సాక్షి, ముంబై : మహారాష్ట్ర ఫుడ్ అండ్ డ్రగ్స్ అడ్మినిస్ట్రేషన్ (FDA) తుకారాం ముండేకు మరోసారి చేదు అనుభవం ఎదురైంది. తుకారం నేతృత్వంలోని మహారాష్ట్ర ఫుడ్ అండ్ డ్రగ్స్ అడ్మినిస్ట్రేషన్ (FDA) జారీ చేసిన రెండు ప్రధాన చర్యలపై బాంబే హైకోర్టు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. నిబంధనలను పాటించకుండా, "సహజ న్యాయ సూత్రాలకు" (principles of natural justice) విరుద్ధంగా,చట్టాన్ని సరిగ్గా విశ్లేషించకుండానే అతిగా ప్రవర్తించి హడావుడిగా నిర్ణయాలు తీసుకున్నారని ఆగ్రహించింది. దీంతో పుణేలోని సిప్లా ఫార్మా అండ్ లైఫ్ సైన్సెస్ లిమిటెడ్ యూనిట్ డ్రగ్ సేల్ లైసెన్స్, బీకేసీ ఎంబీఏ (MCA) రెస్టారెంట్ల మూసివేత రద్దు చేస్తూ ఇచ్చిన రెండు ఆదేశాలను ఎఫ్డీఏ వెనక్కి తీసుకోవలసి వచ్చింది.
ముంబై క్రికెట్ అసోసియేషన్ ప్రాంగణంలోని ఆహారశాలలకు సంబంధించి చట్టాన్ని విశ్లేషించకుండా ఉత్తర్వులు జారీ చేయడాన్ని తొందరపాటు చర్యగా పేర్కొంటూ ఎఫ్డీఏను మందలించింది. ఈ సందర్భంగా హైకోర్టు ముండేను ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేసింది. అధికార ధోరణితో హద్దులు దాటి ప్రవర్తిస్తోందని గట్టిగా మందలించింది. అంతేకాదు "మీరేదో దేవుడనుకుంటున్నారా? అంటూ మండిపడింది.
యాక్టింగ్ చీఫ్ జస్టిస్ రవీంద్ర ఘుగే, జస్టిస్ గౌతమ్ అంఖడ్ లతో కూడిన ధర్మాసనం ఎఫ్డీఏ వైఖరిని తప్పుబడుతూ ‘‘మీరేదో దేవుడనుకుంటున్నారా? మీరు తలచుకుంటే ఏదైనా చేయవచ్చని భావిస్తున్నారా? దోమను చంపడానికి కత్తిని ఎందుకు ఉపయోగిస్తున్నారు?" అని హైకోర్టు తీవ్రంగా ప్రశ్నించింది. అలాగే ప్రభుత్వ సెలవు దినాన విచారణకు రావాలని ఇమెయిల్ పంపడం, సరైన ప్రక్రియను అనుసరించకపోవడంపై కోర్టు ఎఫ్డీఏను మందలించింది.
దీంతో ఎఫ్డీఏ తన రద్దు ఉత్తర్వును వెనక్కి తీసుకుంది. ఎఫ్డీఏ అధికారులపై కోర్టు ధిక్కార చర్యలు (Contempt action) తీసుకుంటామని హెచ్చరించడంతో, ఎఫ్డీఏ సస్పెన్షన్ ఉత్తర్వులను వెనక్కి తీసుకుంది. దీనితో ఆ రెస్టారెంట్లు తిరిగి ప్రారంభించేందుకు కోర్టు అనుమతించింది.
ఇదీ చదవండి: Nepal Flash Floods 1600 మందిని కాపాడిన ఒకే ఒక్కడు!
మరోవైపు ఎఫ్డీఏ పనితీరును ప్రశంసిస్తూనే, హద్దులు దాటుతున్నారు. ఇలా జరగడం ఇదే మొదటిసారి కాదు. తప్పు చేశారు, కాబట్టి ఇప్పుడు ఆ సమస్యను పరిష్కరించాలని ధర్మాసనం పేర్కొంది.


