ఏదైనా జాబ్కి అప్లై చేయాలన్న, ఏదైనా కాంపిటీటివ్ ఎగ్జామ్ రాయాలన్న కుల ధృవీకరణ పత్రం మస్ట్. కనీసం పెళ్లికైనా అది ఉండాల్సింది. కులం, మత ధృవీకరణ పత్రం ఉన్నట్లే..అవేమి లేకుండా నాస్తికుల్లా ఉండేవాళ్లకి కుల, మత రహిత అధికారిక ధృవీకరణ పత్రం ఉండదు. ఇంత వరకు అలాంటి పత్రాలు ఏ ప్రభుత్వ ఆఫీసులు జారీ చేయలేదు, ఉండవు కూడా. దాన్ని ఒక మహిళ కష్టపడి పోరాడి, తన గోడు వినిపించి మరి మొట్టమొదటిసారిగా కుల మత రహిత ధృవీకరణ పత్రాన్ని అధికారికంగా పొందింది. కేవలం ఆమె ఎలా జీవించిందో దానికి అనుగుణంగా డాక్యుమెంట్ మాత్రమే కావాలని కోరి మరి సాధించుకుంది. ఈ ఘనత సాధించిన తొలి భారతీయ మహిళగా నిలించింది ఆమె.
ఆ మహిళే తమిళనాడుకు చెందిన ఎం.ఏ స్నేహ. స్నేహకు చిన్నప్పటి నుంచి రెండే రెండు సమాధానాలు ఎదురయ్యేవి. అవేంటంటే..తన కులం, మతం గురించి. తన పేరెంట్స్ ఆ గుర్తింపు ఇవ్వలేదు. ఆమె జనన ధృవీకరణ పత్రంలో గానీ, పాఠశాల రికార్డులలో గానీ వాటి ప్రస్తావన లేనేలేదు. ఆమె చిన్నప్పటి నుంచి అలానే పెరిగింది. ఆమె ప్రస్తుతం తమిళనాడులోని తిరుపత్తూరులో న్యాయవాదిగా పనిచేస్తోంది. అయితే ప్రభుత్వపరమైన పత్రాల వ్యవహారాలు వచ్చినప్పుడూ ఆ వివరాలేమి నింపకుండా ఖాళీగా వదిలేయాల్సి వచ్చేది.
కానీ అలా ఫిల్ చేయకుండా వదలడంతో అప్లికేషన్ సబ్మిట్ చేయడం కుదిరేది కాదు. అప్పుడే తను ఎలా జీవించిందో అలా అధికారికంగా ధృవీకరించే పత్రం తప్పనిరి అయ్యింది. తనకు కులంగానీ, మతం గానీ లేదు అని చెప్పేలా అధికారికి పత్రం కావాలంటూ అధికారులు చుట్టూ తిరిగింది. అలా తొమ్మిదేళ్లు పోరాడి ఫిబ్రవరి 5, 2019న, తిరుపత్తూరు తహసీల్దార్ టి.ఎస్. సత్యమూర్తి, స్నేహకు కులం మతలం లేవని పేర్కొంటూ ఒక ధృవీకరణ పత్రాన్ని జారీ చేశారు. దాంతో అలాంటి గుర్తింపు పొందిన తొలి భారతీయ మహిళగా నిలిచింది స్నేహ.
ఆమె నేపథ్యం..
ఆమె తల్లిదండ్రులు పివి ఆనందకృష్ణన్, మణిమొళి న్యాయవాదులు. వారి ఇంటికి కమ్యూనిస్ట్ మిత్రులు తరుచుగా వచ్చేవారు. అలా స్నేహ, ఆమె సోదరీమణులు పెరిగే క్రమంలో కమ్యూనిజం, హేతువాదం, నాస్తికత్వానికి సంబంధించిన పుస్తకాలను చదివారు. మతం, దేవుడిని గుడ్డిగా నమ్మకుండా ప్రశ్నించడం పిల్లలకు నేర్పించారు. అందువల్ల వాళ్ల స్నేహితులు మీది ఏ కులం అని ప్రశ్నించినప్పుడూ స్నేహ, ఆమె సోదరిమణులు కులం లేదు, మతం లేదు అని నిర్మోహమాటంగా చెప్పేసేవారు.
ఆఖరికి వాళ్ల పేర్లతో తమ జీవన విధానం ఏంటో చూపించేవారు. ఇక్కడ స్నేహ ఇద్దరు సోదరిమణులు పేర్లు ముంతాజ్ సూర్య, జెన్నిఫర్ కాగా, స్నేహ ఆమె భర్త తమిళ ప్రొఫెసర్ కె పార్థిబరాజ దంపతులుకు ముగ్గురు కుమార్తెలు. వాళ్ల పేర్లు విభిన్న మత సంప్రదాయాలు కలిసేలా.. ఆదిరై నస్రీన్, ఆదిల ఐరీన్, ఆరిఫా జెస్సీ అని పెట్టారు. అయితే ఆమెకు న్యాయ పరీక్షల పోటీకి, నోటరీ వంటి వాటిల్లో కుల దృవీకరణ పత్రం ఓ పెద్ద సమస్యగా మారడంతో..అందుకోసం కులంగానీ, మతం గానీ లేని పత్రం కావాలన్నా ఆలోచన మొదలైంది దాని కోసం 2010లో పొందే ప్రయత్నంలో భాగంగా పోరాటం చేసింది.

అలా 2019 వరకు పోరాడి ఆ గుర్తింపుని దక్కించుకునేలా కుల మత రహిత ధృవీకరణ పత్రం పొందింది. ఇక్కడ స్నేహ తనను నాస్తికురాలిగా ప్రకటించమని ప్రభుత్వాన్ని కోరలేదు, అలాగే ప్రత్యేక ప్రయోజనాన్ని కూడా అడగలేదు. తాను గడుపుతున్న జీవితమే అధికారక రికార్డులకు సరిపోలాలని ఆమె కోరుకుంది. ఇక స్నేహ కుటుంబం తరతరాలు ఎలాంటి కుల, మత గుర్తింపు లేకుండా జీవించినట్లు తెలిపింది.
ఇక ఈ సర్టిఫికెట్ ఆ వాస్తవాన్నే ధృవీకరించే ఒక చట్టపరమైన పత్రమని చెబుతోంది స్నేహ. ఇక ఆమె భర్త పార్థిబరాజు స్వయంగా మతపరమైన కుటుంబంలో పెరిగాడు, కానీ ఆ తర్వాత పెరియార్ బి. ఆర్ అంబేద్కర్ తత్వశాస్త్రలపై ఆసక్తిని పెంచుకుని నాస్తికుడిగా మారారు.
మరో విచిత్రం ఏంటంటే..
ఆమెకు ఈ సర్టిఫికేట్ ఒకటి వచ్చిందని బహిర్గతం కావడంతో..ఆ పత్రం ఎలా పొందాలో తెలుసుకోవడానికి ఆమెను సంప్రదించారు. ఆ విషయమై ఫోన్ కాల్స్ వెల్లువెత్తాయని చెబుతోంది స్నేహ. ఇక తన నిర్ణయం రిజర్వేషన్కు వ్యతిరేకం కాదని, వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్కు మద్దతు ఇస్తానని అంటోంది. అలాగే ఇతర హక్కులను హరించడం కాదని కూడా నొక్కి చెప్పిందామె.
(చదవండి: మిస్ టీన్ యూఎస్ఏ కిరీటాన్ని గెలుచుకున్న కిరణ్ రెడ్డి)


