source: X
ఆఫ్ఘనిస్తాన్తో జరుగుతున్న మూడో టీ20లో టీమిండియా ఓపెనర్ సంజూ శాంసన్ ఓ అరుదైన మైలురాయిని తాకాడు. ఈ మ్యాచ్లో 35 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 50 పరుగులు చేసి ఔటైన అతడు.. టీ20 క్రికెట్లో 9000 పరుగులు పూర్తి చేసిన ఆటగాళ్ల క్లబ్లో చేరాడు.
తద్వారా ఈ ఘనత సాధించిన 34వ బ్యాటర్గా రికార్డుల్లోకెక్కాడు. పొట్టి ఫార్మాట్లో ఇప్పటివరకు 351 మ్యాచ్లు ఆడిన సంజూ 140కి పైగా స్ట్రయిక్రేట్తో 8 సెంచరీలు, 56 అర్ద సెంచరీల సాయంతో 9027 పరుగులు చేశాడు. భారత్ తరఫున సంజూకు ముందు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, శిఖర్ ధవన్, సూర్యకుమార్ యాదవ్ మాత్రమే 9000 టీ20 పరుగులు పూర్తి చేశారు.
సంజూ విషయాన్ని అటుంచితే.. ఈ మ్యాచ్లో మరో భారత ఓపెనర్ అభిషేక్ శర్మ మహోగ్రరూపం దాల్చాడు. కేవలం 30 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసి చరిత్ర సృష్టించాడు. టెస్ట్ క్రికెట్ ఆడే దేశాల్లో, భారత్ తరఫున ఇదే ఫాస్టెస్ట్ సెంచరీ. ఈ మ్యాచ్కు ముందు భారత్ తరఫున ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డు రోహిత్ శర్మ (35 బంతులు) పేరిట ఉంది.
ఓవరాల్గా చూస్తే.. అంతర్జాతీయ టీ20 క్రికెట్ చరిత్రలో ఇది మూడో వేగవంతమైన సెంచరీ. ఎస్టోనియాకు చెందిన సాహిల్ చౌహాన్ 27 బంతుల్లో, టర్కీకి చెందిన ముహమ్మద్ ఫాహద్ 29 బంతుల్లో సెంచరీలు చేసి, అభిషేక్ కంటే ముందున్నారు.
34 బంతుల్లో 11 సిక్సర్లు, 9 ఫోర్ల సాయంతో 108 పరుగులు చేసిన తర్వాత అభిషేక్ ఔటయ్యాడు. 15 ఓవర్ల తర్వాత భారత్ స్కోర్ 184-3గా ఉంది. శ్రేయస్ అయ్యర్ (11), శివమ్ దూబే (13) క్రీజ్లో ఉన్నారు.
ఇదీ చదవండి: చరిత్ర సృష్టించిన అభిషేక్ శర్మ.. 30 బంతుల్లోనే సెంచరీ


