న్యూఢిల్లీ: కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్పై తాను వెనక్కి తగ్గడానికి గల కారణాలను సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్చుక్ వెల్లడించారు. ప్రభుత్వంతో జరిగిన చర్చల సమయంలో నిరసన తెలిపిన విద్యార్థులపై ఎలాంటి న్యాయపరమైన వేధింపులు ఉండకూడదనే షరతుకే తాను అత్యధిక ప్రాధాన్యం ఇచ్చానని, అదే తన రాజీలేని నిబంధన అని ఆయన స్పష్టం చేశారు.
పీజీఎక్స్ పాడ్కాస్ట్లో ప్రఖర్ గుప్తాతో మాట్లాడిన వాంగ్చుక్.. జులై 22 నాటికి నిరసనలు ఇతర నగరాలకు విస్తరించి హింస చెలరేగే అవకాశం ఉందని ఆందోళన చెందినట్లు తెలిపారు. దీంతో మంత్రి రాజీనామా కంటే విద్యార్థుల భద్రతే ముఖ్యమని భావించినట్లు చెప్పారు. 2025 సెప్టెంబరులో లడఖ్ హింసాత్మక ఘటనల అనంతరం దాదాపు 80కి పైగా కేసులు నమోదై, హింసను అడ్డుకోవడానికి ప్రయత్నించిన వారే జైలుపాలైన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. ఢిల్లీలో కూడా అటువంటి పరిస్థితి పునరావృతం కాకూడదనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు.
విద్యార్థులపై కేసులు నమోదు చేయబోమని ప్రభుత్వం మొదట మౌఖిక హామీ ఇవ్వజూపగా, తాను దానిని తిరస్కరించి లిఖితపూర్వక హామీని డిమాండ్ చేశానని వాంగ్చుక్ పేర్కొన్నారు. జులై 23 రాత్రి 11:30 గంటల ప్రాంతంలో ప్రభుత్వం లిఖితపూర్వక హామీ ఇచ్చేందుకు అంగీకరించిందని తెలిపారు. అంతకుముందు జులై 21 రాత్రి కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్ ఆసుపత్రిలో తనను కలిసి నిరాహార దీక్ష విరమించాలని కోరారని చెప్పారు. వాంగ్చుక్ దీక్ష విరమించినప్పటికీ, కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) నేతలు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్తో ఆందోళనను కొనసాగించారు. దీనిపై స్పందించిన వాంగ్చుక్, బాధ్యతారాహిత్యానికి జవాబుదారీతనంగా రాజీనామా డిమాండ్ చేయడాన్ని తాను సమర్థిస్తున్నానని పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: యుద్ధాల నడుమ 7.8 శాతం జీడీపీ: ప్రధాని మోదీ


