PC: BCCI X
భారత టెస్టు క్రికెట్లో చారిత్రక మ్యాచ్లో టీమిండియా ఘన విజయం సాధించింది. శ్రీలంకతో గాలె వేదికగా జరిగిన తొలి టెస్టులో ఏకంగా 165 పరుగుల తేడాతో జయభేరి మోగించింది. తద్వారా తమ 600వ టెస్టును భారత్ భారీ గెలుపుతో చిరస్మరణీయం చేసుకుంది.
బౌలర్ల విజృంభణ
కాగా ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ 2025-27 సీజన్లో భాగంగా రెండు మ్యాచ్లు ఆడేందుకు టీమిండియా శ్రీలంకకు వెళ్లింది. ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య శనివారం మొదలైన తొలి టెస్టు.. బుధవారం ఆఖరి రోజు ఆటతో ముగిసింది. ఈ మ్యాచ్లో భారత్ విధించిన 372 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక లంక చతికిలపడింది.
భారత బౌలర్ల విజృంభణ కారణంగా లక్ష్య ఛేదనలో కేవలం 206 పరుగులే చేసి ఆలౌట్ అయింది. ఇక ఈ మ్యాచ్లో భారత యువ స్పిన్నర్ మానవ్ సుతార్ మొత్తంగా పది వికెట్లు కూల్చి లంక బ్యాటింగ్ ఆర్డర్ను కుదేలు చేయగా.. సెంచరీ హీరో దేవదత్ పడిక్కల్కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు లభించింది.
సెంచరీ హీరో పడిక్కల్
భారత తొలి ఇన్నింగ్స్లో వన్డౌన్ బ్యాటర్ పడిక్కల్ భారీ శతకం (167) బాదాడు. ఫలితంగా టీమిండియా 462 పరుగులు చేయగలిగింది. దీంతో రెండో ఇన్నింగ్స్లో 193 పరుగులకే చాపచుట్టేసినా.. మొదటి ఇన్నింగ్స్ ఆధిక్యం కలుపుకొని లంకకు 372 పరుగుల మేర భారీ టార్గెట్ నిర్దేశించగలిగింది.
ఇదిలా ఉంటే.. 1932లో టీమిండియా తన టెస్టు ప్రయాణం మొదలుపెట్టింది. మొట్టమొదట ఇంగ్లండ్తో ప్రఖ్యాత లార్డ్స్ మైదానంలో మ్యాచ్ ఆడింది. ప్రస్తుతం 600 మైలురాయికి చేరుకుంది. మరి ఈ టీమిండియా ప్రయాణంలో వర్షం లేదా ఇతర కారణాల వల్ల రద్దైన మ్యాచ్లు పోనూ మొత్తం గెలుపులు, ఓటములు ఎన్నో తెలుసా?.. ప్రతి వంద మ్యాచ్ల మధ్య భారత జట్టు జర్నీ ఎలా సాగిందంటే..
1-600 జర్నీ సాగిందిలా..
1-100: 10 విజయాలు, 40 ఓటములు, 50 డ్రా
101-200: 25 విజయాలు, 32 ఓటములు, 43 డ్రా
201-300: 21 విజయాలు, 26 ఓటములు, ఒకటి టై, 52 డ్రా
301-400: 32 విజయాలు, 31 ఓటములు, 37 డ్రా
401-500: 42 విజయాలు, 28 ఓటములు. 30 డ్రా
501-600: 57 విజయాలు, 31 ఓటములు, 2 డ్రా.
మొత్తం: 187 విజయాలు, 188 ఓటములు, 1 టై, 214 డ్రా.


