ఊనా: నేపాల్లో సంభవించిన ఆకస్మిక వరదల వల్ల హిమాచల్ ప్రదేశ్లోని ఊనా జిల్లాకు చెందిన మెకానికల్ ఇంజినీర్ సుఖ్విందర్ ఆచూకీ గల్లంతైంది. రసువా, నువాకోట్ జిల్లాల పరిధిలోని త్రిశూలి జలవిద్యుత్ ప్రాజెక్టులో ఆయన విధులు నిర్వహిస్తున్నారు. మూడు నెలల సెలవు అనంతరం ఆగస్టు 15నే ఆయన తిరిగి నేపాల్ వెళ్లారు. బుధవారం నేపాల్లో వరదలు ముంచెత్తినప్పటి నుంచి కుటుంబ సభ్యులు ఆయనతో సంప్రదించేందుకు ప్రయత్నిస్తున్నప్పటికీ ఫలితం లేకుండా పోయింది.
సుఖ్విందర్ను క్షేమంగా రక్షించాలని కోరుతూ కుటుంబ సభ్యులు కేంద్ర ప్రభుత్వంతో పాటు స్థానిక ఎంపీ అనురాగ్ ఠాకూర్ను ఆశ్రయించారు. సుఖ్విందర్ గతంలో భూటాన్లో పనిచేశారని, అనంతరం సంస్థ ఆయన్ను నేపాల్కు బదిలీ చేసిందని తండ్రి హుసన్ లాల్ తెలిపారు. ఖాట్మండులో ఉంటున్న తమ బంధువు కూడా సుఖ్విందర్ కోసం ఆరా తీస్తున్నా ఎలాంటి సమాచారం దొరకలేదని, దుబాయ్లో ఉండే పెద్ద కుమారుడు కూడా సోదరుడిని వెతికేందుకు ఖాట్మండు చేరుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సుఖ్విందర్కు వివాహమై, 18 నెలల కుమారుడు ఉన్నాడు.
సుఖ్విందర్ గల్లంతుపై ఉన్నతాధికారులకు, సంబంధిత మంత్రిత్వ శాఖకు సమాచారం అందించినట్లు ఊనా ఎస్డీఎం అభిషేక్ మిత్తల్ తెలిపారు. కాగా, చంబా జిల్లాకు చెందిన సల్మాన్ ఖాన్ అనే మరో యువకుడు తాను నేపాల్లో సురక్షితంగా ఉన్నట్లు కుటుంబానికి తెలిపాడు. ఆయన పనిచేస్తున్న ప్రాంతం వరద ప్రభావిత ప్రాంతానికి వేరొక వైపు ఉండటం, ఆ సమయంలో సొరంగంలో ఉండటంతో ప్రమాదం తప్పింది.
విపత్తులో చిక్కుకున్న పౌరులకు సహాయం అందించి, వారిని సురక్షితంగా రాష్ట్రానికి తీసుకురావడమే ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యమని విపత్తు నిర్వహణ సంస్థ డైరెక్టర్ పేర్కొన్నారు. ప్రభుత్వం, విదేశాంగ శాఖ, ఖాట్మండులోని భారత రాయబార కార్యాలయంతో నిరంతరం సమన్వయం చేసుకుంటోంది. బాధిత కుటుంబాల సహాయార్థం అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేశారు.
ఇది కూడా చదవండి: కష్టాల ఊబిలోంచి.. దర్జీ కూతురి ‘సీఎస్’ విజయం


