మన చుట్టూ, రోజువారీగా ఎదురవ్వుతున్నా సమస్య, అందరూ అంతగ పట్టించుకోని దానిపై చేసిన ఆవిష్కరణ..ఆమెను యావత్తు ప్రపంచానికి తెలియజేసేలా చేసింది. ఓ మారుమూల గ్రామంలో కిరోసిన్ దీపం కింది చదువుకునే ఓ పల్లెటూరి అమ్మాయి టాలెంట్ ఏంటో ప్రపంచానికి అర్థమయ్యేలా చేసి గ్రామంలోని స్టూడెంట్స్ ప్రతిభవైపు తిరిగి చూసేలా చేసింది. అంతేగాదు ఏకంగా అంతర్జాతీయ వేదికపై మెరిసి తన ఆలోచనలను పంచుకునే అవకాశం దక్కించుకుంది. అంతేగాదు ఆ చిన్న ఆవిష్కరణ ఆమెను ఎంత పెద్ద లక్ష్యానికి పురిగొల్పిందో వింటే విస్తుపోతారు.
ఆ అమ్మాయే ఉత్తరప్రదేశ్లోని బారాబంకి జిల్లాలోని ఓ మారుమూల గ్రామానికి చెందిన పూజాపాల్. ఆమె చేసిన ఆవిష్కరణ ఏమి ప్రయోగాసాలల్లో, ఖరీదైన పరికరాలతో ప్రారంభ కాలేదు. ఆమె రోజు చూసే ఒక సమస్యతో మొదలైంది. అందరూ అంతగా పట్టించుకోకుండా తేలిగ్గా వదిలేసిన సమస్యను ఆమె మదిని తొలిచి ఆవిష్కరణకు నాంది పలికింది. పైగా ఆమె సాధారణ ఆర్థిక పరిస్థితి నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చింది. ఆమె తండ్రి పుట్టిలాల్ రోజువారీ కూలీగా పనిచేస్తుండగా, తల్లి సునీలా దేవి ప్రభుత్వ పాఠశాలలో వంటమనిషిగా పనిచేస్తోంది.
మట్టి ఇంటిలో నివసించేది ఆమె కుటంబం. కనీసం విద్యుత్ సౌకర్యం కూడా లేదు. కిరోసిన్ దీపం కింద చదువుకునే ఆ అమ్మాయికి ఎనిమిదో తరగతిలో ఉండగా ధాన్యం నూర్పిడిలో ఉండే ఇబ్బందులను కళ్లారా చూసింది. ఆ ధాన్యం మార్పిడి కారణంగా వచ్చే దుమ్మ వల్ల పిల్లలు, పెద్దలు దగ్గుతో ఇబ్బంది పడుతుండటం గమనిస్తుంది. ఈ సమస్యకు పరిష్కారం పెట్టడం ఎలా అని రోజు ఆలోచిస్తూ ఉండేది. ఇంట్లో ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రం. చాలిచాలని భోజనంతో ఆహారం ముగించే తాను ఇది తనవల్ల ఎలా సాధ్యం అని అనుకోలేదు.
ఎలాగైనా ఈ సమస్యకు పరిష్కారం చూపాలన్నదే తన ఆశయం అన్నట్లుగా పూజా పలు ప్రయత్నాలు చేస్తుండేది. ఆ దుమ్ము కారణంగా కలిగే ఇబ్బంది అంత ఇంత కాదు..అందుకే పూజా దీనిన ఎలా పరిష్కరించాలి అని పరిపరి విధాలుగా ఆలోచించడం మొదలుపెట్టింది. అసలు గ్రామం దాటి వెళ్లడం ఎరుగని అమ్మాయి మొదటి సారి జిల్లా వరకు ప్రయాణించి తన సైన్స్ టీచర్ మార్గదర్శకంలో ఒక వెల్డర్ సహాయంతో ఈ సమస్యకు చెక్పెట్టే నమునాను తయారుచేసింది.
అదే దుమ్ము రహిత త్రెషర్ నమునా. గాలిలో ఎగిరే ధాన్యం పొట్టును వేరుచేసే నమునా ఇది. ఇందులో టిన్, ఫ్యాన్ వంటి ఉండవు, దుమ్ము రూపంలో ఉండే పొట్టుని వేరుచేస్తుంది. ఇందుకోసం పూజాకు అయ్యింది రూ, 3 వేలు మాత్రమే. కానీ అది ఆమె కుటుంబం పరంగా పెద్దమొత్తమే. ఈ నమునాను తయారు చేసేటప్పడు స్థానిక ప్రజలు పెద్ద సైంటిస్ట్ లెక్క ఏదో చేసేస్తుంది అని ఎగతాళి చేసేవారని, కానీ అవేమి పట్టించుకోకుండా ముందుకు సాగినట్లు చెబుతోంది పూజా.
