సాక్షి, విశాఖపట్నం: ఏపీకి వాతావరణ శాఖ మరోసారి వర్ష హెచ్చరిక జారీ చేసింది. ఉత్తర అండమాన్ సముద్రంలో అల్పపీడనం ఏర్పడింది. ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ క్రమంగా బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అల్ప పీడనం ప్రభావంతో రానున్న ఐదు రోజుల పాటు ఏపీలో పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
అల్పపీడనం మంగళవారం నాటికి తూర్పు మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడే అవకాశం ఉంది. అనంతరం పశ్చిమ వాయువ్య దిశగా పయనిస్తూ 23వ తేదీ నాటికి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండంగా బలపడే అవకాశాలు ఉన్నాయని అధికారులు అంచనా వేస్తున్నారు. కాగా, అల్పపీడనం ఇదే దిశలో కదులుతూ మరింత బలపడితే.. ఉత్తర కోస్తా ఆంధ్ర-దక్షిణ ఒడిశా మధ్య తీరాన్ని దాటే అవకాశం ఉంది. దీని ప్రభావంతో ఏపీలో రానున్న ఐదు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా కోస్తా జిల్లాల్లో వర్షాల తీవ్రత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. రేపటి నుంచి వర్షాలు క్రమంగా పుంజుకునే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
ఈ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండండి
రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికల ప్రకారం...
▪️ప్రకాశం,మార్కాపురం,నెల్లూరు, కడప, కర్నూలు,నంద్యాల,శ్రీసత్యసాయి, అనంతపురం జిల్లాల్లో ఈదురుగాలులు, పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
▪️కావలిలో మోస్తరు నుంచి భారీ వర్షం, pic.twitter.com/CNvAVWBswe— Andhra Pradesh State Disaster Management Authority (@APSDMA) September 20, 2026
మరోవైపు.. రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికల ప్రకారం.. ప్రకాశం, మార్కాపురం, నెల్లూరు, కడప, కర్నూలు, నంద్యాల, శ్రీసత్యసాయి, అనంతపురం జిల్లాల్లో ఈదురుగాలులు, పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే కావలి, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. ప్రజలందరూ సురక్షిత ప్రాంతాల్లో ఉంటూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచనలు చేసింది.
తీరంలో ఈదురుగాలులు
అల్పపీడనం బలపడుతున్న నేపథ్యంలో తీరం వెంబడి ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. సముద్రంలో పరిస్థితులు ప్రతికూలంగా మారే అవకాశం ఉన్నందున మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
ఇదీ చదవండి: కరువు ప్రకటనపై దిగి వచ్చిన చంద్రబాబు సర్కార్


