సాక్షి, హైదరాబాద్: మంత్రి కొండా సురేఖ వ్యవహారంపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కొండా సురేఖ ఓఎస్డీ అరెస్టు ఘటన నుంచే అసలు కథ మొదలైందని ఆయన ఆరోపించారు. అప్పటి నుంచే మంత్రి పదవి నుంచి తొలగించే ప్రయత్నాలు జరిగాయని వ్యాఖ్యానించారు. తాజాగా డబ్బుల వాటాకు సంబంధించి కమ్యూనికేషన్ గ్యాప్ రావడంతోనే ఈ వ్యవహారం ఢిల్లీ వరకు వెళ్లిందని ఆయన విమర్శలు గుప్పించారు.
మంత్రి కొండా సురేఖ ఎపిసోడ్పై రాజాసింగ్ తాజాగా స్పందిస్తూ..‘కొండా సురేఖను సస్పెండ్ చేయాలని పెద్ద నేతలు ఢిల్లీలో కూర్చున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎక్కడ చూసినా అవినీతి జరుగుతోంది. మంత్రులు, పెద్ద నేతలు, చిన్న నేతలు, అధికారులనే తేడా లేకుండా అవినీతి నడుస్తోంది. రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక అవినీతి ఆగడం లేదు. గతంలో కేసీఆర్ అప్పులు చేసి పాలించి ఫాంహౌస్లో కూర్చున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ అబద్ధపు హామీలు చెప్పి అధికారంలోకి వచ్చింది. కేవలం పేపర్లో మాత్రమే నిధులు ఇస్తున్నట్టు చెప్తారు. కానీ క్షేత్ర స్థాయిలో మాత్రం జీరో.
దీంతో మంత్రులకు, నేతలకు అర్థమైంది.
కాంగ్రెస్ గవర్నమెంట్ ఎప్పుడూ పడిపోతుందో చెప్పలేమనే అనుమానం వారికి వచ్చేసింది. అసలు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందో.. పోతుందో.. అని డిసైడ్ అయ్యారు. ఎక్కడ పడితే అక్కడ దోచుకోవడం షురూ చేశారు. ఏదీ ఎక్కడ దొరికితే అక్కడ దోచేస్తున్నారు. ఇదంతా డబ్బుల వ్యవహారం అయింది. ఇదంతా ఢిల్లీకి చేరింది. ఆ డబ్బుల గొడవే కొండా సురేఖ రాజీనామా వరకు వచ్చింది. ఇప్పుడు కొండా సురేఖ ప్రెస్ మీట్లో ఏం చెబుతారో చూడాలి. బర్తరఫ్ చేస్తామని అధిష్టానం చెప్పిందట.. దీనిపై ఆమె ఏం అంటారో తెలుస్తుంది’ అంటూ వ్యాఖ్యలు చేశారు.
ఇదీ చదవండి: కాంగ్రెస్లో కొండా సురేఖ.. అడుగడుగునా వివాదాలే!