అయితే ఆమె పాఠశాల ఉపాధ్యాయుడు మాత్రం దీన్ని ఒక పాఠశాల స్థాయి ప్రయోగానికి మించిన ఆవిష్కరణగా ఆయన గుర్తించారు. అంతేగాదు రోజువారీ సమస్యలకు వినూత్న పరిష్కారాలను అభివృద్ధి చేయడానికి పాఠశాల విద్యార్థులను ప్రోత్సహించే 'ఇన్స్పైర్-మానక్' కార్యక్రమంలో పూజాను పాల్గొనేలా చేసి తన నమునాను సమర్పించేలా ప్రోత్సహించారు ఆయన. ఆ ప్రాజెక్ట్కి రాష్ట్ర స్థాయిల నుంచి జాతీయ గుర్తింపుకి దారితీసే జాతీయ సైన్స్ప్రదర్శనలో తన ఆవిష్కరణను ప్రదర్శించే అవకాశం కూడా దక్కించుకుందామె.
అక్కడితే పూజా ప్రస్థానం ఆగిపోలేదు..
సైన్స్ కార్యక్రమాల్లో భాగంగా జపాన్కు వెళ్లే ఛాన్స్ వచ్చింది. ఆ ఏడాది సకురా సైన్స్ హై స్కూల్ ప్రోగ్రామ్ కోసం ఎంపికైన 54 మంది భారతీయ విద్యార్థులలో ఉత్తర ప్రదేశ్ నుంచి ఎంపికైన ఏకైక విద్యార్థిని పూజా. ఒకప్పుడు బారాబంకి చేరుకోవడమే పెద్ద గగనంగా ఉండేది, అలాంటిది విదేశంలోకి అడుగుపెట్టే రేంజ్కి రావడం అంటే..ఆశ్చర్యం, గర్వం ఒకేసారి కలిగాయని అంటోంది పూజా. ఆ జపాన్ పర్యటనలో చిన్ని చిన్న విషయాలు కూడా ఎంతో ఆశ్చర్యానికి గురి చేశాయని అంటోంది. అది తనకు చాలా గౌరవప్రదమైన టూర్ అని గర్వంగా చెబుతోంది.
పొందిన రివార్డులు, సత్కారాలు..
అంతేగాదు ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై రూపొందించిన 'కర్మయోగ: ఏక్ అనంత యాత్ర' అనే డాక్యుమెంటరీలో పూజ ప్రస్థానాని చూపించడంతో సెప్టెంబర్ 2025లో ఆమె కథకు మరోసారి జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. నిజానికి 'బేటీ బచావో, బేటీ పఢావో' ప్రచారంలో భాగంగా విద్యతో ఆమె తన జీవితాన్ని ఎలా మార్చుకుందో ఉదాహరణగా పూజాను చూపించారు. అలా ఆమెకు గుర్తింపు పెరుగుతూనే ఉంది. అంతేగాదు సైన్స్లో ఆవిష్కరణలు చేసినందుకు గానూ డిసెంబర్ 2025లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కారం అందుకుంది.
అంతేగాదు ఆమె ఉత్తరప్రదేశ్లోని మిషన్ శక్తి రోల్ మోడల్గా కూడా గుర్తింపు పొందింది. అంతేగాదు రాష్ట్ర గృహనిర్మాణ పథకంలో ఆమె కుటుంబానికి నివాస వసతి సైతం కల్పించింది రాష్ట్ర ప్రభుత్వం. ప్రస్తుతం పూజా ఇంటర్ చదువు కోసం నిధులు సమకూర్చుకోవడానికి, అలాగే పేరెంట్స్కి ఆర్థికంగా సహాయపడటానికి ఒక చిన్ని వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటున్నట్లు వెల్లడించింది. అంతేగాదు ఒకప్పుడూ మమ్మల్ని చిన్నచూపు చూసిన వాళ్లు మమ్మల్ని చూసి ఆశ్చర్యపోయేంతగా ఎదగాలన్నదే తన ధ్యేయం అని ఆత్మవిశ్వాసంగా చెబుతోంది పూజాపాల్.
పూజా కథ ఒక పల్లెటూరి అమ్మాయి తన అపారమైన ప్రతిభతో, ఎంత దూరమైన ప్రయాణించగలదని చూపడమే గాక, విద్య, చిన్న చిన్న సమస్యల పట్ల నిశితమైన పరిశీలన మనలోని టాలెంట్ని వెలికితీసి ఆవిష్కరణలకు దారితీస్తుందని చాటి చెప్పింది. అంతేగాదు మనకు సాధించాలనే ఆకాంక్ష, పట్టుదల ముందు పరిమిత వనరులు అడ్డంకి కావని పూజపాల్ కథ చెబుతోంది.
(చదవండి: 16 ఏళ్ల స్టూడెంట్ ఘనత..! తండ్రికే జీతం ఇస్తున్న తనయుడు..)


