వైఎస్ జగన్ హెచ్చరికతో కరువు మండలాల ప్రకటనకు సిద్ధమైన ప్రభుత్వం..మండలాల వారీగా నష్టం అంచనాకు కసరత్తు
ఈనెల 24లోగా కరువు ప్రభావంపై నివేదికలు ఇవ్వాలని కలెక్టర్లకు ఆదేశాలు
సాక్షి, అమరావతి: ఎట్టకేలకు కరువు మండలాల ప్రకటనకు బాబు ప్రభుత్వం సిద్ధమవుతోంది. మండలాల వారీగా నష్టాల అంచనాకు కసరత్తు మొదలుపెట్టింది. ఈ నెల 24లోగా కరువు పరిస్థితులపై నివేదికలు ఇవ్వాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రాన్ని కరువు కమ్మేసినా బాబు ప్రభుత్వం రైతుల గోడు పట్టించుకోవడం లేదంటూ వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ ఇటీవల తీవ్రంగా విరుచుకుపడ్డారు.
రాష్ట్రంలో నెలకొన్న కరువు పరిస్థితులు, రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం ప్రదర్శిస్తున్న నిర్లక్ష్య తీరును ఎండగట్టారు. తక్షణమే కరువు మండలాలను ప్రకటించి రైతులను ఆదుకునేందుకు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు మొద్దునిద్ర వీడకపోతే ఆందోళనబాట పడతామని హెచ్చరించారు. దీంతో చంద్రబాబు ప్రభుత్వంలో కదలిక వచ్చింది. ఎట్టకేలకు కరువు మండలాల ప్రకటనపై కసరత్తు ప్రారంభించింది.
54.3 శాతం లోటు వర్షపాతం..
ఖరీఫ్ సీజన్ ప్రారంభమైన తర్వాత జూన్ 1 నుంచి సెప్టెంబర్ 20కి 54.3 శాతం వర్షపాతం లోటు నమోదైనట్లు రెవెన్యూ(విపత్తు నిర్వహణ) శాఖ తెలిపింది. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల దృష్ట్యా కరువు ప్రకటన చేసే ప్రక్రియ మొదలుపెట్టింది. ఈ మేరకు కలెక్టర్లకు ఆదేశాలిచ్చింది. ముందస్తు కరువు పరిస్థితుల అంచనా చేపట్టాలని సూచించింది. కరువు ప్రాంతంగా గుర్తించేందుకు వర్షాభావంతో పాటు వ్యవసాయ పంటలు, భూస్థితి తదితరాలపై చూపిన ప్రభావాన్ని కూడా లెక్కించాలని ఆదేశించింది. ఏ మండలంలో వర్షాభావం ఎక్కువగా ఉంది? ఎక్కడ సాగు దెబ్బతింది, ఏఏ పంటలు ఏంత మేర ఎండిపోయాయి? దిగుబడులు ఏ మేరకు తగ్గే పరిస్థితి ఏర్పడిందో పక్కాగా డేటా సేకరించాలని స్పష్టం చేసింది.
ఈ నెల 24లోగా జిల్లాల వారీగా కరువు పరిస్థితులపై నివేదికలు ఇవ్వాలని కలెక్టర్లను ఆదేశించింది. నగరాలు, పట్టణాలు, మండలాలకు సంబంధించి నిర్దేశిత నమూనాల్లో కరువు ప్రతిపాదనలను పంపించాలని సూచించింది. జూన్ 1 నుంచి ఆగస్టు 31 వరకు నమోదైన వర్షపాతంతో పాటు పొడి వాతావరణం ప్రభావ సూచికల వివరాలను పరిగణనలోకి తీసుకుని అంచనా వేయాలంది. కరువు ప్రతిపాదనలలో క్షేత్రస్థాయి వాస్తవ నివేదికను కూడా పొందుపర్చాలని ఆదేశించింది. పంట నష్టం వివరాలను క్షేత్రస్థాయి ఫొటోల ద్వారా నమోదు చేయాలని పేర్కొంది. ఆ ఫొటోలను, వివరాలను జిల్లా స్థాయిలో భద్రపరచాలని ఆదేశాలిచ్చింది. మండలాల వారీగా జిల్లాల నుంచి అందే ప్రతిపాదనల ఆధారంగా కరువు మండలాల ప్రకటన చేసేందుకు ఏర్పాట్లు చేయాలని ఆదేశించింది. ఈనెల 30లోగా అన్నీ సిద్ధం చేయాలని స్పష్టం చేసింది.


