సాక్షి, హైదరాబాద్: తెలంగాణ మంత్రిమండలి మార్పులు, చేర్పులపై ఉత్కంఠ కొనసాగుతోంది. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మరోసారి ఢిల్లీకి వెళ్లి కాంగ్రెస్ అధిష్ఠానంతో చర్చించనున్నట్లు సమాచారం. దీంతో జరగబోయేది కేబినెట్ విస్తరణా? శాఖల మార్పులా? లేదంటే మొత్తం ప్రక్షాళనా? అనే ఉత్కంఠ మొదలైంది. ఏ క్షణం ఏం జరుగుతుందోననే టెన్షన్లో ఇటు మంత్రులు.. అటు ఆశావహులు కనిపిస్తున్నారు.
కొండా సురేఖ బర్తరఫ్ నేపథ్యంలో కాంగ్రెస్ రాజకీయం మరింత వేడెక్కింది. ఈ ఎపిసోడ్పై మూడ్ ఆఫ్ ఎమ్మెల్యేల నివేదికకు సీఎం రేవంత్ ఆదేశించారు. అలాగే ఆమెను తొలగించడంతో కేబినెట్లో ముగ్గురికి అవకాశం లభించనుంది. అయితే సురేఖ స్థానంలో మహిళకే చాన్స్ ఇవ్వాలని రేవంత్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే పలువురి పేర్లు తెర మీదకు వస్తున్నాయి. అయితే కేబినెట్లో ఖాళీగా ఉన్న స్థానాలను భర్తీ చేయడంతోపాటు.. కొందరు మంత్రుల శాఖలు మార్చే అవకాశం ఉందన్న ప్రచారం జోరందుకుంది.
మంత్రుల్లో మరికొందరిని తప్పించి కొత్తవారికి అవకాశం కల్పించే అంశంపైనా అధిష్ఠానం, సీఎం మధ్య చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే అధిష్ఠాన నేతలతో భేటీల సందర్భంగా ఆయా అంశాలపై ఆయన, సీనియర్ మంత్రులు చర్చించినట్లు సమాచారం. రెండ్రోజుల పాటు సొంతూరిలో పర్యటించనున్న సీఎం రేవంత్.. సీనియర్ మంత్రులతో మరోసారి ఢిల్లీకి వెళ్లనున్నారు. దీంతో ప్రస్తుత మంత్రుల్లో ఎవరికి పదవులు ఉంటాయో.. ఎవరికి శాఖలు మారతాయోనన్న టెన్షన్ నెలకొంది.
మరోవైపు మంత్రి పదవుల కోసం పలువురు ఆశావహ ఎమ్మెల్యేలు ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు సమాచారం. కొత్తగా ఎవరికి అవకాశం ఇవ్వాలి? సామాజిక, ప్రాంతీయ సమీకరణాలను ఎలా సర్దుబాటు చేయాలి? అనే అంశాలపైనా కసరత్తు జరుగుతున్నట్లు తెలుస్తోంది. దీంతో కేబినెట్ విస్తరణా.. పూర్తిస్థాయి ప్రక్షాళనా.. లేక రెండూ కలిపి చేస్తారా? అన్నదే ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్లో హాట్టాపిక్గా మారింది.
ఇదీ చదవండి: ఇప్పుడు కొండా సురేఖ.. అప్పుడేమో ఆయన!


