source: BCCI X
న్యూఢిల్లీ వేదికగా ఆఫ్ఘనిస్తాన్తో జరుగుతున్న మూడో టీ20లో టీమిండియా ఓపెనర్ అభిషేక్ శర్మ మహోగ్రరూపం దాల్చాడు. కేవలం 30 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసి చరిత్ర సృష్టించాడు. టెస్ట్ క్రికెట్ ఆడే దేశాల్లో ఇదే ఫాస్టెస్ట్ సెంచరీ. 16 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసిన అభిషేక్.. ఆతర్వాత 50 పరుగులు పూర్తి చేసేందుకు మరో 14 బంతులు మాత్రమే తీసుకున్నాడు. అభిషేక్ ఆ బౌలర్ ఈ బౌలర్ అన్న తేడా లేకుండా ఆఫ్ఘన్ బౌలింగ్ మొత్తాన్ని ఊచకోత కోశాడు.
సెంచరీ తర్వాత కూడా అభిషేక్ తన జోరును కొనసాగిస్తున్నాడు. ఇప్పటివరకు 33 బంతులు ఎదుర్కొన్న అతడు, 11 సిక్సర్లు, 9 ఫోర్ల సాయంతో 108 పరుగులతో ఇన్నింగ్స్ను కొనసాగిస్తున్నాడు. మరో ఎండ్లో సంజూ శాంసన్ కూడా ధాటిగానే ఆడుతున్నాడు. సంజూ 25 బంతుల్లో 3 సిక్సర్లు, బౌండరీ సాయంతో 34 పరుగులతో అజేయంగా ఉన్నాడు. 9.4 ఓవర్ల తర్వాత భారత్ స్కోర్ 142-0గా ఉంది.
భారత్ తరఫున ఫాస్టెస్ట్ సెంచరీ
టీ20ల్లో భారత్ తరఫున ఇదే ఫాస్టెస్ట్ సెంచరీ. ఈ మ్యాచ్కు ముందు ఈ రికార్డు రోహిత్ శర్మ పేరిట ఉండేది. రోహిత్ 2017లో శ్రీలంకపై 35 బంతుల్లోనే శతక్కొట్టాడు. తాజాగా ఈ రికార్డును అభిషేక్ బద్దలు కొట్టాడు.
ఓవరాల్గా చూస్తే.. అంతర్జాతీయ టీ20 క్రికెట్ చరిత్రలో ఇది మూడో వేగవంతమైన సెంచరీ. ఎస్టోనియాకు చెందిన సాహిల్ చౌహాన్ 27 బంతుల్లో, టర్కీకి చెందిన ముహమ్మద్ ఫాహద్ 29 బంతుల్లో సెంచరీలు చేసి, అభిషేక్ కంటే ముందున్నారు. టెస్ట్ ప్లేయింగ్ దేశాల్లో మాత్రం అభిషేక్దే ఫాస్టెస్ట్ టీ20 సెంచరీ.
ఇదీ చదవండి: ఆఫ్ఘన్తో మూడో టీ20.. టీమిండియాలో ఓ మార్పు


