సాక్షి, చెన్నై : తమిళనాడులోని సేలం, నామక్కల్, ధర్మపురి, కృష్ణగిరి జిల్లాల్లో క్వారీల విస్తరణ, కాలుష్య నియంత్రణ మండలి అనుమతుల పేరుతో రూ.కోట్ల అవినీతికి పాల్పడిన బ్రోకర్ శివకుమార్, ప్రభుత్వ ఇంజినీర్ పురుషోత్తమన్ బండారాన్ని అవినీతి నిరోధక శాఖ అధికారులు బయటపెట్టారు. రెడ్ హ్యాండెడ్గా పట్టుబడిన వీరి ఇళ్లలో జరిపిన సోదాల్లో రూ. 10.5 కోట్ల విలువైన బంగారం, నగదును స్వాధీనం చేసుకున్నారు.
రూ. 3 లక్షలు డిమాండ్
పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ నుంచి అనుమతి పత్రాల కోసం బ్రోకర్ శివకుమార్ (58) ద్వారా కృష్ణగిరి జిల్లా ఇంజినీర్ పురుషోత్తమన్ రూ. 3 లక్షలను లంచంగా ప్రతాప్ అనే బాధితుడిని డిమాండ్ చేశాడు. ఈ మేరకు ప్రతాప్ ఇచ్చి ఫిర్యాదు ఆధారంగా అవినీతి నిరోధక శాఖ అధికారులు పథకం ప్రకారం ఆ ఇద్దరినీ రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఈ వ్యవహారంలో బ్రోకర్ శివకుమార్, జిల్లా ఇంజినీర్ పురుషోత్తమన్తో పాటుగా మరో మధ్యవర్తి మురుగేషన్ను అరెస్ట్ చేసి సేలం సెంట్రల్ జైలుకు తరలించారు. వీరి ఇళ్లలో గురు, శుక్రవారాలలో సాగిన సోదాలలో భారీగా నగదు బయట పడింది.
సేలంలోలోని శివకుమార్ ఇంటిలో జరిపిన సోదాల్లో 4 కిలోల బంగారు కడ్డీలు, భారీగా బంగారు ఆభరణాలు, లెక్కల్లో లేని రూ.కోట్లనగదు లభించింది. మొత్తం ఆస్తుల విలువ రూ. 10.5 కోట్లకు పైగా ఉన్నట్లు అధికారులు నిర్ధారించారు. గత పదేళ్లుగా నాలుగు జిల్లాల్లోని క్వారీలకు, డైయింగ్ ఫ్యాక్టరీలకు అక్రమంగా అనుమతులు ఇప్పిస్తూ బ్రోకర్ శివకుమార్ భారీగా ఆస్తులు కూడబెట్టినట్లు ఏసీబీ విచారణలో తేలింది. స్వా«దీనం చేసుకున్న 15కు పైగా ఆస్తి పత్రాలను కృష్ణగిరి జిల్లా అవినీతి నిరోధక విభాగం ఉన్నతాధికారులకు అప్పగించారు. దర్యాప్తును వేగవంతం చేశారు.


