రాహుల్ ద్రవిడ్.. భారత క్రికెట్ చరిత్రలో ఆటగాడిగా, కోచ్గా తనకంటూ ప్రత్యేక స్ధానాన్ని సంపాందించుకున్నాడు. మైదానంలో ఎంతటి కష్టపరిస్థితులు ఎదురైనా ఒత్తిడికి లోనవకుండా, వికెట్ పడకుండా అడ్డుగోడలా నిలబడి భారత జట్టుకు ఎన్నో విజయాలను అందించాడు.
దాదాపు రెండు దశాబ్దాల పాటు టీమిండియాకు కొండంత అండగా నిలిచిన ది వాల్ ద్రవిడ్ వారసత్వాన్ని.. ఇప్పుడు అతడి చిన్న కుమారుడు అన్వయ్ ద్రవిడ్ కొనసాగిస్తున్నాడు. అన్వయ్ ప్రస్తుతం భారత్ అండర్-19 జట్టుకు ప్రాతనిథ్యం వహిస్తున్నాడు. అయితే సోమవారం హంబన్తోట వేదికగా శ్రీలంక అండర్-19 జట్టుతో రెండో యూత్ వన్డేలో అన్వయ్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు.
తన విరోచిత బ్యాటింగ్తో 82 పరుగులకే నాలుగు కీలక వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడిన భారత జట్టును ఆదుకున్నాడు. మరో మిడిలార్డర్ బ్యాటర్ అర్జున్ రాజ్పుత్తో కలిసి ఇన్నింగ్స్ను చక్కదిద్దాడు. వీరిద్దరూ ఐదో వికెట్కు 145 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.
ఈ జూనియర్ ద్రవిడ్ కేవలం 67 బంతుల్లో 9 ఫోర్లు, ఒక సిక్సర్తో 87 పరుగులు చేశాడు. అన్వయ్ 13 పరుగుల తేడాతో సెంచరీ చేజార్చుకున్నప్పటికీ.. జట్టు మంచి స్కోర్ సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. అతడితో పాటు అర్జున్(76) హాఫ్ సెంచరీతో రాణించాడు. ఫలితంగా భారత్ 47.2 ఓవర్లలో 285 పరుగుల స్కోర్ సాధించి ఆలౌటైంది. శ్రీలంక బౌలర్లలో గిమ్హాన్ మెండిస్ 5 వికెట్లతో చెలరేగాడు.
చదవండి: వైభవ్ ‘అరంగేట్రం’పై విమర్శలు.. స్పందించిన బీసీసీఐ


