అమెరికా రాష్ట్రాలు సంయుక్తంగా దాఖలు చేసిన దావాలో టెక్ దిగ్గజం ‘మెటా’ రాజీకి వచ్చి, 18 బిలియన్ డాలర్ల చెల్లింపుతో పాటు, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లలో బాలలకు రోజుకు కేవలం రెండు గంటల వినియోగ పరి మితి, రాత్రిపూట ఆటోమేటిక్ లాకౌట్, క్రోనలాజికల్ ఫీడ్, కఠిన వయో నిర్ధా రణ వ్యవస్థను అమలు చేయడానికి అంగీకరించింది.
స్నాప్చాట్, టిక్టాక్, యూట్యూబ్ కూడా ఇదే బాటలో నడవనున్నాయి. ఐరోపా సమాఖ్య సైతం తమ పిల్లల భద్రత కోసం ఇదే తరహా రక్షణ చర్యలు అమలు చేయాలని డిమాండ్ చేస్తోంది. భారత దేశం కూడా మేలుకోవాలి. ‘లోకల్ సర్కిల్స్’ సర్వే ప్రకారం, ఆన్ లైన్ లో తమ పిల్లలు అనుచితమైన కంటెంట్కు గురైనట్లు సగం మంది భారతీయ తల్లిదండ్రులు గుర్తించారు.
మన దేశంలో 2023 డేటా ప్రొటెక్షన్ చట్టం ‘తల్లిదండ్రుల సమ్మతి’పై ఆధారపడి ఉంది. ఆస్ట్రే లియా 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించగా, ఇండోనేషియా, బ్రెజిల్, టర్కీ, యూకే కఠిన నిబంధనలు తెచ్చాయి. దీనితో పాటు... అశ్లీలత, హింస, షార్ట్–వీడియోల వ్యసనం, గేమింగ్–బెట్టింగ్ యాప్స్ లాంటి పెద్ద ముప్పులను కూడా అడ్డుకోవాలి. టెక్సాస్, బ్రిటన్, ఫ్రాన్స్ తరహాలో బయోమెట్రిక్ లేదా ఐడీ ద్వారా వయసు నిర్ధారణను కఠినంగా అమలు చేయాలి.
పిల్లల మెదడులో డోపమైన్ను పెంచి బానిసలను చేస్తున్న షార్ట్–వీడియోల నిరంతర ఆటో ప్లే, స్క్రోలింగ్లను ఆపేయాలి. గేమింగ్ ముసుగులో ఉండే ‘లూట్ బాక్స్’లను జూదంగా పరిగణించి నియంత్రించాలి. చైనాలో మైనర్లకు ‘మైనర్ మోడ్’ తీసుకువచ్చారు. ఆర్థిక సర్వే 2025–26 సూచించినట్లుగా, స్కూళ్లలో బేసిక్ ఫోన్లను మాత్రమే అనుమతించాలి. ఈయూ తరహాలో ‘మా పిల్లలను కూడా రక్షించండి (ప్రొటెక్ట్ అవర్ కిడ్స్ టూ)’ అని భారతదేశం కూడా గట్టిగా అడగాలి.
అలాగే ఇటీవలి సంఘటనల్లో టీనేజీ పిల్లల బాధితులైన ‘ఒంటరి మహిళ బలహీన లక్ష్యం’ అనే మూస ధోరణిని తిప్పి కొట్టాలి. హ్యాండ్బ్యాగ్లో ‘పెప్పర్ స్ప్రే’ వంటి చట్టబద్ధ మైన సాధనం ఉంచు కోవాలి. దీనితో పాటు ‘హోమ్ ఎస్.ఓ.ఎస్. సైరన్’ వ్యవస్థను ప్రోత్సహించాలి. ప్యానిక్ బటన్ నొక్కగానే మోగే పెద్ద సైరన్ చుట్టు పక్కల వారిని అప్రమత్తం చేసి, ఇరుగుపొరుగు వారి మధ్య నమ్మకాన్ని పెంచుతుంది.
లాటిన్ అమెరికాలో వీధి మొత్తానికి ‘అలార్మా వెసినాల్’ సైరన్ ఏర్పాటు చేసి, ప్రతి ఇంటికీ ఒక రిమోట్ ఇస్తారు. బటన్ నొక్కితే చుట్టుపక్కల వారు వచ్చి సాయం చేస్తారు. దక్షిణాఫ్రికాలో నేరాలు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ప్రజలు ప్యానిక్ బటన్లు, ప్రత్యేకమైన విజిల్స్ వాడుతారు. అలాగే, యాప్లోని ‘షౌట్’ బటన్ ద్వారా లొకేషన్తో కూడిన సందేశం పోలీసులకు చేరవేసే ‘112 ఇండియా’ యాప్పై అవగాహన పెంచాలి.
– శ్రీనివాస మాధవ్, ఆర్టీఐ పరిశోధకులు


