సాధువుగా మారి..54 ఏళ్ల వయసులో సీఆర్పీఎఫ్‌ పోలీస్‌గా! | Fired In 1999, CRPF Havildar Wins 27 Year Legal Battle And Returns To Duty At 54, Check More Details Inside | Sakshi
Sakshi News home page

సాధువుగా మారి..54 ఏళ్ల వయసులో సీఆర్పీఎఫ్‌ పోలీస్‌గా!

Sep 3 2026 3:51 PM | Updated on Sep 3 2026 4:12 PM

CRPF havildar who became sadhu after 27 year fight for justice

ఒక వ్యక్తి ఉద్యోగం అనూహ్యంగా కోల్పోయి..సుదీర్ఘకాలం న్యాయపోరాటం చేశాడు. చివరకు తన ఉద్యోగాన్నితిరిగి పొందడంలో ఎదురైన ఆటంకాలు అన్నీ ఇన్నీ కావు. ప్రతిదీ ఓ పరీక్ష, సవాలులా ఎదురయ్యాయి.  ఊరట లభించిందనేలోపు విధి ఆడిన వింత నాటకంలా మళ్లీ మళ్లీ ఆటంకాలు వస్తుండేవి. చివరికీ ఆయన ఏ వయసులో తన ఉద్యోగాన్ని తిరిగి పొందాడో తెలిస్తే విస్తుపోతారు. మరి అతడి ఆసక్తికర గాథ ఏంటో చకచక చదివేయండి మరి..

అతడే మధ్యప్రదేశ్‌లోని మొరేనా జిల్లా, చిచ్చావలి గ్రామానికి చెందిన 54 ఏళ్ల  గిర్వర్ సింగ్ తోమర్ ఆయన 1991 ప్రాంతంలో సీఆర్పీఎఫ్‌లో చేరారు. సమారు ఎనిమిదేళ్లపాటు సీఆర్పీఎఫ్‌ హవల్దారుగా సేవలందించారు. ఆ తర్వాత ఆయన ఉద్యోగ ప్రస్థానానికి ఆకస్మికంగా బ్రేక్‌ పడింది. ఒక అధికారితో ఏర్పడిన వివాదం శాఖపరమైన విచారణ అనంతరం ఉద్యోగ వేటుకి దారితీసింది. దాంతో 1999 అక్టోబర్‌ 21తో సీర్పీఎఫ్‌గా అతడి సేవలు ముగిశాయి. 

ఆ వివాధానికి ప్రధాన కారణం తన సైకిల్‌తో ఓ అధికారి వాహనాన్ని ఢీకొట్టానన్న అపవాదుతో విధుల నుంచి తొలగించారు అధికారులు. అయితే తోమర్‌ తాను అస్సలు ఢీ కొనలేదని నొక్కి చెబుతుంటారు. అంతేగాదు ఆయన ఆరోపణలను సవాలు చేస్తూ..కోర్టుని ఆశ్రయించడంతో పరిస్థితి మరింత జటిలమైపోయింది. ఆయన దాఖలుచేసిన శాఖపరమైన ఆపీలు తిరస్కరణకు గురవ్వడంతో హైకోర్టుని ఆశ్రయించాల్సి వచ్చింది. దీంతో రెండున్నర దశాబ్దాలకు పైగా న్యాయపోరాటం సాగింది. ఏప్రిల్‌ 10, 2007న కాస్తా పురోగతి లభించింది. 

అలహాబాద్ హైకోర్టు, తోమర్‌పై ఉన్న ఆరోపణలను అంగీకరించినప్పటికీ, ఉద్యోగం నుంచి తొలగింపు అనే శిక్ష అత్యంత కఠినమైనదని, ఆయనపై చేసిన ఆరోపణలకు తగిన పనిష్మెంట్‌ కాదంటూ కాస్త ఉపశనమం ఇచ్చింది. ఇక తన ఉద్యోగం తనకొచ్చేస్తుందన్న తరుణంలో ఈ తీర్పుని కేంద్రప్రభుత్వం, సంబంధిత సీఆర్పీఎఫ్‌ యూనియన్‌ ప్రత్యేక అప్పీలు ద్వారా సవాలు చేస్తూ పిటీషన్‌ దాఖలు చేసి స్టే విధించాయి. దాంతో ఆ తీర్పు ఏళ్ల తరబడి పెండింగ్‌లోనే ఉండిపోయింది. ఆ టైంలో ఆయన జీవితం అనూహ్య మలుపు తిరిగింది. 

