బట్లర్, టామ్ బాంటన్ (PC: ECB Twitter)
కార్డిఫ్ వేదికగా శ్రీలంకతో జరిగిన రెండో టీ20 మ్యాచ్లో ఇంగ్లండ్ బ్యాటర్ జోస్ బట్లర్ ప్రపంచ రికార్డు సాధించాడు. టీ20 క్రికెట్లో 15వేల పరుగులు చేసిన తొలి ప్లేయర్గా బట్లర్ నిలిచాడు. కీరన్ పొలార్డ్ (14,999 రన్స్) రెండో స్థానంలో, అలెక్స్ హేల్స్ (14, 581 పరుగులు) మూడో స్థానంలో ఉన్నాడు. దీంతో పాటు బట్లర్ మరో రికార్డును కూడా తన పేరిట లిఖించుకున్నాడు. అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ల జాబితాలో బట్లర్ రెండో స్థానానికి చేరుకున్నాడు. మ్యాచ్లో 30 పరుగులు సాధించిన బట్లర్ 162 ఇన్నింగ్స్ల్లో 4,322 పరుగులు చేశాడు.
మ్యాచ్ విషయానికొస్తే ఇంగ్లండ్ 6 వికెట్ల తేడాతో శ్రీలంకపై విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక ఇంగ్లండ్ బౌలర్ల ధాటికి 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 145 పరుగులకు పరిమితమైంది. ఓపెనర్ పాతుమ్ నిస్సాంక (37) టాప్ స్కోరర్గా నిలవగా, చరిత్ అసలంక (31) పర్వాలేదనిపించాడు. ఇంగ్లండ్ బౌలర్లలో లియామ్ డాసన్ 3 వికెట్లు తీయగా, జేమీ ఓవర్టన్, జోఫ్రా ఆర్చర్ చెరో 2 వికెట్లు పడగొట్టారు.

PC: ECB Twitter
అనంతరం బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 12.1 ఓవర్లలోనే 4 వికెట్లు కోల్పోయి 146 పరుగులు చేసి గెలుపొందింది. టామ్ బాంటన్ (24 బంతుల్లో 52 నాటౌట్) అజేయ అర్థసెంచరీతో జట్టు విజయంలో కీలకపాత్ర పోషించగా, జోస్ బట్లర్ (30), కెప్టెన్ హ్యారీ బ్రూక్ (23) రాణించారు. లంక బౌలర్లలో చమీర, హసరంగ, మలింగ, రత్నాయకే తలా ఒక వికెట్ తీశారు.
ఫలితంగా మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 2-0తో సిరీస్ కైవసం చేసుకున్న ఇంగ్లండ్ క్లీన్స్వీప్పై దృష్టి సారించగా, లంక మాత్రం చివరి మ్యాచ్లోనైనా గెలిచి పరువు కాపాడుకోవాలని చూస్తోంది. ఇరుజట్ల మధ్య మూడో టీ20 రేపు మాంచెస్టర్ వేదికగా జరగనుంది. టీ20ల్లో శ్రీలంకపై ఇంగ్లండ్కు ఇది వరుసగా 14వ విజయం కాగా, కెప్టెన్గా బ్రూక్కు 25 మ్యాచ్ల్లో 22వ విజయం కావడం విశేషం.
ఇదీ చదవండి: విదేశీ విద్యార్థులకు షాకిచ్చిన ఆస్ట్రేలియా ప్రభుత్వం!


