గోపాలకాలా
కావలసినవి: అటుకులు: కప్పు, పెరుగు: అర కప్పు, తాజా వెన్న: 2 టేబుల్ స్పూన్లు, దోసకాయ ముక్కలు: 1/4 కప్పు, దానిమ్మ గింజలు: 1/4 కప్పు, పచ్చిమిర్చి: 2 (సన్నగా తరిగినవి), అల్లం తురుము: 1/2 టీస్పూన్, కొత్తిమీర: కొద్దిగా, బెల్లం: అర టీస్పూన్, ఉప్పు: రుచికి సరిపడా, తాళింపు కోసం– నెయ్యి: టీస్పూన్, జీలకర్ర: 1/2 టీస్పూన్, ఇంగువ: చిటికెడు.
తయారీ: అటుకులను శుభ్రంగా కడిగి.. నీళ్లు పోయేలా పక్కన పెట్టుకోవాలి. ఒక పెద్ద గిన్నెలో మెత్తబడిన అటుకులు, పెరుగు, వెన్న, దోసకాయ ముక్కలు, దానిమ్మ గింజలు, అల్లం తురుము, పచ్చిమిర్చి ముక్కలు, బెల్లం, రుచికి సరిపడా ఉప్పు వేయండి. చిన్న పాన్లో నెయ్యి వేడి చేసి, జీలకర్ర వేసి వేయించండి. జీలకర్ర చిటపటలాడాక చిటికెడు ఇంగువ వేసి స్టవ్ ఆపేయండి. ఈ తాళింపును అటుకుల మిశ్రమంలో పోసి, కొత్తిమీర చల్లి మెల్లగా బాగా కలపండి.
ధనియా పంజీరి
కావలసినవి: ధనియాల పొడి: కప్పు, నెయ్యి: 4 టేబుల్ స్పూన్లు, బెల్లం పొడి: అర కప్పు, మఖానా: అర కప్పు, జీడిపప్పు, బాదం: 3 టేబుల్ స్పూన్లు, ఎండు కొబ్బరి తురుము: 2 టేబుల్ స్పూన్లు, గుమ్మడి లేదా పుచ్చగింజలు: టేబుల్ స్పూన్, ఏలకుల పొడి: అర టీస్పూన్.
తయారీ: మఖానాను ఒక టేబుల్ స్పూన్ నెయ్యిలో వేయించి, చల్లారాక కచ్చాపచ్చాగా పొడి చేసుకోవాలి. అదే కడాయిలో ఇంకో అర చెంచా నెయ్యి వేసి జీడిపప్పు, బాదం, ఎండు కొబ్బరి తురుము వేసి దోరగా వేయించి వేరే ప్లేట్లోకి తీసుకోండి. మిగిలిన నెయ్యి వేసి, ధనియాల పొడిని సన్నని మంటపై సువాసన వచ్చే వరకు వేయించండి. తరువాత చల్లారిన ధనియాల పొడిలో చక్కెర పొడి, ఏలకుల పొడి, మఖానా పొడి, డ్రై ఫ్రూట్స్ వేసి బాగా కలపండి. అంతే ధనియా పంజీరి రెడీ!
సింధీ స్వీట్ రైస్
కావలసినవి: బాస్మతీ బియ్యం: కప్పు, తురిమిన బెల్లం: 3/4 కప్పు, నెయ్యి: 3 టేబుల్ స్పూన్లు, సోంపు: టీస్పూన్, ఏలకులు: 4, లవంగాలు: 2, దాల్చిన చెక్క: చిన్నముక్క, జీడిపప్పు, బాదం, ఎండుద్రాక్ష: గుప్పెడు, కుంకుమపువ్వు: చిటికెడు, నీళ్ళు: 2 కప్పులు.
తయారీ: ఒక పాత్రలో నీటిని తీసుకుని బెల్లం వేసి చిన్నమంటపై కరిగించాలి. ఒక పాన్లో నెయ్యి తీసుకుని డ్రై ఫ్రూట్స్ని వేయించి పక్కన పెట్టుకోవాలి. అదే నెయ్యిలో మసాలా దినుసుల్ని కూడా వేసి అరనిమిషం వేయించాలి. ఇప్పుడు నానబెట్టిన బాస్మతీ బియ్యం వేసి, నెయ్యిలో జాగ్రత్తగా 2 నిమిషాలు వేయించండి. ఇందులోనే కుంకుమపువ్వు వేసి, ముందుగా సిద్ధం చేసుకున్న బెల్లం నీళ్ళు కూడా పోసి బాగా కలపండి. మూత పెట్టి మీడియం మంటపై 10–12 నిమిషాలు ఉడికించి స్టవ్ ఆఫ్ చేయండి. ఆవిరి పూర్తిగా పోయాక, వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ చల్లి మెల్లగా కలపండి. అంతే నోరూరించే సింధీ స్వీట్ రైస్ రెడీ


