సాక్షి, బెంగళూరు: బెంగళూరులో లోన్ వడ్డీ చెల్లించలేదనే నెపంతో ఒక మహిళను వివస్త్రను చేసి, విచక్షణారహితంగా దాడి చేసిన కలకలం రేపింది. దీనికి తోడు బాధితురాలిపై దాడి చేసిన ఆ దృశ్యాలను నిందితులు వీడియో తీసి, సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తామని బెదిరింపులకు పాల్పడడం మరింత ఆందోళనరేపింది. ఈ ఘటనలో ఇద్దరు మహిళలు సహా నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు.
ఈ దారుణ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. బాధితురాలు రెండేళ్ల క్రితం రేష్మ వద్ద లక్ష రూపాయలు అప్పు తీసుకుంది. అయితే గత ఆరు నెలలుగా వడ్డీ చెల్లించలేక పోయింది. రేష్మా ద్వారా పరిచయమైన నజ్రత్ వద్ద కూడా బాధితురాలు రూ. 50 వేలు రుణం తీసుకుని, వారానికి రూ. 5,000 చొప్పున చెల్లిస్తూ వచ్చింది. ఆర్థిక ఇబ్బందుల వల్ల గత నాలుగు వారాలుగా ఈ చెల్లింపులు కూడా నిలిచిపోయాయి అయితే డబ్బులకోసం వేధిస్తారనే భయంతో బాధితురాలు రేష్మా ఫోన్ నంబర్ను బ్లాక్ చేసి, వేరే ప్రాంతానికి మకాం మార్చింది.
దాడి జరిగిన తీరు
దీనితో నజ్రత్, రేష్మా, సుహైల్, సైఫ్గా కలిసి ఒక పన్నాగం పన్నారు. దీని ప్రకారం నజ్రత్ బాధితురాలికి ఫోన్ చేసి, పని ఇప్పిస్తానని, డబ్బులు ఇస్తానని నమ్మించి తన ఇంటికి పిలిపించింది. బాధితురాలు నజ్రత్ ఇంటికి వెళ్లగానే సుహైల్ ఆమెపై బూతులతో నానా దుర్భాషలాడుతూ దాడి చేశాడు. అనంతరం బాధితురాలిని బలవంతంగా ఆటోరిక్షాలోకి ఎక్కించారు. ఆమె పక్కన రేష్మా, నజ్రత్ కూర్చోగా, సుహైల్ మరికొందరితో కలిసి ఫాలో అయ్యారు. బెంగళూరు శివార్లలోని కుంబళగోడు సమీపంలోని ఒక ఇంటికి తీసుకువెళ్లి బాధితురాలిని బంధించారు. అక్కడ ఆమెను వివస్త్రను చేసి దారుణంగా కొట్టారు.
ఇదీ చదవండి: వామ్మో, టూటీ ఫ్రూటీ ఇలా తయారుచేస్తారా? వైరల్ వీడియో
మరోవైపు కుమార్తె కనిపించడం లేదంటూ రేష్మ తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై ఆరాగా తీయగా ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాధితురాలిని సురక్షితంగా రక్షించి, నలుగురు నిందితులు నజ్రత్, రేష్మ, సుహైల్, సైఫ్లను అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ కేసుపై తదుపరి విచారణ కొనసాగుతోంది.