సాధువుగా మారినా..ఆగని పోరాటం..
2001లో నిర్మోహి అఖారాలో చేరి, సాధు జీవితాన్ని స్వీకరించాడు. అలా ఆయన బాబా గిర్వర్ దాస్‌గా ప్రసిద్ధిగాంచాడు. ఆయన సాధువుగా తన సొంతూరులోని ఆలయంలోనే కొన్నాళ్లు గడిపాడు. ఆ తర్వాత మొరేనాలోని ఒక గుహలో గడపాడం ప్రారంభించాడు. అలా ఆయన దినచర్య ప్రార్థన, ఆలయ విధులకు అంకితమైంది. సాధువుగా మారినప్పటికీ తన పోరాటాన్ని ఆపలేదాయన. తన ఆధ్యాత్మిక బాధ్యతలు నిర్వర్తిస్తూనే కోర్టు విచారణలకు హాజరయ్యేవాడు. 

అలాగే తన కుటుంబంతో కూడా సత్సంబంధాలు కొనసాగించాడు. ఇక ఆయనకు భార్య మంజులా దేవి, నలుగురు పిల్లలు ఉన్నారు. కూతుళ్లు శివాని, రాధలకు వివాహం కాగా, కుమారుడు అభిషేక్‌ వైమానికదళంలో పనిచేస్తున్నాడు. మరో కుమారుడు పేరు కృష్ణ అని సమాచారం. ఎట్టకేలకు అతడి ప్రార్థనలను దేవుడు ఆలకించాడో ఏమో గానీ అలహాబాద్ హైకోర్టు డివిజన్ బెంచ్ సీఆర్పీఎఫ్‌ యూనియన్ పిటిషన్‌ను కొట్టివేసింది. ప్రభుత్వ అప్పీల్‌ను పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం, మూడు నెలల్లోగా తోమర్‌ను తిరిగి విధుల్లోకి తీసుకోవాల్సిందిగా గతేడాది ఆగస్టు నెలలో ఆదేశించింది. 

అయినప్పటికీ మళ్లీ ఏడాది వరకు ఆయన ఆగక తప్పలేదు. ఎందుకంటే ఏకంగా రెండు దశాబ్దాల నాటి ఆ కేసు రికార్డులను సేకరించడం ఆలస్యమై..హైకోర్టు తుది ఆదేశాల జారీ చేసేంత వరకు ఎదురు చూడక తప్పలేదు. చివరికి దాదాపు ఏడాది తర్వాత, ఆ సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది. ఈ ఏడాదే ఆగస్టున ఆయనను తిరిగి విధుల్లోకి తీసుకోమని ఉత్తర్వులు జారీ చేసింది. దీని ప్రకారం ఆయనను బీజాపూర్‌లోని 85వ బెటాలియన్‌లో తిరిగి నియమించారు. 

అంటే తోమర్ దాదాపు 27 ఏళ్లపాటు సుదీర్ఘ పోరాటం చేశారు. ప్రస్తుతం విధుల నిర్వర్తించడం అనేది అత్యంత విభిన్నంగా అనిపించినా..అతడి పునరాగమనం మాత్రం అపురూపం. అలాగే ఆయన హయాంలో పనిచేసిన ఒకరో ఇద్దరు తప్ప అందరూ కొత్తవాళ్లే సహోద్యోగులు. వాళ్లతో కలిసి ఆయన పనిచేయాల్సి ఉంది.  పైగా తోమర్‌ సరిగ్గా 54 ఏళ్ల వయసులో తన ఉద్యోగాన్ని తిరిగి పొందాడు. అంతేగాదు ఇతడి కేసు భారతదేశ సుదీర్ఘ సేవా సంబంధిత న్యాయ వివాదాల కేసులో అత్యంత ప్రత్యేకంగా నిలిచింది.

గెటప్‌​ ఛేంజ్‌..
కొత్త పోస్టింగ్‌ కోసం మొరైనా రైలు ఎక్కి బీజాపూర్‌ చేరుకున్నారు. సాధువుగా పెంచుకున్న పొడవాటి జుట్టు, తెల్లగడ్డాన్ని తొలగించుకుని..చక్కటి ఇస్త్రీ చేసిన సీర్పీఎప్‌ యూనిఫాం, టోపీ, మెరిసే బూట్లు ధరించి ఎంతో ఆనందంగా తన బలంగంలోకి తిరిగి చేరాడు తోమర్‌. అంతేగాదు ఈ విజయాన్ని దేవునికే క్రెడిట్‌ ఇచ్చేసి.. ఇదంతా దేవుని దయ అని నవ్వుతూ చెబుతున్నాడు తోమర్‌.

(చదవండి: అవకాడోకి పెరుగుతున్న క్రేజ్‌..ఆరోగ్యానికి మంచిదేనా? ప్రధాని మోదీ ఏమన్నారంటే..)
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement