న్యూఢిల్లీ: హిందూకుష్ హిమాలయ ప్రాంతంలో సంభవించే హిమానీనదీ సరస్సుల విస్ఫోటన వరదల వల్ల సంభవించిన మరణాల్లో భారత్ అగ్రస్థానంలో ఉందని ఐక్యరాజ్యసమితి నేతృత్వంలోని తాజా అధ్యయనం వెల్లడించింది. ఆరు దేశాల నిపుణులు రూపొందించిన ‘హిందూకుష్ హిమాలయ ప్రాంతంలో హిమానీనద సరస్సుల విస్ఫోటన వరద ముప్పు, నిర్వహణ వ్యూహాలు, అనుసరణ లోపాలు’ అనే నివేదిక 1835 నుండి 2025 వరకు గల గణాంకాలను విశ్లేషించింది.
ఈ అధ్యయనం ప్రకారం, హిందూకుష్ హిమాలయ పరిధిలోని 8 దేశాల్లో సంభవించిన వరదల ఘటనల సంఖ్య పరంగా భారత్ మూడో స్థానంలో ఉంది. చైనాలో అత్యధికంగా 199, పాకిస్థాన్లో 152, భారత్లో 62, నేపాల్లో 58 ఘటనలు నమోదయ్యాయి. అయితే, ప్రాణనష్టం విషయంలో భారత్ తీవ్ర ప్రభావాన్ని ఎదుర్కొంది. భారత్లో అత్యధికంగా 6,119 మంది మరణించగా, పాకిస్థాన్లో 1,991, చైనాలో 625 మరణాలు సంభవించాయి. ప్రజల నిర్వాసితుల సంఖ్యలోనూ భారత్ మొదటి స్థానంలో నిలిచింది.
1950 తర్వాత వాతావరణ మార్పుల కారణంగా ఆకస్మిక వరదల తీవ్రత గణనీయంగా పెరిగిందని నివేదిక పేర్కొంది. 1950కి ముందుతో పోలిస్తే దశాబ్దానికి సగటున 34 ఘటనలు నమోదవుతున్నాయి. దాదాపు 50 శాతం విస్ఫోటనాలకు మంచు చరియలు విరిగిపడటం, 25 శాతం ఘటనలకు భారీ వర్షాలు ప్రధాన కారణాలుగా నిలిచాయి. దాదాపు 70 శాతం ఘటనలు వేసవి, వర్షాకాలంలోనే సంభవించాయి. పర్వత లోయల్లోని రాళ్ల వ్యర్థాలు, మంచు ఆనకట్టల వెనుక ఏర్పడే సరస్సులలో నీటి మట్టం పెరిగి సహజ ఆనకట్టలు తెగిపోవడమే ఈ విపత్తుకు కారణం. భారత్లో ముందస్తు రక్షణ చర్యలు, సన్నద్ధత సరిపోకపోవడం వల్లే ఘటనలు తక్కువైనా మరణాల సంఖ్య భారీగా ఉందని నివేదిక స్పష్టం చేసింది. 2023 తీస్తా వరదలు, 2025 చమోలీ ఘటనల నుండి సరైన గుణపాఠాలు నేర్చుకోకపోతే భవిష్యత్తులో తీవ్ర ప్రాణనష్టం తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఇది కూడా చదవండి: ప్రముఖ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ దారుణ హత్య


