్వనాథన్, జస్టిస్ అలోక్ అరా«ధేల ధర్మాసనం విచారణ చేపట్టింది. ‘ముఖ్యమంత్రి పర్యటనను నియంత్రించాలని, ఆయన పర్యటన షెడ్యూల్ను కూడా మేమే ఖరారు చేయాలని మీరు కోరుకుంటున్నారా? ఇదెలా సాధ్యం?’అని ప్రశ్నించింది.
న్యాయస్థానాన్ని రాజకీయ వేదికగా మార్చొద్దని వ్యాఖ్యానించింది. పిటిషనర్గా ఉన్న డీఎంకే కార్యదర్శి ఆర్ఎస్ భారతి తరఫున సీనియర్ న్యాయవాది రంజిత్ కుమార్ వాదనలు వినిపించారు. కరూర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి టీవీకే ప్రభుత్వంలోని మంత్రులు తప్పుదోవ పట్టించే ప్రకటనలు చేస్తున్నారని ఆరోపించారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈ కేసును సీబీఐ విచారిస్తోంది. అలాంటప్పుడు, సుప్రీం ఆదేశాలకు విరుద్ధంగా ఉద్దేశపూర్వకంగా రాష్ట్ర మంత్రి ఆధవ్ అర్జున్ చేస్తున్న వ్యాఖ్యలపై ధిక్కార పిటిషన్ వేయాలని కూడా డీఎంకే ఆలోచిస్తోందన్నారు.
ఈ కేసు గురించి సీఎం, మంత్రులు ఎలాంటి వ్యాఖ్యలు చేయకుండా నిలువరించాలని కోరారు. స్పందించిన ధర్మాసనం..‘అంటే వాక్ స్వాతంత్య్రంపై మేం నిషేధాజ్ఞలు విధించాలని కోరుకుంటున్నారా? వారి మాటలకు మీరు కూడా మాటలతోనే సమాధానం చెప్పండి. ఈ కేసును సుప్రీంకోర్టు ఇప్పటికే సీబీఐకి బదిలీ చేసింది. అలాంటప్పుడు, ఒక రాజకీయ ప్రత్యర్థి ఈ కేసులో ఒక పక్షంగా చేరాలని ఎలా కోరగలరు?’అని ప్రశ్నించింది. అయితే, సీబీఐ దర్యాప్తు ముగిసే వరకు కేసుపై ఎలాంటి వ్యాఖ్యలు చేయరాదని, విచారణను ప్రభావితం చేయరాదన్నది మాత్రమే తమ ఉద్దేశమని రంజిత్ కుమార్ వివరించారు.
వాక్ స్వాతంత్య్రాన్ని మరింత బాధ్యతాయుతంగా ఉపయోగించుకోవాలన్నది డీఎంకే పార్టీ అభిమతమన్నారు. మరలాంటప్పుడు, ప్రభుత్వం ఇప్పటికే హామీ ఇచి్చన విధంగా తొక్కిసలాట బాధితులకు రూ.10 లక్షల పరిహారం, కుటుంబంలో ఒకరికి చొప్పున ఉద్యోగం ఇవ్వడం దర్యాప్తును ఎలా ప్రభావితం చేయగలదని ధర్మాసనం లాయర్ రంజిత్ కుమార్ను అడిగింది. పిటిషన్ను ఉపసంహరించుకునే అవకా>శం డీఎంకేకు కల్పిస్తున్నామని ధర్మాసనం తెలిపింది. ఈ కేసు దర్యాప్తు పర్యవేక్షణకు సుప్రీంకోర్టు నియమించిన రిటైర్డు జస్టిస్ అజయ్ రస్తోగి సారథ్యంలోని కమిటీని ఆశ్రయించవచ్చని సూచించింది.


