సాక్షి, ముంబై: మహారాష్ట్రలోని ధారాశివ్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. జాతీయ స్థాయి మహిళా రెజ్లర్ అశ్విని మనోహర్ పాల్ (Ashwini Manohar Paul) ఆత్మహత్య ఉదంతం కలకలం రేపింది. నాల్దుర్గ్ చారిత్రక కోటలో 100 అడుగుల లోతైన లోయలోకి తన ముగ్గురు పిల్లలతో సహా దూకేసిన విషాద ఘటన క్రీడా లోకంలో తీవ్ర దిగ్భ్రాంతిని నింపింది.
ఈ ఘటనలో అశ్వినితో పాటు ముగ్గురు పిల్లలలో ఇద్దరు మరణించారని పోలీసులు తెలిపారు. ఒక కుమార్తె ప్రాణాలతో బయట పడింది. అశ్విని ఆమె ఐదున్నర ఏళ్ల కుమారుడు అజింక్య అక్కడికక్కడే మరణించారు. రెండేళ్లన్నర కవల కుమార్తెలలో ఒకరైన క్రాంతి, చికిత్స పొందుతూ మరణించింది. ఆమె మరో కుమార్తె వీర తీవ్ర గాయాలతో ప్రస్తుతం ధారాశివ్లోని ప్రభుత్వ ఆసుపత్రిలో వెంటిలేటర్ సపోర్ట్పై చికిత్స పొందుతోంది.
తన భర్త, అత్తమామల నుండి అశ్విని నిరంతరం మానసిక, శారీరక వేధింపులకు గురైందని ఆమె తండ్రి ఆరోపించారు. దీనిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నల్దుర్గ్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. తదుపరి దర్యాప్తు కొనసాగుతోంది.
ఇదీ చదవండి: దివ్యాంగ మహిళపై లైంగిక దాడి యత్నం.. తరిమి కొట్టిన వీధి కుక్కలు!
కాగా అశ్విని పాల్ రెజ్లింగ్ వర్గాల్లో సుపరిచితురాలు. ఆమెను "మహారాష్ట్ర టైగ్రెస్" (Maharashtra's Tigress) అని పిలిచేవారు. తన క్రీడా జీవితంలో ఆమె జాతీయ స్థాయిలో ఐదు స్వర్ణ , ఆరు రజత పతకాలను గెలుచుకున్నారు. ఈ ఘటన మహారాష్ట్ర వ్యాప్తంగా, క్రీడా వర్గాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది; ఈ క్రీడాకారిణి ,ఆమె పిల్లల మరణం పట్ల పలువురు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి: వామ్మో, టూటీ ఫ్రూటీ ఇలా తయారుచేస్తారా? వైరల్ వీడియో


