మమ్దోట్: పంజాబ్లోని ఫిరోజ్పూర్ జిల్లా మమ్దోట్ పట్టణంలో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నేత గుర్ ప్రీత్ సింగ్ గోపీని గుర్తుతెలియని దుండగులు కాల్చి చంపారు. శనివారం జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుర్ ప్రీత్ సింగ్ గోపీ, హర్ప్రీత్ అనే వ్యక్తితో కలిసి మోటార్సైకిల్పై వెళ్తుండగా, కారులో వచ్చిన దుండగులు వారిని వెంబడించారు.
అనంతరం వారిపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో గోపీ అక్కడికక్కడే మృతి చెందారు. గోపీ, హర్ప్రీత్ల వెనుక మరో కారులో వస్తున్న వారి స్నేహితుల వాహనంపై కూడా దుండగులు కాల్పులు జరిపినట్లు సమాచారం. ఈ ఘటనపై సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్ఎస్పీ) భూపిందర్ సింగ్ సిద్ధూ మాట్లాడుతూ.. ఇరువర్గాల మధ్య ఉన్న పాత కక్షలే ఈ హత్యకు ప్రధాన కారణమని ప్రాథమిక విచారణలో తేలిందన్నారు. ఎన్నికల సంబంధిత వివాదం కూడా ఈ దాడికి కారణమని అనుమానిస్తున్నట్లు చెప్పారు.
నిందితులను ఇప్పటికే గుర్తించామని, వారిని పట్టుకునేందుకు ప్రత్యేక పోలీసు బృందాలను రంగంలోకి దించినట్లు వెల్లడించారు. ప్రధాన నిందితుడికి గతంలో నేర చరిత్ర ఉందని, చట్టవ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొన్నట్లు రికార్డులు ఉన్నాయని తెలిపారు. నిందితుల ఆచూకీ కోసం పలు ప్రాంతాల్లో ఏకకాలంలో దాడులు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ ఘటనతో రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితిపై మరోసారి సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది.
ఇది కూడా చదవండి: ఇంట్లో పిచ్చెక్కుతోంది.. డిష్వాషర్గా కార్పొరేట్ ఉద్యోగి!


