ప్రముఖ పర్యావరణవేత్త, శాస్త్రవేత్త సోనమ్ వాంగ్ చుక్ గురించి చాలామందికి తెలిసే ఉంటుంది. 'త్రీ ఇడియట్స్' సినిమాని ఈయన జీవితాన్ని ఆధారంగా చేసుకుని తీశారని కొందరు, లేదు లేదు అని మరికొందరు వాదిస్తూ ఉంటారు. ఈ సంగతి పక్కనబెడితే కొన్నిరోజుల క్రితం ఢిల్లీలో 'జంతర్ మంతర్' దగ్గర జరిగిన విద్యార్థుల నిరసన కార్యక్రమంలోనూ ఆమరణ నిరాహార దీక్ష చేసి వార్తల్లో నిలిచారు. తాజాగా ఓ పాడ్కాస్ట్లో పాల్గొన్న ఈయన చాలా విషయాలు మాట్లాడారు. హీరో ఆమిర్ ఖాన్పై గట్టిగానే సెటైర్లు వేశారు. తనని కలిసి సంగతి అతడు 'గజిని'లా నిజంగానే మర్చిపోయాడని దెప్పిపొడిచారు.
(ఇదీ చదవండి: ట్రెండింగ్లో 'ఏష నాగుల'... టాలీవుడ్ను ఏలుతున్న తెలంగాణ ఫోక్!)
'ఆమిర్ ఖాన్ 'గజిని' లుక్లో ఉన్నప్పుడు నా ప్రసంగాన్ని చూస్తున్న వీడియోలు ఈ మధ్య మళ్లీ బయటకొచ్చాయి. బహుశా ఆ పాత్రలో ఎక్కువ లీనమైపోవడం వల్ల ఆయనకు ఆ పాత్రలా షార్ట్ టర్మ్ మెమొరీ లాస్ వచ్చి, 15 నిమిషాల తర్వాత నన్ను కలిసిన విషయాన్ని మర్చిపోయి ఉండొచ్చు. అందుకే ఆయన అలా చెప్పడం నాకు ఆశ్చర్యం అనిపించలేదు. మా మధ్య జరిగిన భేటీ కేవలం పలకరింపులకే పరిమితం కాలేదు. చాలాసేపు వివిధ అంశాల గురించి మాట్లాడుకున్నాం' అని సోనమ్ చెప్పుకొచ్చారు.
త్రీ ఇడియట్స్ సినిమాలోని పున్సుఖ్ వాంగ్డూ పాత్ర పూర్తిగా తనని ఆధారంగా చేసుకుని తీశారని తాను చెప్పడం లేదని వాంగ్ చుక్ స్పష్టం చేశారు. 'దానిని స్పూర్తి అనొచ్చు కదా. నేను చెప్పిన ఆలోచనలని ఆయన(ఆమిర్) రచయితలతో పంచుకుని ఉండొచ్చు. తర్వాత వాళ్లు స్టోరీకి అనుగుణంగా వాటిని మార్చి ఉండొచ్చు. అది ఆయనకు తెలియకుండానే జరిగుండొచ్చు. లేదంటే రచయితలకు ఈ ఆలోచనల ఎవరివి అనేది తెలిసి ఉండకపోవచ్చు. ఏది జరిగినా నాకు ఎలాంటి అభ్యంతరం లేదు' అని సోనమ్ అన్నారు.
గతంలో ఆమిర్ ఏమన్నాడు?
గతంలో ఓ కార్యక్రమంలో మాట్లాడిన ఆమిర్.. 'త్రీ ఇడియట్స్' సినిమాలోని పాత్రకు సోనమ్కి ఎలాంటి సంబంధం లేదని చెప్పాడు. అవన్నీ రూమర్స్ అని కొట్టిపారేశాడు. అదే టైంలో వాంగ్ చుక్ చేస్తున్న సేవలని ప్రశంసించాడు. అయితే తనతో మాట్లాడినప్పటికీ ఆమిర్.. ఈ స్టోరీకి తనకు సంబంధం లేదని అనేసరికి సోనమ్కి ఆగ్రహం వచ్చింది. అదే విషయాన్ని ఇప్పుడు పాడ్కాస్ట్లో వ్యంగ్యంగా వ్యక్తపరిచారు.
ఇక తన నిరహార దీక్ష టైంలో హీరో సల్మాన్ ఖాన్ చేసిన 'సోనం ఇట్స్ డన్ బ్రో' అనే ట్వీట్ పైన వాంగ్ చుక్ సరదాగా స్పందించారు. అందరికీ వారి వారి పరిస్థితులు, పరిమితులు ఉండుంటాయి. కాబట్టి వాటి గురించి నేను మాట్లాడాలనుకోవట్లేదు అని అన్నారు.
(ఇదీ చదవండి: ఓటీటీలోకి 'కొరియన్ కనకరాజు'.. అధికారిక ప్రకటన)


