వరంగల్: ఒకరినొకరు ప్రేమించుకున్నారు..పెళ్లి చేసుకుందామని బాస చేసుకున్నారు. నమ్మబలికి గర్భవతిని చేశాడు. తీరా పెళ్లి చేసుకోవాలని ఆమె అడగడంతో నిరాకరించాడు. దీంతో మనస్తాపానికి గురైన యువతి ఫ్యాన్కు చీరతో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన విషాదకర సంఘటన మహబూబాబాద్ జిల్లా కురవి మండలం నల్లెల గ్రామంలో గురువారం చోటుచేసుకుంది. సీ రోలు ఎస్సై సంతోష్, మృతురాలి తండ్రి బండి మల్ల య్య కథనం ప్రకారం.. నల్లెల్ల గ్రామానికి చెందిన ఓ యువతి (24), మహబూబాబాద్ మండలం పర్వతగిరి గ్రామానికి చెందిన గుదె శ్రీకాంత్ నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్నారు.
పెళ్లి చేసుకుందామని శ్రీకాంత్ నమ్మబలికి ఆమెతో శారీరక సంబంధం పెట్టుకుని గర్భవతిని చేశాడు. దీంతో ఆ యువతి పెళ్లి చేసుకుందామని శ్రీకాంత్ను అడిగింది. పెళ్లి చేసుకోను, నీదిక్కున్న వారికి చెప్పుకో అని బెదిరించాడు. దీంతో బాధితురాలు వెంటనే తండ్రికి విషయాన్ని వివరించింది. గత నెల 30న మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఈ విషయంపై పెద్దమనుషుల సమక్షంలో పంచాయితీ జరిగింది. ఆ సమయంలో శ్రీకాంత్, అతడి తల్లిదండ్రులు వెంకన్న, సునీత, బంధువులు చెలమల సాయి, అన్నారం వాసు, కుమార్, మహేశ్ అందరూ కలిసి యువతిని నానా దుర్భాషలాడారు. ఎందుకు బతికున్నావు, చనిపో అని తిట్టినట్లు ఎస్సై పేర్కొన్నారు.
ఈనెల 2 (బుధవారం)న కూతురును తీసుకుని తండ్రి మల్లయ్య సీరోలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అనంతరం ఇంటికి వెళ్లే సమయంలో సీరోలు సెంటర్ వద్ద శ్రీకాంత్, అతడి తల్లిదండ్రులు వెంకన్న, సునీత, వారి బంధువులు చెలమల సాయి, అన్నారం వాసు, కుమార్, మహేశ్ అడ్డం తిరిగి మావోడి మీద కేసు పెట్టి ఏం చేస్తావు, డబ్బులు ఇస్తాం అని బెదిరించారు. అక్కడి నుంచి నల్లెల్ల గ్రామంలోని ఇంటికి యువతి, తండ్రి మల్లయ్య వచ్చారు.
అదేరోజు రాత్రి అందరు పడుకున్న తర్వాత యువతి వేరే గదిలో పడుకుంది. మనస్తాపానికి గురైన ఆమె చీరతో ఫ్యాన్కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. గురువారం ఉదయం లేచి చూడగా ఫ్యాన్కు ఉరివేసుకుని వేలాడుతూ చనిపోయి ఉందని తండ్రి మల్లయ్య తెలిపారు. తన కుమార్తె చావుకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని ఆయన ఎస్సై సంతోష్ను కోరారు. ఈ మేరకు శ్రీకాంత్ను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు, మిగిలిన వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. కాగా, మృతురాలికి గతంలో ఇద్దరితో వివాహం జరగగా విడాకులు అయ్యాయి.


