ఎంఐఎం బేగ్‌ రాజీనామా.. రాజాసింగ్‌, బీజేపీ డిమాండ్‌ ఇదే | AIMIM Expels MLC Mirza Rehmat Baig Amid Viral Video Controversy And Allegations, Check More Details Inside | Sakshi
Sakshi News home page

ఎంఐఎం బేగ్‌ రాజీనామా.. రాజాసింగ్‌, బీజేపీ డిమాండ్‌ ఇదే

Aug 30 2026 11:03 AM | Updated on Aug 30 2026 11:49 AM

AIMIM Expels Leader Over Viral Video afetr BJP Says Not Justice

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రాజకీయాల్లో మిర్జా రెహ్మత్‌ బేగ్‌ వ్యవహారం తీవ్ర చర్చకు దారితీసింది. వైరల్‌ వీడియో, సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఆరోపణల నేపథ్యంలో ఆయనను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు ఎంఐఎం (AIMIM) ప్రకటించింది. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించినందుకే ఈ చర్య తీసుకున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు ఎంఐఎం సంయుక్త కార్యదర్శి ఎస్‌.ఏ. హుస్సేన్‌ అన్వర్‌ ప్రకటన విడుదల చేశారు.

ఎంఐఎం అధినేత, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీకి బేగ్‌ సన్నిహితుడిగా రాజకీయ వర్గాల్లో గుర్తింపు ఉంది. అయితే ఆయనకు సంబంధించిన ఓ వివాదాస్పద వీడియో ఆన్‌లైన్‌లో వెలుగులోకి రావడంతో వ్యవహారం ఒక్కసారిగా వేడెక్కింది. వీడియోపై పలు ఆరోపణలు సోషల్‌ మీడియాలో ప్రచారం కావడంతో పాటు.. తనను బెదిరిస్తూ, బ్లాక్‌మెయిల్‌ చేస్తున్నారంటూ బేగ్‌ హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులను ఆశ్రయించినట్లు సమాచారం. దీంతో వీడియో వెనుక అసలు కథ ఏమిటన్న దానిపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

అర్ధరాత్రి రాజీనామా ఎందుకు?
బేగ్‌ బహిష్కరణపై గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌ తీవ్రంగా స్పందించారు. ఉమ్రా కోసం సౌదీ అరేబియాలో ఉన్న బేగ్‌ను తిరిగి హైదరాబాద్‌కు ఎందుకు పిలిపించారు? అర్ధరాత్రి ఆయనతో రాజీనామా ఎందుకు చేయించారు? అనంతరం పార్టీ నుంచి ఎందుకు సస్పెండ్‌ చేశారంటూ ఎంఐఎంను ప్రశ్నించారు. ఈ వ్యవహారంపై అసదుద్దీన్‌ ఒవైసీ ప్రజలకు పూర్తి వివరాలు వెల్లడించాలని రాజాసింగ్‌ డిమాండ్‌ చేశారు. ఇదే సమయంలో సోషల్‌ మీడియాలో ప్రచారంలో ఉన్న లైంగిక నేరాలు, భూవివాదాలు, బెదిరింపులకు సంబంధించిన ఆరోపణలను కూడా ఆయన ప్రస్తావించారు. అయితే ఈ ఆరోపణలకు సంబంధించి అధికారికంగా నిర్ధారణ కాలేదని స్పష్టం చేయాల్సి ఉంది. ఆరోపణల్లో వాస్తవమెంత? అసలు ఏం జరిగిందన్నది దర్యాప్తులో తేలాల్సి ఉంది.

చదవండి: ఎంపీ అర్వింద్‌పై బీజేపీ నేతల అసంతృప్తి..

బీజేపీ డిమాండ్‌..
బేగ్‌ను పార్టీ నుంచి బహిష్కరించడం మాత్రమే న్యాయం కాదని తెలంగాణ బీజేపీ స్పష్టం చేసింది. ఈ వ్యవహారంపై స్వతంత్ర, నిష్పక్షపాత, కాలపరిమితితో కూడిన దర్యాప్తు జరగాలని డిమాండ్‌ చేసింది. వైరల్‌ వీడియో ఎక్కడి నుంచి వచ్చింది? దాని వెనుక ఎవరున్నారు? వీడియో నిజమైనదేనా? బేగ్‌ చేసిన సైబర్‌ క్రైమ్‌ ఫిర్యాదుకు, వైరల్‌ వీడియోకు ఏమైనా సంబంధం ఉందా? వంటి అంశాలను అన్ని కోణాల్లో దర్యాప్తు చేయాలని బీజేపీ కోరింది. అవసరమైతే కోర్టు పర్యవేక్షణలో విచారణ లేదా సీబీఐ దర్యాప్తు చేపట్టాలని డిమాండ్‌ చేసింది. దర్యాప్తులో రాజకీయ జోక్యం లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది.

డ్రైవర్‌ నుంచి ఎమ్మెల్సీ వరకు..
మిర్జా రెహ్మత్‌ బేగ్‌ రాజకీయ ప్రస్థానం ఎంఐఎం ఎమ్మెల్యే వద్ద డ్రైవర్‌గా పనిచేయడం ద్వారా ప్రారంభమైంది. అనంతరం పార్టీలో క్రమంగా ఎదుగుతూ కీలక స్థానానికి చేరుకున్నారు. 2023 ఫిబ్రవరిలో హైదరాబాద్‌ లోకల్‌ అథారిటీస్‌ ఎమ్మెల్సీ స్థానానికి ఎంఐఎం అభ్యర్థిగా బేగ్‌ పేరును అసదుద్దీన్‌ ఒవైసీ ప్రకటించారు. అనంతరం ఆయన ఏకగ్రీవంగా ఎన్నికై 2023లో తెలంగాణ శాసన మండలి సభ్యుడయ్యారు. అయితే తాజాగా వైరల్‌ వీడియో వివాదం, సోషల్‌ మీడియాలో ప్రచారంలో ఉన్న ఆరోపణలు, సైబర్‌ క్రైమ్‌ ఫిర్యాదు, పార్టీ బహిష్కరణతో బేగ్‌ వ్యవహారం రాజకీయంగా సంచలనంగా మారింది. ఈ వ్యవహారానికి సంబంధించిన అసలు వాస్తవాలు అధికారిక దర్యాప్తులోనే వెలుగులోకి రావాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement