జపాన్ వేదికగా జరుగుతున్న ఆసియా గేమ్స్ 2026లో భారత మహిళల బ్యాడ్మింటన్ జట్టు శుభారంభం చేసింది. ఆదివారం జరిగిన రౌండ్ ఆఫ్ 16 (ప్రీక్వార్టర్స్) పోరులో భారత్ 3-0తో కజకిస్థాన్ను చిత్తు చేసి క్వార్టర్ ఫైనల్స్కు దూసుకెళ్లింది. ఈ మ్యాచ్లో భారత షట్లర్లు పి.వి. సింధు, ఉన్నతి హుడా, తన్వి శర్మలు అద్భుత ప్రదర్శనతో ప్రత్యర్థి జట్టుకు చెమటలు పట్టించారు. వీరి ధాటికి కజకిస్థాన్ ఆటగాళ్లు చేతులెత్తేశారు.
మొదటి సింగిల్స్లో కామిలా స్మాగులోవాపై 21-7, 21-9 తేడాతో పి.వి. సింధు ఘనవిజయం సాధించింది. అనంతరం రెండో సింగిల్స్లో అలెస్సా కులేషోవాను 21-7, 21-10 తేడాతో ఉన్నతి హుడా ఓడించి భారత ఆధిక్యాన్ని 2-0కి పెంచింది.
ఇక మూడో సింగిల్స్తో డయానా నమేనోవాపై 21-5, 21-10 తేడాతో తన్వి శర్మ విజయం సాధించి 3-0తో క్లీన్ స్వీప్ పూర్తి చేసింది. ఈ భారత త్రయం కేవలం 65 నిమిషాల్లోనే ప్రత్యర్థులను మట్టికరిపించడం విశేషం. మంగళవారం రోజున క్వార్టర్ఫైనల్లో ఆతిథ్య జపాన్ జట్టుతో భారత బృందం తలపడనుంది. మొదటి రౌండ్లో 'బై' పొందిన జపాన్, క్వార్టర్స్లో భారత జట్టుకు గట్టి పోటీనిచ్చేందుకు సిద్ధంగా ఉంది.
చదవండి: IND vs NZ: టీమిండియాకు కొత్త కెప్టెన్?


