భారతీయ ఆధ్యాత్మిక సంప్రదాయంలో శ్రీ గణేశునికి విశిష్టమైన స్థానం ఉంది. శ్రీ గణేశుడు విఘ్నేశ్వరుడు. విఘ్నాలను తొలగించే దేవతగా ఆయనను ఆరాధిస్తాం. అయితే ఆధ్యాత్మికంగా చూస్తే మన జీవితంలోని అసలైన విఘ్నాలు బయట ఉండేవి కావు. మనలోని అహంకారం, జడత్వం, భయం, అజ్ఞానం, అస్థిరతలే మన ఎదుగుదలకు ప్రధాన అవరోధాలు. వీటిని అధిగమించడానికి కావలసిన వివేకాన్ని ప్రసాదించే శక్తే శ్రీ గణేశ తత్వం.
ప్రకృతి వెనుక ఉన్న దైవశక్తి, మన చుట్టూ కనిపించే ప్రకృతి, జీవం, విశ్వం– ఇవన్నీ ఒక అద్భుతమైన దైవిక వ్యవస్థలో భాగాలు. భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం అనే పంచతత్వాల సమన్వయంతో జీవ సృష్టి కొనసాగుతోంది. శ్రీ మాతాజీ నిర్మలా దేవి తమ ఆధ్యాత్మిక సందేశంలో శ్రీ గణేశ తత్వాన్ని ప్రకృతి, సృష్టి, జీవశక్తితో అనుసంధానిస్తూ వివరిస్తారు. ప్రకృతిలోని పంచతత్వాలను కదిలించి జీవసృష్టికి మార్గం సుగమం చేసే దైవశక్తిగా శ్రీ గణేశుని తత్వాన్ని ఆమె వివరిస్తారు.
కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్ వంటి మూలకాలు జీవరాశుల నిర్మాణంలో కీలకపాత్ర పోషిస్తాయి. ఆధ్యాత్మిక దృష్టిలో వీటిని వివిధ దైవశక్తులకు ప్రతీకలుగా భావించి, సష్టి వెనుక పనిచేసే చైతన్యాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయవచ్చు. విజ్ఞానం ప్రకృతి ఎలా పనిచేస్తుందో వివరిస్తే, ఆధ్యాత్మికత ఆ ప్రక్రియ వెనుక ఉన్న చైతన్యాన్ని అనుభూతి చేయడానికి మనిషిని అంతర్ముఖుడిని చేస్తుంది. ఈ సమస్త ప్రక్రియల మధ్యలో ఉన్న సమన్వయ శక్తినే శ్రీ గణేశ తత్వంగా చూడవచ్చు. అనంత చతుర్దశికి ఒక విశేషం వుంది. ఆ రోజు నాడే శ్రీ వినాయకుడిని నీళ్ళలో నిమజ్జనం చేస్తాం.
ఆయనను ప్రతిష్టించి పది రోజులు పూజలు జరుపుకున్న తరువాత మట్టితో చేసిన ఆయన ప్రతిమను నదిలో గానీ, సముద్రంలో గానీ కలపడానికి కారణం అలా పూజలందుకున్న వినాయకునికున్న శక్తులు ఆ నీటి ప్రవాహం ద్వారా సర్వత్రా వ్యాపిస్తాయని, ఆ విధంగా శ్రీ గణేశుని శక్తులు, తత్వం అయిన పవిత్రత, వివేకం, విచక్షణ, తల్లిపట్ల సమర్పణ భావం ఆ అనంతమైన నీటిలో స్థిరపడి ప్రవహిస్తూ సముద్రంలోకి చేరుకుంటాయి.
అనంత అంటేనే శ్రీ వినాయకుడు. అనంత అంటే నాశనం లేనివాడు. అనంతంగా వ్యాపించి ఉన్న గణేశశక్తి. అంతటి మహత్తు, మహిమాన్వితుడిని గంగానదిలో గానీ, సముద్రంలో కలపడానికి గానీ తీసుకెళుతున్నప్పుడు ఎంతో భక్తి శ్రద్ధలతో, మేళతాళాలతో, మంగళ ప్రదమైన గణేశ్ కీర్తనలతో ఆయనను సాగనంపాలి.
ఆయన జన్మించిన నాల్గవ రోజు అంటే చవితి నాడు ఆయనను ప్రతిష్టించి, ఆ తరువాత పదవ రోజున, అంటే అనంత చతుర్దశి నాడు సముద్రంలో నిమజ్జనం చేయడానికున్న ప్రాముఖ్యత అటువంటిది. మట్టినుండి ఉద్భవించిన గణేశుడు నీటిలోకి చేరి తద్వారా మానవాళికి, జంతువులకు, ప్రకృతికి తన శక్తులను, తత్వాన్ని ప్రసాదిస్తాడు. అందుచేత గణేశ నవరాత్రి ఉత్సవాలను ఎంత ఉత్సాహంగా జరుపుకుంటామో, నిమజ్జనం కార్యక్రమాన్ని కూడా అంతే గౌరవిస్తూ అత్యంత భక్తి శ్రద్ధలతో ఒక పుణ్యకార్యంగా జరుపుకోవాలి.
– డా. ప్రతాని రాకేశ్
(పరమ పూజ్య శ్రీ మాతాజీ నిర్మలా దేవి ప్రవచనాలు ఆధారంగా)
శ్రీ మాతాజీ నిర్మలాదేవి
ఇదీ చదవండి: జింకపిల్లకు పులిపాలు!


