సాక్షి, గజ్వేల్: అసెంబ్లీ సమరం మొదలుకాక ముందే బీఆర్ఎస్ బరిలోకి దిగింది.. కాంగ్రెస్ సర్కార్ను టార్గెట్ చేసేందుకు అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటోంది. ఎర్రవల్లిలోని కేసీఆర్ వ్యవసాయ క్షేత్రం వేదికగా బీఆర్ఎస్ కీలక సమావేశం జరగనుంది. గులాబీ నేత కేసీఆర్ అధ్యక్షతన జరిగే శాసనసభా పక్ష భేటీలో.. సెప్టెంబర్ 7 నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేయనున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అసెంబ్లీ వేదికగా ఇరుకున పెట్టేందుకు ‘అస్త్రాలు’ సిద్ధం చేసుకుంటున్న బీఆర్ఎస్.. రైతులు, యువత, విద్యార్థులు, మహిళల సమస్యలతో పాటు 22-ఏ భూములు, ప్రభుత్వ హామీలు, పెండింగ్ పథకాలను ప్రధాన అజెండాగా మార్చే అవకాశం ఉంది. మధ్యాహ్నం 1 గంటకు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కేసీఆర్ భోజనం చేయనున్నారు. అనంతరం.. మధ్యాహ్నం 2 గంటలకు శాసనసభా పక్ష సమావేశం ప్రారంభం కానుంది.
కాంగ్రెస్ ప్రభుత్వ 1000 రోజుల పాలనపై చర్చించడంతో పాటు, బీఆర్ఎస్ ఇప్పటికే విడుదల చేసిన ఛార్జ్షీట్పై సభ్యులకు కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నట్లు సమాచారం. కేసీఆర్ స్వయంగా అసెంబ్లీకి హాజరుకాకపోయినా.. ఫామ్హౌస్ నుంచే పార్టీ ఎమ్మెల్యేలకు వ్యూహాన్ని తెలపనున్నారు. సభలో కాంగ్రెస్ను నిలదీయాల్సిన అంశాలు.. ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే వ్యూహాలపై కేసీఆర్ కీలక సూచనలు చేయనున్న నేపథ్యంలో.. అసెంబ్లీ సమావేశాల్లో బీఆర్ఎస్ దూకుడు ఎలా ఉండబోతుందన్నది ఆసక్తికరంగా మారింది.
ఇదీ చదవండి: అసెంబ్లీలో ‘వెయ్యి రోజుల’ సమరం


