టీమిండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి ఘనమైన అరంగేట్రం లభించలేదు. శనివారం మాంచెస్టర్ వేదికగా ఇంగ్లండ్తో జరిగిన రెండో టీ20లో డెబ్యూ చేసిన వైభవ్.. కేవలం 14 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. రెండు సిక్సర్లు కొట్టి మంచి టచ్లో కనిపించిన ఈ చిచ్చర పిడుగు, విల్ జాక్స్ బౌలింగ్లో స్టంపౌటయ్యాడు.
భారత ఇన్నింగ్స్ ఐదో ఓవర్ వేసిన జాక్స్.. ఐదో బంతిని వైభవ్కు ఔట్ సైడ్ ఆఫ్ స్టంప్ దిశగా సంధించాడు. అయితే బంతిని సరిగ్గా అంచనా వేయడంలో విఫలమైన వైభవ్, ఫ్రంట్ ఫుట్కు వచ్చి కట్ షాట్ ఆడేందుకు ప్రయత్నించాడు. కానీ బంతి మిస్స్ అయ్యి వికెట్ కీపర్ జోస్ బట్లర్ చేతికి వెళ్లింది.
బట్లర్ స్టంప్స్ను గిరాటేశాడు. దీంతో వైభవ్ తొలి మ్యాచ్ ఇన్నింగ్స్ ముగిసింది. ఈ నేపథ్యంలో కామెంటరీ బాక్స్లో ఉన్న భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఆ సమయంలో వైభవ్ అలాంటి షాట్ ఆడాల్సిన అవసరం లేదని, బౌలర్ ట్రాప్లో చిక్కుకున్నాడని గవాస్కర్ అభిప్రాయపడ్డారు.
"అది వైభవ్ ఆడే షాట్ కాదు. అనవసరంగా క్రీజు వదలి బయటకు వచ్చాడు. కట్షాట్ ఆడుతాడని ఊహించలేదు. అతడి అసలైన బలం కవర్ డ్రైవ్" అని ఆయన అన్నారు. అంతకుముందు మ్యాచ్ ప్రారంభంలో గవాస్కర్ మాట్లాడుతూ.. సూర్యవంశీ ఇప్పుడు భారత్ ముద్దుబిడ్డగా మారాడు. ప్రతి ఒక్కరూ అతడి రాణించాలని కోరుకుంటున్నారు.
అతడు తనదైన శైలిలో మొదటి బంతి నుంచి దూకుడుగా ఆడుతాడని ఆశిస్తున్నాను అని పేర్కొన్నారు. కాగా సంజూ శాంసన్ స్ధానంలో వైభవ్కు తుది జట్టులో చోటు దక్కింది. ఈ బిహార్ క్రికెటర్కు మరో అవకాశమిచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. మూడో టీ20లో కూడా వైభవ్ ఆడనున్నట్లు వార్తలు వస్తున్నాయి. జూలై 7న మూడో టీ20 ట్రెంట్బ్రిడ్జ్ వేదికగా జరగనుంది.


