జింకపిల్లకు పులిపాలు! | Thiruparankundram Temple’s Hidden Marvel, The Rare Shiva Sculpture Of A Deer And Tiger In Tamil Nadu | Sakshi
Sakshi News home page

జింకపిల్లకు పులిపాలు!

Sep 17 2026 9:19 AM | Updated on Sep 17 2026 10:17 AM

Thiruparankundram Murugan Temple are architectural marvels

తమిళనాడులోని మదురైకి సమీపంలో ఉన్న తిరుప్పరంకుండ్రం మురుగన్‌ ఆలయం స్తంభంపై చెక్కబడిన అరుదైన శిల్పం ఒకటి భక్తులను విశేషంగా ఆకర్షిస్తుంది. ఈ ఆలయం మురుగేశుని ఆరు పడై వీడులలో మొదటిదిగా పేరుగాంచింది. మదురై నగర కేంద్రానికి సుమారు ఏడు కిలోమీటర్ల దూరంలో ఉన్న కందమలై అనే పవిత్ర కొండపై ఈ ఆలయం రూపుదిద్దుకుంది. ఆరవ శతాబ్దంలో పాండ్యుల కాలంలో రాతిని తొలచి నిర్మించిన ఈ ఆలయాన్ని ఆ తర్వాత నాయక రాజులు పదహారవ శతాబ్దంలో విస్తరించారు. 

శివుడు, విష్ణువు విగ్రహాలు ఒకదానికొకటి ఎదురెదురుగా ఉండటం ఈ ఆలయంలోని ఒక ప్రత్యేకమైన లక్షణం. ఆ శిల్పంలో పరమశివుడు ఒక జింక పిల్లను ఒడిలో పట్టుకుని రక్షిస్తున్నట్లుగా పక్కనే నోరు తెరిచిన పులి ఆకృతి కనిపిస్తుంది. ఈ చిత్రంలో పాలు తాగుతున్న జింకను చూడవచ్చు. ఈ శిల్పానికి ఉన్న పురాణ నేపథ్యం తమిళ శైవ భక్తి గ్రంథాలలో ముఖ్యంగా తిరువిళైయాడల్‌ పురాణం శివుని అరవై నాలుగు లీలలలో కనిపిస్తుంది.  

కథ ఏమిటంటే ఒకప్పుడు అడవిలో ఒక తల్లి లేడి తన చిన్న కూనను ఒక పొదలో సురక్షితంగా దాచి నీరు తాగడానికి వెళ్తుంది. ఆ సమయంలో ఒక వేటగాడు ఆ తల్లి లేడిని వేటాడి చంపేస్తాడు. దీంతో ఆ లేడి కూన అనాథగా మిగిలి ఆకలితో అలమటిస్తుంది. ఆ దీనస్థితిని చూసిన కరుణామయుడైన శివుడు మదురైలో ఆలవాయ్‌ అళగన్‌గా పిలువబడే సోమసుందరేశ్వరుడు ఆ పిల్లను రక్షించడానికి ఒక అద్భుత లీల చేస్తాడు. అడవిలోని ఒక ఆడపులిని పిలిపించి దానిలో మాతృత్వాన్ని ప్రేరేపించి ఆ పులి ద్వారానే ఆ జింక పిల్లకు పాలు తాగించి కాపాడతాడు. 

సహజ శత్రువులైన పులి, జింకల మధ్య కూడా శివకరుణతో వాత్సల్యం ఏర్పడుతుందని ఈ లీల చెబుతుంది. ఈ అపార కరుణా ఘట్టాన్నే తిరుప్పరంకుండ్రం ఆలయ శిల్పులు రాతిలో అద్భుతం గా మలిచారు. శివుని చేతిలో లేడి పిల్ల... దానికి పాలివ్వడానికి సిద్ధంగా ఉన్న పులి– ఇది శివుడు కేవలం సంహారకారుడు మాత్రమే కాదు సకల ప్రాణులను సమానంగా కాపాడే ప్రాణదాత, కరుణామూర్తి అని చెప్పే ప్రతీక. 

ఆలయంలోని ఆస్థాన మండపం, కంబతాడి మండపంలో ఇలాంటి అనేక అరుదైన శిల్పాలు కనిపిస్తాయి. అదే రాతి కొండపైనే మహిషాసుర మర్దిని కర్పగ వినాయకర్‌ తదితర దేవతా మూర్తులు కూడా చెక్కబడి ఉన్నాయి. ప్రధాన ఆలయ గోడలపై శివుని వివిధ నృత్య భంగిమలను చూపే ఫలకాలు కూడా భక్తులను ఆకట్టుకుంటాయి.
– జి.బి. విశ్వనాథ, రిటైర్డ్‌ డిప్యూటీ కలెక్టర్‌

ఇదీ చదవండి: గణేశ్‌ చతుర్థి వేడుకల్లో ముగ్ధ మనోహరంగా సారా టెండూల్కర్‌.. అంత ఖరీదా ఆ చీర!)

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement