source: X
స్వదేశంలో జరుగుతున్న BWF వరల్డ్ ఛాంపియన్షిప్ 2026 నుంచి భారత స్టార్ షట్లర్ లక్ష్యసేన్ అనూహ్యంగా నిష్క్రమించాడు. పురుషుల సింగిల్స్ రౌండ్ ఆఫ్ 32లో అమెరికాకు చెందిన గారెట్ టాన్ చేతిలో 21-19, 19-21, 17-21తో ఓటమి చవిచూశాడు. తొలి గేమ్ను గెలుచుకున్న లక్ష్య.. రెండో గేమ్లో ఆధిపత్యం కొనసాగించలేకపోయాడు. టాన్ పుంజుకుని రెండో గేమ్ను గెలుచుకోవడంతో మ్యాచ్ నిర్ణాయక మూడో గేమ్కు వెళ్లింది.
పోరాడినా ఫలితం దక్కలేదు
మూడో గేమ్లో టాన్ ప్రారంభం నుంచే దూకుడుగా ఆడాడు. ఒక దశలో 11-4 ఆధిక్యంలోకి వెళ్లాడు. అయితే లక్ష్యసేన్ అద్భుతంగా పుంజుకుని వరుస పాయింట్లు సాధించాడు. స్కోరు 17-16కు చేరడంతో మ్యాచ్ ఉత్కంఠభరితంగా మారింది.
కీలక సమయంలో టాన్ ఒత్తిడిని జయించి వరుస పాయింట్లు సాధించాడు. దీంతో 21-17తో మూడో గేమ్ను, మ్యాచ్ను సొంతం చేసుకున్నాడు. ఈ ఓటమితో ప్రపంచ ఛాంపియన్షిప్లో లక్ష్యసేన్ ప్రయాణం ముగిసింది.
ఆయుష్ శెట్టి సంచలనం
మరోవైపు భారత యువ షట్లర్ ఆయుష్ శెట్టి ఈ టోర్నీలో ఇప్పటికే సంచలన విజయం నమోదు చేశాడు. 21 ఏళ్ల ఆయుష్ పురుషుల సింగిల్స్లో ప్రపంచ నంబర్ వన్, చైనా స్టార్ షి యూకీని ఓడించి సంచలనం సృష్టించాడు. ఇవాళే జరుగబోయే రెండో రౌండ్లో ఆయుష్ బరిలోకి దిగనున్నాడు.
సింధుపై ఆశలు
భారత స్టార్ పీవి సింధు కూడా ఇవాళే తన రెండో రౌండ్ మ్యాచ్లో బరిలోకి దిగనుంది. లక్ష్యసేన్ అనూహ్య నిష్క్రమణతో నిరాశ చెందిన భారత అభిమానులకు ఇప్పుడు సింధు, ఆయుష్ శెట్టి ప్రదర్శనలపై ఆశలు పెట్టుకున్నారు.


