నేపాల్ను వరదలు వణికిస్తున్నాయి.. వరద బీభత్సానికి సంబంధించిన భయానక దృశ్యాలు వెలుగులోకి వస్తున్నాయి. టిబెట్ సరిహద్దు ప్రాంతంలో విరుచుకుపడిన వరద.. ఓ నదీ తీర గ్రామాన్ని క్షణాల్లో ముంచెత్తింది. భారీగా వచ్చిన బురదతో కూడిన వరదనీళ్ల ధాటికి ఇళ్లు, వాహనాలు, రహదారులు, వంతెనలు కొట్టుకుపోయాయి.
భోటేకోశి, త్రిశూలి నదుల పరివాహక ప్రాంతాల్లో వరద ప్రవాహం ఒక్కసారిగా ఉధృతమైంది. నదులు పొంగిపొర్లడంతో నీరు, బురద జనావాసాల్లోకి దూసుకెళ్లాయి. చూస్తుండగానే ఓ నదీ తీర ప్రాంతం మొత్తం బురదగా మారిపోయింది. ఆ తర్వాత వరద ప్రవాహం దిగువ ప్రాంతాల వైపు కొనసాగింది. ఈ భారీ విపత్తులో 1,400 మందికి పైగా ఆచూకీ గల్లంతవ్వగా.. 392 మంది మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు.
ఈ వరదల తాకిడికి వందల సంఖ్యలో వంతెనలు ధ్వంసమయ్యాయి. దాదాపు 40 కిలోమీటర్ల మేర రహదారులు దెబ్బతిన్నాయి. దీంతో సహాయక, గాలింపు చర్యలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. హిమానీనదం నుంచి మంచు విరిగిపడటం వల్లే ఈ ఆకస్మిక వరద సంభవించి ఉండొచ్చని అంచనా. ఒక దశలో త్రిశూలి నదిలో నీటి మట్టం కేవలం అరగంటలోనే 9 మీటర్ల వరకు పెరిగినట్లు ఖాట్మండులోని ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఇంటిగ్రేటెడ్ మౌంటెన్ డెవలప్మెంట్ నిపుణులు తెలిపారు.
Bright daylight, clear skies, and then suddenly a tsunami like wave crashes into a village. These scenes from Nepal today are beyond horrific. Everything feels like a doomsday scene.95+ people reported killed and 500+ still missing. Prayers for everyone #Nepal 🙏 https://t.co/0aIccVPsd8 pic.twitter.com/zSOXpiA0nK
— Nikhil saini (@iNikhilsaini) August 26, 2026
రాసువా జిల్లాలో సహాయక, పునరావాస చర్యలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో నేపాల్లో 290 మంది భారతీయుల ఆచూకీ ఇంకా తెలియరాలేదని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) గురువారం వెల్లడించింది. ఇప్పటివరకు 84 మంది భారతీయులను రక్షించినట్లు తెలిపింది. ఆచూకీ తెలియని వారిలో కైలాస మానస సరోవర్ యాత్రకు వెళ్లిన పలువురు, త్రిశూలి-1 విద్యుత్ ప్రాజెక్టులో పనిచేస్తున్న కార్మికులు, వివిధ రాష్ట్రాలకు చెందిన పర్యాటకులు ఉన్నారు.
ఇదీ చదవండి: యుగాంతం రేంజ్లో ముప్పు?.. నేపాల్కు చైనా మరో డెడ్లీ వార్నింగ్!


