గాలే వేదికగా టీమిండియాతో జరిగిన తొలి టెస్టులో 165 పరుగుల తేడాతో శ్రీలంక ఓటమి పాలైంది. దీంతో డబ్ల్యూటీసీ 2025-27 ఫైనల్కు చేరే అవకాశాలను లంక మరింత సంక్లిష్టం చేసుకుంది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ తమ మొదటి ఇన్నింగ్స్లో 462 పరుగుల భారీ స్కోర్ సాధించింది.
దేవ్దత్త్ పడిక్కల్(167) సెంచరీతో సత్తాచాటగా.. కేఎల్ రాహుల్(82), ధ్రువ్ జురెల్(51) అర్ధ శతకాలతో రాణించారు. అనంతరం ఆతిథ్య జట్టు తమ మొదటి ఇన్నింగ్స్లో 284 పరుగులకు ఆలౌటైంది. సోనల్ దినుష(100) వీరోచిత సెంచరీతో మెరిశాడు. మానవ్ సుతార్ 4 వికెట్ల తీసి లంక జట్టును దెబ్బ తీశాడు. ఆ తర్వాత భారత్ సెకెండ్ ఇన్నింగ్స్లో ధాటిగా ఆడే క్రమంలో 193 పరుగులకు ఆలౌటైంది.
కానీ తొలి ఇన్నింగ్స్లో లభించిన 178 పరుగుల ఆధిక్యాన్ని జోడించి శ్రీలంకకు 372 పరుగుల టార్గెట్ను టీమిండియా నిర్ధేశించింది. ఈ లక్ష్య చేధనలో శ్రీలంక 206 పరుగులకే కుప్పకూలింది. రెండో ఇన్నింగ్స్లో కూడా మానవ్ సుతార్ ఆరు వికెట్లతో ప్రత్యర్ధి జట్టు పతనాన్ని శాసించాడు. సుతార్ ఓవరాల్గా 10 వికెట్లు పడగొట్టి అందరిని ఆశ్చర్యపరిచాడు.
ఇక ఈ ఓటమిపై మ్యాచ్ అనంతరం లంక కెప్టెన్ ధనంజయ డి సిల్వా స్పందించాడు. రాహుల్, పడిక్కల్ నెలకొల్పిన భాగస్వామ్యమే తమ ఓటమిని శాసించందని డి సిల్వా అభిప్రాయపడ్డాడు.
"రెండో రోజు ఆటలో మేము పుంజుకుని పోటీలోకి తిరిగిచ్చాం. గాలేలో నాలుగో ఇన్నింగ్స్ ఆడటం అంత సులభం కాదు. అయినప్పటికి మా కుర్రాళ్లు గట్టిగానే పోరాడారు. ఈ మ్యాచ్ నుంచి చాలా పాఠాలు నేర్చుకున్నాం. అంతేకాకుండా మాకు చాలా సానుకూల అంశాలు ఉన్నాయి.
ముఖ్యంగా సోనల్ దినుష అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. అతడికి మంచి భవిష్యత్తు ఉంది. మొదటి మూడు రోజులు బ్యాటింగ్కు పిచ్ బాగా అనుకూలించింది. టీమిండియా టాస్ గెలిచి తొలి ఇన్నింగ్స్లో భారీ స్కోర్ సాధించడం వారికి కలిసివచ్చింది. కేఎల్ రాహుల్, దేవదత్ పడిక్కల్ మంచి భాగస్వామ్యం నెలకొల్పి మాపై ఒత్తిడి పెంచారు.
అనంతరం మా బ్యాటింగ్లో రుసగా వికెట్లు కోల్పోయి ఆరంభంలోనే వెనుకబడిపోయాం. మిడిలార్డర్లో సోనల్, నిరోషన్ భాగస్వామ్యం నెలకొల్పినప్పటికి భారత్ స్కోర్ దగ్గరకు చేరుకోలేకపోయాం. రెండో మ్యాచ్లో గెలిచి సిరీస్ సమం చేసేందుకు ప్రయత్నిస్తామని" పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్లో డిసిల్వా పేర్కొన్నాడు.


